తాడేపల్లి: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ బుధవారం వైయస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజలకు పార్టీ కండువాలు కప్పిన శ్రీ వైయస్ జగన్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. శ్రీ వైయస్ జగన్ నాయకత్వం, సిద్ధాంతాలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత తమను ఎంతగానో ఆకర్షించాయని మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైయస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతంతో పాటు ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మండవ గౌతమ్ పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడిగా, నియోజకవర్గ టీడీపీ బూత్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలం సొసైటీ అధ్యక్షుడిగా, పొన్నూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మండవ లక్ష్మీ నీరజ టీడీపీ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైయస్ఆర్సీపీపై పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ , పార్టీ నాయకులు గుంటుపల్లి అంజయ్య, వేజండ్ల శివకృష్ణ, నూతలపాటి కృష్ణ, కిలారి రమేష్, త్రిపురనేని వెంకటస్వామి, రావిపాటి పవన్, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.