మా ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్ర‌వ‌ర్తిస్తే ఖబడ్దార్‌..

అమాయకులను తినేసే టీడీపీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

విశాఖకు పరిపాలన రాజధాని సాధించుకునేందుకు ఎంతటిపోరాటానికైనా సిద్ధం

విశాఖ గర్జన ర్యాలీ అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు

విశాఖపట్నం: విశాఖకు పరిపాలన రాజధాని సాధించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనలు సమర్థిస్తున్న రాజకీయ పార్టీలు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.  వర్షం పడినా ఏకధాటిగా విశాఖ గర్జన ర్యాలీ జరిగిందంటే మా ప్రాంత ప్రజల్లో ఎంత ఆకాంక్ష ఉందో అర్థం చేసుకోవాలన్నారు. విశాఖ గర్జన ర్యాలీ అనంతరం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

ఎవరు అమాయకంగా ఉండే వారిని తినేసే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమం చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. రాజధానిని కొద్దిమంది స్వార్థానికి ఉపయోగించుకునే వారినిద్రోహులు అంటాం. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. హక్కులు సాధించుకోవడం సాధారణంగా జరగవని, అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధం కావాలన్నారు. మన పొట్ట కొట్టినందుకు, మన నోటి వద్ద కూడు కొట్టినందుకు, మన ప్రాంత ప్రజలకు ఉద్యోగాలకు రాకుండా చేసినందుకు, మన ప్రాంతంలో విద్యాలయాలు రాకుండా చేసినందుకు, మన ప్రాంతానికి పరిశ్రమలకు రాకుండా చేసినందుకు, మన బతుకులు 130 సంవత్సరాల్లాగే ఉండాలని అనుకుంటున్న వారికి వ్యతిరేకంగా గట్టిగా రాజకీయ పోరాటం చేద్దామన్నారు. 

విశాఖ పరిపాలన రాజధాని సాధించుకోవడానికి మన వాదనను దేశానికి బలంగా వినిపించాలన్నారు. మనందరి ఆశయం, ప్రయోజనం కోసం మనకు బలమైన, స్థిరమైన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఉన్నారని భరోసా ఇచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ ఉండగా మనకెందుకు భయం.. ముందుకు సాగండి.. ఉద్యమాన్ని నడపండి మనం అనుకున్నది సాధిద్దాం. ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని తీసుకొద్దాం.. అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. విశాఖ గర్జనలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 
 

Back to Top