తాడేపల్లి: ‘ఈ రాష్ట్ర రాజకీయాల్లో పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు.. చంద్రబాబు లాంటి పనికిమాలిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండబట్టే.. రాజకీయ విలువలు తగ్గిపోతున్నాయి.. పనికిమాలిన పదానికి చంద్రబాబే పేటెంట్’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బైజూస్.. వైయస్ జగన్ జూస్ అని మాట్లాడే చంద్రబాబుకు.. ఆ సంస్థ గురించి తెలుసా..? తెలియకపోతే ఇంట్లో ఉన్న వారి మనవడిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. 35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ఇవ్వడానికి బైజూస్ సంస్థ ముందుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నారు. ఇంగ్లిష్ బోధన మమ్మీడాడీ కోసమా అని మాట్లాడే చంద్రబాబు.. కొడుకుని, మనవడిని ఇంగ్లిష్ మీడియంలో ఎందుకు చదివించాడని ప్రశ్నించారు. చంద్రబాబు భాష, మాటలు వింటుంటే మతిస్థిమితం కోల్పోయాడు.. ఆయన పని అయిపోయిందనే అభిప్రాయం కలుగుతుందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స ఏం మాట్లాడారంటే..
‘చంద్రబాబు పనైపోయింది.. అందుకే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని అనిపిస్తోంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో నీఅంత పనికిమాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? పనికిమాలిన పదానికి చంద్రబాబు పేటెంట్. వెన్నుపోటు, మ్యానిపులేషన్, ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిందా..? దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని సంకలు నాకావో.. ఎంతమందికి ఊడిగం చేశావో.. అన్నీ పక్కనబెడితే.. నీకంటే పనికిమాలిన వారు ఎవరైనా ఉన్నారా..? దీపం ఆరిపోయేముందు ఎలాగైతే వెలుగు వస్తుందో.. అలాగ గట్టిగా అరుస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడినదాంట్లో బాధ్యత గల మాటలు ఉన్నాయా..?
రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుంటే.. అది బైజూసో, వైయస్ జగన్ జూసో అని వెటకారంగా మాట్లాడుతున్నాడు. అంటే నీ హెరిటేజ్ సంస్థలో అమ్ముకునే జ్యూస్ అనుకుంటున్నావా..? ప్రపంచంలో 150 మిలియన్ల విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని చదువుతున్నారు. నీకు తెలియకపోతే ఇంట్లో నీ మనవడిని అడుగు బైజూస్ గురించి చెప్తాడు. ఇంగ్లిష్ బోధన అంటే మమ్మీడాడీ కోసమా అని మాట్లాడుతున్నాడు.. నీ అబ్బాయిని మమ్మీడాడీ కోసమే ఇంగ్లిష్ మీడియంలో చదివించావా..? దేనికోసం చదివించావ్.. దేనికోసం విదేశాలకు పంపించావ్..? నీ కొడుకు, నీ మనవడు ఇంగ్లిష్ మీడియం చదువుకోవాలి.. విదేశాలకు వెళ్లాలి.. నీకు తోడుగా దోచుకుతినడమే నీ తత్వం.
పేదపిల్లలు, ఆర్థికంగా అవకాశాలు లేనివారు, గ్రామీణప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు ఇంగ్లిష్ చదువులు వద్దా..? ఇంటర్నేషన్ సంస్థ బైజూస్తో ఒప్పందం చేసుకుంటే ఎగతాళి చేస్తావా..? నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక్క మాటైనా రాష్ట్రం కోసం, ఒక ప్రాంతం కోసం మాట్లాడానని చెప్పు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు చేసుకుంటూ.. తిరిగి అందరినీ పనికిమాలినోళ్లు అంటున్నాడు. వయసు పెరిగితే కాదు, అనుభవం ఉంటే కాదు, మంచి సలహాలు, ఆలోచనలు ఉండాలి.
