శ్రీకాకుళం : రైతు సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం సమావేశం బుధవారం ఆనందమయి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన సోదరులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సుమారు 62 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. రైతును అన్నదాతగా గౌరవిస్తున్నామని చెబుతున్నప్పటికీ, నేడు రైతు నిజంగా సుఖంగా ఉన్నాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలని అన్నారు. వ్యవసాయం కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, అది జీవన విధానమని పేర్కొన్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా, వినతిపత్రాలు అందజేసినా స్పందించాల్సిన ప్రభుత్వం, బదులుగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆంక్షలు విధిస్తూ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం వైయస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని వేదికలను వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జెన్నూరి రామారావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు , ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్రెల కిరణ్ కుమార్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, జోనల్-1 రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గొండు రఘురామ్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు, మండల రైతు విభాగం అధ్యక్షులు, శ్రీకాకుళం నియోజకవర్గంలోని మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.