నెల్లూరు: వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అంతం చేయాలనే కుట్రలో భాగంగానే ఆయన ఇంటిపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులో మీడయాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి దంపతుల ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న వారికి సంబంధించిన వివరాలతో ఫిర్యాదు చేసినా, కూటమి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయకుండా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎప్పుడూ లేనివిధంగా నెల్లూరులో హింసను ప్రేరేపిస్తున్నారు. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు జరిగిన సంఘటనలు నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేవు. దాడులతో వైయస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూడటం వారి అవివేకమే అవుతుంది. నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ సైకో బ్యాచ్ దాడి చేసి అరాచకానికి పాల్పడటాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే టీడీపీకి చెందిన దాదాపు 200 మంది సైకోలు ఈ దాడిలో పాల్గొన్నారు. మా నాయకుడ్ని అంతం చేయాలనే కుట్రతోనే వందల మంది గూండాలు ఆయన ఇంటిపైకి కర్రలు, రాడ్లతో వచ్చి దాడికి దిగారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న ఫర్నిఛర్, కారు, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. వారందరి పైనా పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. ఈ దాడిలో టీడీపీ కౌన్సిలర్లు కూడా పాల్గొన్నట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంటే తనకేమీ తెలియదని, దాడిని ఖండిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉంది. సీనియర్ నాయకుడిపై ఉపయోగించే భాష అదేనా? ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేస్తున్న అవినీతి బాగోతాలను మా నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బయటపెడతారనే భయంతోనే ఇలాంటి దాడులకు దిగారు. ఇన్నాళ్లు జిల్లాలో మేమే డబ్బున్నోళ్లం అనే ఫీలింగ్తో ఉన్న వీరు, ఇకపై మా మాటకు కూడా తిరుగు ఉండకూడదనే అధికార మదంతో ఇలాంటి రౌడీ చర్యలకు దిగుతున్నారు. సీనియర్ నాయకుడైన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి వాడు, వీడు అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. రాజకీయాల్లో ప్రతిదానికీ దాడులు చేయడమే పరిష్కారం అనుకుంటే మా అందరికీ కూడా డబ్బులివ్వకుండానే స్వచ్ఛందంగా వచ్చి ఎంతకైనా తెగించే అభిమానులున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు : ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు చేసిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి దాదాపు 20 గంటలవుతున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. నెల్లూరు సిటీలోనే ఉన్న సీనియర్ నాయకుడి ఇంటిపై పెట్రోల్ పోసి దాడులు చేస్తే పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారు. సుదూర గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా దాడులు చేసిన గూండాలు బయటకొస్తుంటే, అదే సమయంలో పోలీసులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లోకి వెళ్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ దాడి చేసిన వారిలో ఒక్కర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలోకి తెచ్చుకున్నామా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.