నెల్లూరు: ఈఎస్ఐ స్కామ్లో రూ.150 కోట్ల అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే.. కిడ్నాప్ చేశారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. అవినీతి చేసిన వ్యక్తిని అరెస్టు చేస్తే.. దాన్ని కులాలకు ఆపాదించడం సరికాదన్నారు. నెల్లూరులో మంత్రి అనిల్కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కామ్లో పూర్తి విచారణ జరుగుతోందని, పెద్దబాబు, చిన్నబాబు పాత్ర కూడా బయటకొస్తుందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అవినీతి పాల్పడి అరెస్టు అయిన అచ్చెన్నాయుడికి అండగా నిలవాలని చంద్రబాబు బీసీలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాసిన సంగతి బడుగు, బలహీనవర్గాల ప్రజలు మర్చిపోరన్నారు. బీసీలను వాడుకొని వారికి అన్యాయం చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. బీసీల ఎదుగుదల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు. తప్పు బీసీ చేసినా, ఎస్సీ చేసినా, ఎస్టీ చేసినా తప్పు తప్పేనని, ఏం జరిగిందని బీసీలంతా రోడ్ల మీదకు రావాలి చంద్రబాబూ అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, బీసీలకు ఇచ్చిన ప్రతి హామీలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు.