లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకో. భాష మార్చుకో

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు  

పోలవరం ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకో

ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించు. పద్ధతి మార్చుకో

సీఎం గారిపై అనుచిత పిచ్చి విమర్శులు మానుకో 

లేకపోతే కచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు 

కాకినాడ:  ‘ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన తన పర్యటనలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటలు వింటుంటే అతడి ఆరోగ్యంపై అనుమానం వేస్తోంది. సాక్షాత్తూ గౌరవ సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడుతున్నాడు. అతడి మాటలు కొవ్వెక్కి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. అతడు ఒళ్లు మరిచి మాట్లాడుతున్నాడా’. అని మంత్రి క‌న్న‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఒళ్లు మర్చిపోయి మాటలు:
    ‘రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ భాషలో విచక్షణ లేకుండా ఉండొద్దు. కనీస సంస్కారం కూడా లేకుండా లోకేష్‌ మాట్లాడుతున్నాడు. ఆయన అమెరికాలో చదువుకున్నా కనీస సంస్కారం లేదు. తండ్రి, కొడుకు ఇద్దరూ పూర్తిగా ఫ్రస్టేషన్‌లో మునిగిపోయి, ఒళ్లు మర్చిపోయి మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా, చాలా హీనమైన భాషను లోకేష్‌ మాట్లాడుతున్నాడు’.
    ‘పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు బొడ్డు కోసి మొదలు పెట్టినట్లు లోకేష్‌ మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి ఆ ప్రాజెక్టును ప్రారంభించింది రాజశేఖర్‌రెడ్డి గారు. ఆయనే దానికి అనుమతులు తీసుకువచ్చాడు. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం కాసులు కురిపించేదిగానే చూశాడు. దాన్ని ముందుకు తీసుకుపోలేదు. రాష్ట్రానికి వెన్నెముక అయిన ప్రాజెక్టును సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారు. నిర్ణీత వ్యవధిలో దాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు’.

ప్రజలు నమ్మడం లేదు:
    ‘లోకేష్‌ మీ మాటలను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలం అయింది. లేకపోతే 2019లో ఎన్నికల ఫలితాలు అలా రావు. 
సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడడం. వైసీపీ నాయకులను కుక్కలు అని సంబోధించడం ఏమిటిదంతా?. లోకేష్‌ను అలా వదిలేయకుండా ఎవరికైనా చూపించాల్సిన అవసరం ఉంది. తనకు తాను ఒక పెద్ద మాస్‌ లీడర్‌గా బిల్డప్‌ ఇవ్వాలని అనుకుని, ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు చదివి వినిపిస్తున్నారు. లోకేష్‌ నీవేమైనా మీ మామగారు అనుకుంటున్నావా’.

తిడితే జనం చూడరు:
    ‘లోకేష్‌ నీకు పోలవరం గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే ఇలా పైపై మాటలు మాట్లాడి, సీఎం గారిని తిడితే జనం చూస్తారని అనుకుంటున్నావు. మీ పార్టీ లేనే లేదని మీ పార్టీ అధ్యక్షుడే స్వయంగా చెప్పాడు. అయినా సరే హైదరాబాద్‌లో ఉండి, అప్పుడప్పుడు వచ్చి ఇలా వచ్చి ఏదో మాట్లాడితే మీకు బాకా ఊదే పత్రికల్లో వస్తుంది’.

