తాడేపల్లి: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొంటాయని ఏడాది ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం కనీస ప్రత్యామ్నాయ ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్) కూడా రూపొందించకుండా రైతాంగాన్ని గాలికొదిలేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలంలో సరిపడా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకుండా కేవలం నామమాత్రపు నీటితో సరిపెడుతూ గండికోట, గోరకల్లు, వెలుగోడు, సోమశిల, కండలేరు వంటి కీలక రిజర్వాయర్లను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్కు సైతం నీరందకుండా చేసి రైతుల పొట్ట కొడుతున్నారని, రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం చూపుతున్న తీవ్ర వివక్ష వల్ల కరువు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులకు కంటింజెన్సీ ప్లాన్ ద్వారా అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... రాయలసీమ ప్రాజెక్టుల పట్ల కక్షసాధింపు - గండికోట, హంద్రీనీవా నిర్లక్ష్యం శ్రీశైలానికి నీళ్లు వచ్చినా, పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకుండా చంద్రబాబు రాయలసీమ ప్రజలపై తన కక్షను తీర్చుకుంటున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 50 వేల క్యూసెక్కులు ఉంటే, కేవలం 8 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తూ రిజర్వాయర్లను ఎండబెడుతున్నారు. గోరకల్లు, గండికోట, వెలుగోడు, సోమశిల, కండలేరు వంటి ప్రధాన రిజర్వాయర్లలో నీరు లేకపోయినా వాటిని నింపే ఆలోచన చేయడం లేదు. గండికోట లాంటి కీలకమైన జంక్షన్ డ్యామ్ను, అనుసంధాన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మూలన పడేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలిస్తుంటే, మన దగ్గర అవకాశాలున్నా కనీసం రిజర్వాయర్లను నింపుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎరువులు, విత్తనాలు లేక అల్లాడుతున్న రైతన్న బోర్లు కింద కొద్దోగొప్పో పంటలు వేసుకుందామన్న రైతులకు యూరియా దొరకడం లేదు, విత్తనాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు అందేవి. కానీ ఈ కూటమి పాలనలో రైతులకు రూపాయి సబ్సిడీ కూడా అందలేదు. పంట నష్టపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలోనూ, ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవడంలో నూ కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కష్టాల్లో ఉన్న రైతులను సోమరిపోతులు అంటారే తప్ప, కష్టపడే తత్వం ఉన్న రైతుకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వైయస్సార్ హయాంలోనే రాయలసీమకు భరోసా మహానాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించాలని, రాయలసీమను సస్యశ్యామలం చేయాలని 83 ప్రాజెక్టులు చేపట్టారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు భవిష్యత్తు కల్పించారు. కానీ నేడు చంద్రబాబు అవే ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తూ, కేసీ కెనాల్కు సైతం నీళ్లు వదలకుండా రైతుల గొంతు కోస్తున్నారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని ఏడాది ముందే హెచ్చరిస్తున్నా.. ఒక్క కంటింజెన్సీ ప్లాన్ కూడా తయారు చేయని అసమర్థ ప్రభుత్వం ఇది. ప్రభుత్వానికి హెచ్చరిక - వెంటనే కంటెజెన్సీ ప్లాన్ అమలు చేయాలి ప్రకృతికి విరుద్ధమైన ఆలోచనలతో, వ్యక్తిగత ద్వేషంతో పరిపాలన సాగిస్తే ప్రజలు క్షమించరు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలు పట్టడం లేదా? ఇప్పటికైనా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఒక పకడ్బందీ కంటెజెన్సీ ప్లాన్ను అమలు చేయాలని, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.