కాపు రిజర్వేషన్లపై మన వైఖరిలో ఎప్పుడూ మార్పు లేదు

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సీఎంను కలిసిన కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

అమరావతి: కాపు రిజర్వేషన్లపై మన వైఖరిలో ఎప్పుడూ మార్పు లేదని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మొదటి నుంచి చెబుతున్నట్లుగా బీసీల హక్కులకు భంగం కలగకుండా, బీసీలకు నష్టం లేకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని సీఎం వెల్లడించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని వైయస్‌ జగన్‌ తెలిపారు.  సీఎంను కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కాపు రిజర్వేషన్లపై తాజా పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్వార్థ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపు రిజర్వేషన్‌ అంశాన్ని వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుందని సీఎం విమర్శించారు. చంద్రబాబు చర్యలతో కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో కేంద్రానికి ఒక బిల్లు పంపించారని, తరువాత ఈబీసీల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరొకటి పంపారన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తూ పంపిన  బిల్లు పరిశీలన లో ఉంచదలుచుకున్నారా? దానికి కట్టుబడి ఉన్నారా? లేక ఉపసంహరించుకున్నారా? దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని కేంద్రం కోరినట్లు చెప్పారు. ఏప్రిల్‌ 4, 2019 కేంద్రం రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం పంపలేదని చెప్పారు.

పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, దాంట్లో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదన్నారు. కులాల పరంగా విభజించే హక్కు లేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు నామమాత్రంగా కాపులను బీసీల్లో చేర్చడంపైనా  ఈబీసీల్లో ఇచ్చిన 5 శాతం కోటాపైనా కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అడుగు ముందుకు వేస్తే ఈ కోటా కింద సీట్లు, ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ఏమవుతుందని అన్నారు. ఈబీసీ కోటాలో కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య, పీజీ సీట్లలో గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్హుల్లో కూడా ఇదే పేర్కొన్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రబాబును వైయస్‌ జగన్‌ నిలదీశారు. ఓసీ జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే  అందులో కాపుల జనాభా 50 శాతం కన్నా ఎక్కువే ఉంది కదా అన్నారు. అలాంటప్పుడు 5 శాతానికిఏ కట్టడి చేస్తే మిగతా వారికి అన్యాయం జరగదా అని ప్రశ్నించారు.

ఈబీసీ కోటాలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిందని, దీనికి విరుద్ధంగా అడుగులు వేయగలమా అని పార్టీ నేతలతో సీఎం చర్చించారు. ఈబీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన వారంలోపే మార్గదర్శకాలు ఇచ్చింది కానీ చంద్రబాబు మాత్రం ఏప్రిల్‌ 11న ఎన్నికలు అయితే మే 6న మార్గదర్శకాల కోసం కమిటీని వేశారని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై మన వైఖరిలో ఎప్పుడూ మార్పు లేదని సీఎం స్పష్టం చేశారు. మొదటి నుంచి చెబుతున్నట్లుగా బీసీల హక్కులకు భంగం కలగకుండా, బీసీలకు నష్టం లేకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని సీఎం వెల్లడించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని వైయస్‌ జగన్‌ తెలిపారు. ఈ బడ్జెట్‌లో కాపులకు రూ.2 వేల కోట్లు కేటాయించామని కాపు నేతలకు సీఎం వివరించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం రూ.1340 కోట్లు మాత్రమే అన్నారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ్‌ కమిషన్‌ నివేదికను పరిశీలించాల్సిందిగా కాపు నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కన్నబాబులకు సీఎం సూచించారు. 
 

తాజా వీడియోలు

Back to Top