మీరెందుకు పట్టించుకోలేదు?:
    ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా నిర్వాసితుల గురించి ఆలోచించారా. అసలు మీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక ఇటుక అయినా ఎందుకు పెట్టలేదు. 2017 వరకు ఆ ప్రాజెక్టును ముట్టుకోకుండా వదిలేశారు. కక్కుర్తితో కమిషన్ల కోసం ప్రాజెక్టు కడతామని కేంద్రం కాళ్ల మీద పడి తెచ్చుకున్నారు. మరి 2017 వరకు ఆ ప్రాజెక్టును ఎందుకు కట్టలేదు’.
    ‘ఏం పీకుతున్నారు? అంటావా. 2017 వరకు ఆ ప్రాజెక్టును మీరు ఎందుకు పట్టించుకోలేదు. ఆ ప్రాజెక్టు మీ చేతికి వచ్చే వరకు కనీసం ఒక్క పనైనా చేశారా?. ఆనాడు మీరు నిర్వాసితుల గురించి పట్టించుకున్నారా. ఆ సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా. పిచ్చిగా మాట్లాడడం. చీకటి ఒప్పందం చేసుకుని కేవలం ప్రాజెక్టులో కమిషన్ల కోసం ప్రాజెక్టును తాకట్టు పెట్టింది చంద్రబాబు. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇప్పుడీ పర్యటనలు. విమర్శలు’.

మాకు విచక్షణ ఉంది:
    ‘నీ మాటలకు మేము బదులివ్వాలనుకుంటే ఇంకా మాట్లాడగలం. కానీ మాకు విచక్షణ ఉంది. సంయమనం పాటిస్తున్నాం. మా నాయకుడు కూడా అదే చెబుతున్నారు. రాజకీయ విమర్శలు చేయండి. వాటికి మేము సమాధానం చెబుతాం’.

పీకేసినా బుద్ధి రాలేదు:
    ‘పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కట్టలేదు. కానీ ఆ ప్రాజెక్టు చరిత్రలో రాజశేఖర్‌రెడ్డి గారు చిరస్థాయిగా నిల్చిపోయారు. 2004 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఆనాడు పోలవరం కట్టాలని చంద్రబాబుగారికి ఎందుకు ఆలోచన రాలేదు. జనం కోసం పోరాడితే ఏం పీకుతారు అని లోకేష్‌ అంటున్నాడు. జనం మిమ్మల్ని 2019లోనే పీకేశారు. చివరకు నిన్ను మంగళగిరిలో నిన్ను కూడా ఓడించారు.
మా సీఎం గారు గేట్లు తెరిస్తే మీ పార్టీలో మీ నాన్న తప్ప ఒక్కరు కూడా మిగలరు. కాబట్టి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు’.

గిరిజనులను పట్టించుకున్నారా?:
    ‘నీవు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో బహుషా తొలిసారి పర్యటిస్తున్నట్లున్నావు. కానీ మేము అక్కడ పుట్టి పెరిగాం’.
    ‘తూర్పు గోదావరి జిల్లా మన్యంలో ఏటపాక మండలంలో కాళ్ల వాపుతో గిరిజనులు చనిపోతుంటే విపక్షనేతగా ఉన్న జగన్‌గారు, అక్కడ పర్యటించి వారిని ఓదార్చి ఆర్థిక సహాయం చేశారు. అప్పుడు నీవు, మీ తండ్రిగారు ఎక్కడ ఉన్నారు. చాపరాయి అనే మారుమూల గిరిజనులు అంతు పట్టని వ్యాధితో 17 మంది గిరిజనులు చనిపోతే, అధికారంలో ఉన్న మీరు పట్టించుకోలేదు. కానీ విపక్షనేతగా ఉన్న జగన్‌గారు, అక్కడికి వెళ్లి, వారిని పరామర్శించారు. సహాయం చేశారు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నా, ఏం చేశారు. వారిని ఎందుకు పట్టించుకోలేదు.
రాజవొమ్మంగి మండలంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువులు పెద్ద సంఖ్యలో చనిపోతే, విపక్షనేతగా ఉన్న జగన్‌గారు, అక్కడికి వెళ్లి, వారిని ఓదార్చి ఆర్థిక సహాయం చేసి వచ్చారు. మీరు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు’.

అందుకే బుద్ధి చెప్పారు:
    ‘అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు అనే వారున్నారని కనీసం ఆలోచించారా. వారి గురించి ఏ మాత్రమైనా పట్టించుకున్నారా. ఇవాళ గిరిజనులు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను ఎంతో నమ్మారు. అందుకే ఈ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లలో మీకు కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అయినా హరికథలు చెబుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించండి. జనం మిమ్మల్ని ఎందుకు ఛీకొట్టారన్నది బేరీజు వేసుకోండి. ఆ తర్వాత పోలవరం గురించి మాట్లాడండి’.

