రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం 

అన్నదాత నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాం

రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

తప్పుడు లేఖలు రాసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొద్దు

దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌

తాడేపల్లి: రైతు క్షేమమే.. రాష్ట్ర సంక్షేమం అని నమ్మిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, రైతుకు ఇబ్బంది కలిగించే పని ఈ ప్రభుత్వం చేయదని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. గత సంవత్సరం వర్షాలు బాగా పడటంతో నెల్లూరు జిల్లాలో రెండో పంట ఎప్పుడూ లేనంతగా దిగుబడి వచ్చిందన్నారు. రైతుల నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.  ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటుందని, ఇప్పటివరకు 90 వేల మెట్రిక్‌ టన్నుల ప్రొక్యూర్‌మెంట్‌ చేశామని, రైతాంగానికి రూ.120 కోట్ల నిధులు విడుదల చేశామని వివరించారు. రైతు బాగుండాలని సీఎం వైయస్‌ జగన్‌ అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత చంద్రబాబు తప్పుడు లేఖలు రాసి లేనిపోని అపోహనలు ప్రజల్లో సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. గత ఐదేళ్ల పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. నేడు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నాడని మండిపడ్డారు. రైతు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం నుంచి వచ్చిన సివిల్‌ సప్లయ్, ప్యాడికి సంబంధించిన రూ.4 వేల కోట్ల నిధులను పసుపు, కుంకుమకు మళ్లించాడని ధ్వజమెత్తారు.  

అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ స్వీకరించే దమ్ముందా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు సీబీఐకి లేఖ రాయగలరా అంటూ నిలదీశారు. దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌లో కూడా భారీ అవినీతి జరిగిందన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. రాజధాని భూ కుంభకోణంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.  
 

Back to Top