అమరావతి: కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువును సినీ ప్రముఖులు కృతజ్ఞతులు తెలిపారు. చిరు, నాగ్ హర్షం విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం వైయస్ జగన్ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.