నంద్యాల జిల్లా: బనగానపల్లెలో దాడికి గురైన వైయస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్పైనే పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ప్రోద్బలంతో కేసు నమోదు చేయడం పట్ల వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆందోళన చేపట్టారు. గత బుధవారం అబ్దుల్ ఫైజ్ ఇంటిపై మంత్రి బీసీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అబ్దుల్ ఫైజ్కు న్యాయం చేయాల్సిన పోలీసులు ఆయనపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం ఈ నెల 15న అబ్దుల్ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను భయంభ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్ఫైజ్ కథనం మేరకు.. పెద్ద కుమారుడు అబ్దుల్ఉబేద్ జోడే కావడంతో బుధవారం విద్యుత్ దీపాలంకరణతో ఇంటిని తీర్చిదిద్దారు. ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్ కెమెరాను లాక్కొని కిందపడేసి పగులకొట్టారు. అలాగే ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయంభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రవీణ్కుమార్ వెంటనే అబ్దుల్ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన కూడా మంత్రి అనుచరులకు వత్తాసు పలికారు. డ్రోన్ కెమెరామెన్ల పై మండిపడ్డారు.