బైజూస్తో జరిగిన ఒప్పందం తప్పు అని ఈ ప్రపంచంలో ఒక్కరితోనైనా చెప్పించు. 4నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న సుమారు 35 లక్షల మంది పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉచితంగా కంటెంట్ను ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. దావోస్ వెళ్లినప్పుడు బైజూస్ చైర్మన్ సీఎం వైయస్ జగన్ను కలిసి.. పిల్లలకు ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెబితే సీఎం వెల్కం చెప్పారు. 20 రోజుల్లో ఈ కార్యక్రమం చేసినందుకు గర్వపడాలి. గ్రామీణ ప్రాంతాలు, సామాన్య, మధ్య తరగతి పిల్లలకు ఇలాంటి అవకాశం కల్పించారు. దాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.20 వేలు ఖర్చు అవుతుంది. అటువంటి దాన్ని ఉచితంగా పిల్లలకు అందజేస్తుంటే.. ఏంటామాటలు చంద్రబాబూ..?
ఖాళీగా ఉన్న చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది. హెరిటేజ్ వ్యాపారం చూసుకుంటూ ఏజ్యూస్ ఎంత, ఏ పాలు ఎంత, ఏ పెరుగు అంత అనేది చంద్రబాబుకు అలవాటైపోయినట్టుంది. అందుకే అదేయావతో వచ్చి మీటింగ్లో కూడా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయాడు. సామాజిక న్యాయంపై డిబేట్కు రండీ.. నువ్వు వస్తావో.. నీ తాబేదాలు వస్తారో రండీ.
అధికారంలో ఉన్నప్పుడు విజయనగరంలో మంత్రిగా ఎవరికి అవకాశం ఇచ్చాడు. అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రి, వైయస్ఆర్ సీపీలో గెలిచి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి సుజయ కృష్ణరంగారావుకు మంత్రి పదవి ఇచ్చాడు. నువ్వా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎక్కడుంది..? సీఎం వైయస్ జగన్ వచ్చాక మంజూరు చేశారు.. కాలేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. 85 శాతం తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేసి.. మిగిలిన 15 శాతం పూర్తిచేయమని అప్పగిస్తే.. 5 శాతం చేసి దాన్ని పట్టించుకోలేని వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడు.
సుజల స్రవంతి, విశాఖలో ఇండస్ట్రీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. విశాఖ అభివృద్ధి చెందిందంటే.. అది దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వల్లేనని గర్వంగా చెబుతున్నాను. ఐటీపార్కు, ఎస్సీజెడ్, ఉపాధి కల్పన పరిశ్రమలు, ఫార్మసిటీ అన్నీ వైయస్ఆర్ హయాంలోనే వచ్చాయి. అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మేస్తారని చంద్రబాబు అనుకుంటున్నాడు. విజయనగరం, విశాఖ ప్రజలు గొ్రరెలని చంద్రబాబు అనుకుంటున్నాడా..?
చంద్రబాబు లాంటి పనికిమాలిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండబట్టే.. విలువలు తగ్గిపోతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం పోయాక మరోమాట. ఎన్నికల ముందు ఏం చెప్పారో.. అదే మాట సీఎం వైయస్ జగన్ మాట్లాడుతున్నారు. విద్యకు అత్యంత ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇస్తున్నారు. బడికి రంగులు వేయడం కాదు.. ఆహ్లాదకరమైన వాతావరణం, చదువుకునే పరిస్థితి కల్పించి, బోధన కల్పించడం మాకు తెలుసు. నీలాగా ప్రభుత్వ స్కూళ్లు మూసేసి.. ప్రైవేట్ నారాయణ విద్యాసంస్థల్లో చూసిరాతపోటీలు పెట్టడం కాదు. నీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల అడ్మీషన్ ఎంత..? 35 శాతం ప్రభుత్వ బడుల్లో, 65 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేవారు. వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక నిర్ణయాలు, నాడు–నేడు మార్పుల వల్ల, పర్యవేక్షణ వల్ల 60 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 40 శాతం మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు.
పదో తరగతి ఫలితాలపై నానా యాగీ చేస్తున్నాడు. ఏపీలో 67 శాతం వస్తే.. గుజరాత్ 61 శాతం వచ్చింది మరి ఏం మాట్లాడుతావ్. పరీక్ష అంటూ చూచిరాతపోటీలు అనుకున్నావా చంద్రబాబూ..? ఎంతసేపూ బ్యాక్డోర్ పాలిటిక్స్. సహనం కోల్పోయి, పిచ్చిపట్టినవారు మాట్లాడే మాటలు ఇవి. నిన్న, మొన్న చంద్రబాబు భాష చూసిన తరువాత ఆయన పని అయిపోయింది అనుకున్నాను.