తాడేపల్లి: టీడీపీ, బీజేపీని కలిపి ఉంచేందుకు పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నారని మంత్రి పేర్నినాని తెలిపారు. పవన్కు ఒక సిద్ధాంతం లేదని, పూటకో మాట..రోజుకో సిద్ధాంతమన్నారు. సీఎం వైయస్ జగన్ను ద్వేషించడమే పవన్ సిద్ధాంతమన్నారు. శాసనాలు చేసి అమలు చేయని బీజేపీని చొక్కా పట్టుకుని అడగగలరా అని నిలదీశారు.ఇవాళ ఇప్పటం సభలో పవన్ భీమ్లా నాయక్ సినిమా డైలాగులే చెప్పారని, జనసేన సైనికులు టీడీపీ జెండా మోసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారని తెలిపారు. సీఎం వైయస్ జగన్పై పవన్ వ్యాఖ్యలను మంత్రి పేర్నినాని తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..మంత్రి మాటల్లోనే.. ఇవాళ సభలో పవన్ అందరికీ నమస్కారాలు పెట్టి తనకు జీవితాన్ని ప్రసాదించిన చిరంజీవిని మర్చిపోయారు. చిరంజీవి లేకుంటే పవన్ ఉండేవారా?. తీగలాంటి నీకు ఊతక్రరలా చిరంజీవి నిలబడ్డారు. వైయస్ జగన్ను ద్వేషించడమే పవన్ సిద్ధాంతం. టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలని ఆనాడు అనలేదా?. టీడీపీ, బీజేపీని కలిపి ఉంచేందుకు పవన్ తాపత్రయం. పవన్ది పూటకో సిద్ధాంతం..రోజుకో సిద్ధాంతం. పవన్ మాత్రం ఏమైనా అనొచ్చు. పవన్కు అంటే మానసిక అత్యాచారమా? పవన్ చెప్పేదొకటి..చేసేదొకటి. పవన్ రాజకీయ ఊసరవెల్లి. 2014లో మీరు సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల అవసరం కోసం నిర్ణయం తీసుకున్నారు. మీ నిర్ణయం వల్ల ఈ రాష్టప్రజలకు ఏం మేలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ హఠావో అన్నారు. ఆ రోజు ఏ లక్ష్యంతో టీడీపీకి ఓట్లు వేయమని కోరారు. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించలేదు. మీ నిర్ణయం వల్ల ఏం ప్రయోజనం జరిగింది. ఉద్దానంలో మీరు సాధించింది ఏంటీ? హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏ ఉద్దరించారు. రా«జధానికి వచ్చి ఏం చేశారు. సభలో అన్ని అసత్యాలే మాట్లాడారు. ఉండవల్లి, పెనుమాకలో మీరేనా ప్రజలను చైతన్యవంతం చేసింది. ర్యాంబో రాంబాబు అంటున్నారు. వెల్లంపల్లి, అవంతి శ్రీనివాసును హేళనగా మాట్లాడుతారా? మీరు ఎవరూ జానీనా? ఈ రకమైన భాష తప్పు కదా? ఇదేం ఆనందం కళ్యాణ్ మీకు. ఏది పడితే అది మాట్లాడటం ఏంటి? శత్రువు కూడా మన పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైయస్జగన్ పోరాటం చేయలేదా? ప్రజలకు జ్ఞాపకశక్తి లేదనుకుంటారా? బెజవాడలో మీరు ఏం మాట్లాడారో గుర్తు లేదా? ఇది కుల రాజధాని అనలేదా? కర్నూలే నా మనసులో రాజధాని అనలేదా? పూటకో సిద్ధాంతం మీది. బీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు, ఇవాళ మీటింగ్కు తేడా లేదు. మాటకు కట్టుబడే మనస్తత్వం ఆయనకు లేదు. లక్షల పుస్తకాలు చదివిన మీరు ఇలా మాట్లాడం సరికాదు. మిమ్మల్ని మీరు వంచించుకోవడం కాదా? వైయస్ జగన్ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది మీకు తెలియదా? కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు వైద్యం అందించింది మీకు తెలియదా? నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసింది తెలియదా? మీరు ప్రేమించే చంద్రబాబు చదువుకున్న స్కూల్ను బాగుచేసింది మీకు కనిపించడం లేదా? ఆసుపత్రులను వేల కోట్లతో ఆధునీకరించడం మీ కళ్లకు కనిపించడం లేదా? పవన్ ఏమైనా అనొచ్చు. పవన్ అంటే మానసిక అత్యాచారం కాదా? పవన్..