చిత్తశుద్ధితో ప్రాజెక్టు కడుతున్నాం:
    ‘కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేస్తోంది. ఈమధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా రూ.1900 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది. అందుకే పనులు వేగంగా సాగుతున్నాయి’.

ఆ 5 ఏళ్లలో 3110 ఇళ్లే!:
    ‘పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గురించి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా. మీ తండ్రిగారు సీఎంగా ఉన్న గత 5 ఏళ్ల కాలంలో ఆ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం కట్టిన ఇళ్లు కేవలం 3,110 మాత్రమే. అదే మా ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో నిర్వాసితులైన గిరిజనుల కోసం ఏకంగా 47 కాలనీల నిర్మాణం పూర్తి చేసి, వాటిలో 16 వేల ఇళ్లు కట్టి నిర్వాసితులతో గృహ ప్రవేశాలు కూడా పూర్తి చేయించాం. నిర్వాసితుల కోసం మొత్తం 1,02,491 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది’.
    ‘అంతే కాకుండా మీరు ఇచ్చిన దాని కన్నా సీఎం గారు ఇంకా ఎక్కువే ఇస్తున్నారు. గిరిజనేతరుల ఒక్కో ఇంటికి రూ.3.35 లక్షలు, గిరిజనుల ఒక్కో ఇంటికి రూ.3.59 లక్షలు ఇస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారిని నియమించాం. నిర్వాసితుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావడంతో పాటు, కాలనీల నిర్మాణంలో పూర్తి నాణ్యత కోసం ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది’.

బయట తిరగలేవు:
    ‘ఇవన్నీ మీకు తెలియదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. సీఎం గారిని, మా పార్టీ వారిని తిడితే తమ సొంత ఛానళ్లు, పత్రికల్లో ఒక మహానాయకుడి మాదిరిగా చూపిస్తారు అని నీవు అనుకుంటున్నావు. నీవు మాట్లాడుతున్న భాషను ఒకసారి వీడియో వేసుకుని చూడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరు. సీఎం గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీవసలు బయట తిరగలేవు. గుర్తు పెట్టుకో’.
    ‘ఇవాళ ప్రజల హృదయాల్లో ఉన్న ముఖ్యమంత్రి. కోట్లాది ప్రజలకు ఎప్పటికప్పుడు సాయం చేస్తున్న ముఖ్యమంత్రి. నీకు ఏమైనా సమస్యలు కనిపిస్తే, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. అంతే తప్ప నోటికి ఏది వస్తే అదే పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు’.

ఆ పనులు కమిషన్ల కోసం కాదా?:
    ‘గోదావరిలో ప్రవాహం వస్తే, మళ్లించడం కోసం గత ప్రభుత్వం స్పిల్‌వే పూర్తి చేయకుండా, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేశారు. అవి ఎందుకు చేశారు. కమిషన్లు వచ్చే పనులనే ముందు చేశారు కదా. అందుకే కదా ఇవాళ నిర్వాసితుల సమస్య వచ్చింది. అసలు కేంద్రం నుంచి ప్రాజెక్టును మేమే కడతామని ఎందుకు తీసుకున్నారు. కేవలం కమిషన్ల కోసమే కదా. మీ జేబులు నింపుకోవడానికే కదా. ఇవన్నీ చర్యలన్నీ ప్రజలు 5 ఏళ్లు సునిశితంగా గమనించారు కాబట్టే, మిమ్మల్ని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపారు’.

