పులివెందుల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్రెడ్డి శుక్రవారం పులివెందులలో పర్యటించారు. తమ బంధువు వైయస్ ఆనంద్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి పెదనాన్న వైయస్ ఆనంద్రెడ్డి (87) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పులివెందులలో తుదిశ్వాస విడిచారు. పులివెందులలోని వైయస్ ఆనంద్రెడ్డి స్వగృహానికి చేరుకున్న శ్రీ వైయస్ జగన్ దంపతులు ఆయన భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత అంతిమయాత్రలో పాల్గొని వైయస్ ఆనంద్రెడ్డికి తుది వీడ్కోలు పలికారు.