విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల పై సమీక్షించామని తెలిపారు. త్వరలో బదిలీల పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
విశాఖపట్నం పరిపాలన రాజధాని మా పాలసీ. అమరావతి రాజధాని అయితే, చంద్రబాబు కాపురం హైదరాబాద్లో ఎందుకు పెట్టారు. కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి? అని మంత్రి ప్రశ్నించారు. మేం డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు. నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి జోస్యం చెప్పారు. చంద్రబాబు మంచి నటుడు, మ్యానిపులేటర్ అంటూ మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై పరిశీలిస్తున్నామని, సీఎం వైయస్ జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పరీక్షలు, ఒంటి పూట బడుల వలన చిక్కిలు ఇస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.