ప్రతి అంశం నిశితంగా..:
    ‘నిర్వాసితులకు సంబంధించి సీఎం గారు ప్రతి అంశం నిశితంగా ఆలోచిస్తున్నారు. గిరిజనులకు భూమికి బదులుగా రెండు ఎకరాలు సాగు భూమి సేకరించి ఇవ్వాలని ఆదేశించారు. నిర్వాసితులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేలా కార్యాచరణ చేపట్టారు. ప్రాజెక్టులో వరద పెరిగేలోపు 41.15 అడుగుల కాంటూరు పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వారిని తరలించే విధంగా, వారందరికీ పునరావాస కల్పనలో భాగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం’. 
ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చేలా ఇటీవలి క్యాబినెట్‌ భేటీలో తీర్మానం కూడా చేశాం’. 

మీ పనులన్నీ అవినీతిమయం:
    ‘ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో కాకుండా కమిషన్లు వచ్చే పనులనే ముందు చేసిన మీరు కూడా ఇవాళ మమ్మల్ని విమర్శిస్తున్నారు. ప్రజలను తీసుకువెళ్లి భజన చేయించుకున్నారు. దాని కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. కనీసం ఆ మొత్తాన్ని నిర్వాసితులకైనా ఇచ్చారా. ఎవరైనా స్పిల్‌వే పనులు చేయకుండా, రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కడతారా. కేవలం చంద్రబాబు మాత్రమే కడతారు’.

అందుకే అంతా తప్పు పట్టారు:
    ‘చంద్రబాబు చేసిన పనులపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కూడా అభ్యంతరం చెప్పింది. దాని వల్ల నిర్వాసితులు నష్టపోతారని పీపీఏ చెప్పింది. అయినా కూడా చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. చివరకు నాడు ప్రధాని మోదీ కూడా చంద్రబాబు చేసిన అవినీతిని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారని అన్నారు. ఇంకా చాలా మంది చంద్రబాబు చేసిన దోపిడిని ప్రస్తావించారు. 
    ‘అయినా సిగ్గు శరం లేకుండా ఇవాళ మీరు జగన్‌గారిని విమర్శిస్తారా. గాలిగాడు అని అంటారా. నాడు ఒక్కనాడు మీరు గిరిజనులు, నిర్వాసితుల కోసం ఆలోచించలేదు. ఎంతసేపూ మీ కమిషన్ల కోసమే చూశారు తప్ప. అందుకే నాడు ప్రధాని స్వయంగా ప్రధాని కూడా మిమ్మల్ని విమర్శించారు. ఇంతకన్నా మీకు సర్టిఫికెట్‌ ఎవరిస్తారు. ఆనాడు మీరు తీసుకున్న నిర్ణయాలే ఇవాళ సమస్యలకు కారణం’.

పగటి కలలు మానండి:
    ‘పోలవరం ప్రాజెక్టును రాజశేఖర్‌రెడ్డి గారు ప్రారంభిస్తే, ఆయన వారసుడిగా దాన్ని పూర్తి చేస్తారు. కానీ లోకేష్‌ పగటి కలలు కంటూ, 2024లో తాము అధికారంలోకి వస్తామని, ప్రాజెక్టును పూర్తి చేసి, నిర్వాసితులను ఆదుకుంటామని చెబుతున్నాడు’.

మళ్లీ బుద్ధి చెబుతారు:
    ‘కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్నది వారందరికి తెలుసు. ఇప్పుడు కూడా మీరు హైదరాబాద్‌ను వదిలిపెట్టి రావడం లేదు. విజిటింగ్‌ ప్రొఫెసర్లలా అప్పుడప్పుడూ వచ్చి వెళ్తున్నా్తరు. అందుకే
2019 కంటే ఎక్కువగా 2024లో మీకు ప్రజలు బుద్ధి చెబుతారు’.

ప్రాజెక్టును పూర్తి చేస్తాం:
    ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2300 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయినా పనులు ఆగకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. నిర్వాసితులకు రూ.10 లక్షల ప్యాకేజీ వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.550 కోట్లు అదనపు భారం పడుతోంది. అయినా వెనకాడడం లేదు. పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తాం’..    కాబట్టి ఇప్పటికైనా లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని కోరుతున్నాం అంటూ మంత్రి కె.కన్నబాబు పేర్కొన్నారు.

Back to Top