ప్రజాబలం సీఎం వైయస్‌ జగన్‌ సొంతం

తిరుపతి ఉప ఎన్నికలోనూ వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు పట్టం కట్టారని, ఇందుకు కార్పొరేషన్, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారని చెప్పారు. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు ఉన్న సంబంధం ఏమిటో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎవరిని తెచ్చుకున్నా సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజాబలం ఉందన్నారు. 

ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ విషయంపై బీజేపీ ఏం చెబుతుందని, విభజన చట్టంలోని అంశాలు, హామీలు ఏమయ్యాయని బీజేపీ నేతలను ప్రశ్నించారు. మోసాలు, మాయలు చేసేవారిని ఎవరూ నమ్మరన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టే ప్రజలు తిరుగులేని విజయాలను అందిస్తున్నారని మంత్రి బొత్స అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశామన్నారు. కొన్ని దుష్టశక్తులు అడ్డుకుని కోర్టుకు వెళ్లాయని, న్యాయ స్థానానికి అన్ని అంశాలను వివరిస్తామన్నారు. ఏ క్షణమైనా పరిపాలనా రాజధానికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. 
 

Back to Top