విశాఖ: రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని మంత్రి తెలిపారు. ఒకరు, ఇద్దరు వెళ్ళిపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అనేది అమయకత్వమేనని వ్యాఖ్యానించారు. ఖాళీ అయ్యేది జనసేన, టీడీపీలు మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చు.. కాంగ్రెస్ లో చేరినా, కేఏ పాల్ పార్టీలో చేరిన తమకేం సంబంధం లేదని తెలిపారు. సీటిస్తేనే పార్టీలో ఉంటాము అనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైయస్ఆర్సీపీదని మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మారాను తప్ప జనసేన, పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదని అన్నారు. పవన్ కల్యాణ్ సీటు కూడా చంద్రబాబు డిసైట్ చేస్తారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. జనసేన భవిష్యత్ లోకేశ్ డిసైడ్ చేస్తున్నారని తెలిపారు. జనసేన గాలి పార్టీ కనుకే టీడీపీ జెండాలు మోస్తోందని మంత్రి కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ పదవి గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించడమే ఆ రెండు పార్టీల పరిస్థితికి నిదర్శనం అన్నారు. ఎన్నికల హామీకి కట్టుబడి పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ ను పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.