ఘనంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహా సంప్రోక్షణం

  
 గుంటూరు:  తుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, శ్రీ స్వాత్వానంద్రేద్ర స్వామి పాల్గొన్నారు.

విగ్రహ ప్రాణ ప్రతిష్ణ, మహాసంప్రోక్షణ అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తదితరులు మొదటి దర్శనం చేసుకున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రూ.40 కోట్ల వ్యయంతో, 25 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం జరిగింది.

ఈ నెల 4 నుంచి కొనసాగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ణ, మహాసంప్రోక్షణను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేటి సాయంత్రం నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. తిరుమల తర్వాత టీటీడీ వెంకటపాలెంలోనే అతి పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం గమనార్హం. 

తాజా వీడియోలు

Back to Top