డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మహిళల రక్షణ‌కు  చర్యలు 

హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత
 

తాడేప‌ల్లి : డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మహిళల రక్షణ‌కు ప్ర‌భుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మ‌హిళ‌ల‌ రక్షణకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని  తెలిపారు.  ఈ-రక్షాబంధన్ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించామని, రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థినులకు సైబర్ నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. మహిళలు సైబర్ నేరాలపై ఎలా పిర్యాదు చేయాలో కూడా అవగాహన కల్పిస్తామని అన్నారు. దిశా చట్టం ద్వారా మహిళలపై అరాచకాలకు అడ్డుకట్ట వేస్తున్నామని, అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఒక అన్నగా అండగా నిలుస్తున్నారని, ఆయన నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని మేకతోటి సుచరిత తెలిపారు.  

మహిళా పక్షపాత పాలన :  వాసిరెడ్డి ప‌ద్మ‌
రక్షా బందన్ రోజున ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు మరిన్ని వరాలు ఇచ్చారని మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మహిళా పక్షపాత పాలన నడుస్తోందని, సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన మహిళల సంక్షేమానికి ఎన్నో చేశారని ప్రశంసించారు. ఆగస్ట్ 15న 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిగా దిశా చట్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని కొనియాడారు. వైఎస్సార్ చేయూత, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల సొంతమని, వారి రక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. దానిలో భాగంగా నేడు ఈ- రక్షాబంధన్ ప్రారంభించారన్నారు. వైయ‌స్ జగన్ పరిపాలన మహిళలకు స్వర్ణయుగం లాంటిదని. మద్యపాన నిషేధం దిశగా చేపడుతున్న ప్రభుత్వ చర్యలు మహిళల జీవన స్థితిని మారుస్తున్నాయని వాసిరెడ్డి ప‌ద్మ‌ తెలిపారు.

Back to Top