చిత్తూరు జిల్లాలో ఉదయం 10 నుంచే కర్ఫ్యూ

జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కర్ఫ్యూ సమయం పెంపు

జూన్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అమలు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక రకాల చర్యలు చేపడుతున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేంద్రం ఆక్సిజన్, మెడిసిన్, వ్యాక్సిన్లు అరకొరగా సరఫరా చేస్తున్నా.. అనేక రకాలుగా ప్రయత్నాల చేసి ఆక్సిజన్‌ అందుబాటులోకి తెస్తున్నారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో కరోనా నివారణ చర్యలపై తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు దగ్గరగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో దగ్గరలో ఉన్నాయని, ఆయా కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. జిల్లాలోని అన్ని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించామన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎవరినీ జిల్లాలోకి అనుమతించవద్దని, అత్యవసరం అయితే అనుమతి తీసుకోవాలని, కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకొని నెగిటివ్‌ వస్తేనే చిత్తూరుకు వచ్చేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. 

జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ సమయం పెంచి పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించామని మంత్రిపెద్దిరెడ్డి చెప్పారు. జూన్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఉంటుందని, ఆ ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న ఈ నిర్ణయం తీసుకున్నామని, దయచేసి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.  
 

తాజా వీడియోలు

Back to Top