నిన్ను నడిపించే శక్తి ఎవరూ? బీజేపీ వాళ్లు ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్లో శాసనం చేశారు. బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు. ఢిల్లీలో ఎందుకు ప్రశ్నించడం లేదు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ గురించి, పోలవరం గురించి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. పోలంలో ఒక మాట..ఢిల్లీలో మరో మాట ఎందుకు? ఢిల్లీ వాళ్లను ఎందుకు నిలదీయడం లేదు. ఎక్కడి నుంచి ఈ రాజకీయం నేర్చుకున్నారు. రాజకీయ ఊసరవెల్లి ఎక్కడ నుంచినేర్చుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలను కలపాలని తాపత్రయపడుతున్నారు. సినిమా డైలాగ్స్తో సభను నడిపించారు. విశాఖ ఉక్కును అమ్మేయవద్దని ఢిల్లీ వాళ్లను నిలదీయలేరా? ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని, మోదీని ఒక్క మాట కూడా అనలేదు. మాటల వరకేనా ఉత్తర కుమార ప్రగలభాలన్నీ? శాసనాలు చేసి అమలు చేయని బీజేపీని చొక్కా పట్టుకుని అడగగలరా?. చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఇవాళ కంఠం పవన్ది..భావం చంద్రబాబుది. జనసేన కార్యకర్తలు ఒక్కసారి గమనించండి. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే జనసేన లక్ష్యంగా చెప్పారు. మీరు 90 సీట్లైనా పోటీ చేస్తారా? వైయస్ జగన్ను ధ్వేషించడమే మీ లక్ష్యంగా కనిపిస్తుంది. వైవీ సుబ్బారెడ్డి అంటూ కులం పేరుతో అంటున్నారు. ఎందుకు వైయస్ఆర్సీపీకి కమ్మాను దూరం చేయాలని చూస్తున్నారు. మీ నాయకుడు కమ్మవాళ్లను పల్లకిలో కూర్చోబెట్టి మీచేత మోయించాలని చూస్తున్నారు. పచ్చిగా విషం చిమ్మటం దుర్మార్గం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తారట. ఎంత మంది ఎదురొచ్చినా వైయస్ జగన్ ఒంటరిగానే పోరాటం చేస్తారు. పోటీ చేస్తారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని మంత్రి పేర్నినాని తెలిపారు. ఎప్పుడు ఏ గుర్తుకు ఓటు వేయమని చెప్పాలో తెలీక జనసేన కార్యక్తలకు పెద్ద కష్టం వచ్చి పడింది. చంద్రబాబు ఏది చెబితే అది..ఏం మాట్లాడమంటే అది మాట్లాడం పవన్ సిద్ధాంతం. పవన్ గెస్టుగా వచ్చి టూరిస్టులాగా వెళ్తున్నారు. వైయస్ జగన్ బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. పవన్ మీరు హైదరాబాద్లో హాయిగా సినిమాలు తీసుకోండి. పవన్ సింగిల్ కాదు..మింగిల్. వైయస్ జగన్పై ఉన్న ద్వేషాన్ని కలగలిపి..రేపు పొద్దున జనసేన సైనికులందరూ టీడీపీ జెండాను మోసేందుకు సిద్ధంగా ఉండాలని, బీజేపీతో కలిసి ముందుకు వెళ్దామని ఆ పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునిచ్చినట్లుగా ఇవాళ సభ నిర్వహించారని మంత్రి పేర్నినాని తెలిపారు.