రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మావగన్ షాక్ కొట్టిందని, అందుకే అమరావతి అర్థాలు మారుస్తున్నాడని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. అమరావతిలో ఇప్పుడు కొత్తగా విజయవాడ, గుంటూరు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఆ రెండు నగరాలు రాజధాని ప్రాంతానికి దూరంగా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. పైగా అమరావతిలో లక్షల జనాభా లేదని.. పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టు, నేషనల్ హైవేలు లేవని గుర్తు చేశారు. అదే మావిగన్లో అన్నీ ఉన్నాయని.. 45 లక్షలకు పైగా జనాభా, రైల్వే స్టేషన్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ తేడాను చంద్రబాబు పూడ్చగలరా? అసలు అది ఆయనకు సాధ్యం అవుతుందా? ఎన్ని దశాబ్దాలకు ఈ వసతులన్నీ అమరావతిలో ఉంటాయని నిలదీశారు. ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి చంద్రబాబు అమరావతి నిర్వచనాలు మారుస్తున్నారని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్ చురకలంటించారు. ప్రెస్మీట్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..: ఆ నగరాలకు ఏం చేశారు చంద్రబాబూ?: రాజధాని అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ, గుంటూరు కూడా కలుపుకొని రాజధాని అని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. మంచిదే. అయితే 2014–19 ఐదేళ్లు, 2024 నుంచి ఇప్పటివరకు రెండేళ్లు.. మొత్తం ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాజధాని ప్రాంతం పేరుతో విజయవాడ, గుంటూరుకు ప్రత్యేకంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పాలి. రాజధానికి రూ.2 లక్షల కోట్లు కావాలని చెబుతున్నప్పుడు అందులో విజయవాడ, గుంటూరు అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తారో కూడా స్పష్టం చేయాలి. విజయవాడ, గుంటూరుతో పాటు మచిలీపట్నం ప్రాధాన్యతను కూడా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్కు పోర్టులే ప్రధాన బలం. కాబట్టి మచిలీపట్నాన్ని కూడా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగం చేయాలి. డీఎస్సీపై లోకేష్తో బహిరంగ చర్చకు సిద్ధం: మెగా డీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై జగన్ గారిని చర్చకు రావాలని సవాల్ చేసే స్థాయి నారా లోకేష్ కి లేదు. ఆయనకు బదులు చర్చకు రావడానికి నేను సిద్ధం. స్థలం, సమయం మీరే నిర్ణయించండి. డీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీతో పాటు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవహారంపైనా మా వద్ద ఉన్న ఆధారాలతో చర్చిస్తా. విద్యాశాఖలో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన నవీన్కు డీఎస్సీలో మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ప్రశ్నపత్రాల అప్లోడ్ ప్రక్రియతో అతనికి సంబంధం ఉందా? మొదటి ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు? ఈ ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానం చెప్పాలి. టాటా పవర్ ప్రాజెక్టు ఒడిశాకు తరలిపోతోందా?: నెల్లూరు ప్రాంతానికి టాటా పవర్ 10 గిగావాట్ల ప్రాజెక్టును తీసుకొచ్చామని నారా లోకేష్ గతంలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు ఒడిశాకు తరలిపోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. టాటా పవర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతుందా? ఒడిశాకు తరలిపోతోందా? నారా లోకేష్ ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ గారి హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు, నారా లోకేష్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఇప్పుడు టాటా పవర్ ప్రాజెక్టు విషయంలోనైనా వాస్తవాలను ప్రజల ముందుంచాలని మార్గాని భరత్ స్పష్టం చేశారు.