ప్రొద్దుటూరు: వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన ఆస్తి అని, చంద్రబాబు ఈ రాష్ట్రానికి, నారా లోకేష్ టీడీపీకి పట్టిన క్యాన్సర్ గడ్డలు అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పేరు తలచుకోకుండా తండ్రీకొడుకులకు రోజు గడవడం లేదని, వైఫల్యాలకు సమాధానం చెప్పే ధైర్యం లేక వైఎస్ జగన్పై వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నారా లోకేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజల దగ్గర రెఫరెండం కోరదమా అని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. జగన్ని తిట్టి, సొంత డబ్బా కొట్టుకోవడానికే లోకేష్ ప్రొద్దుటూరు పర్యటన పెట్టుకున్నాడని, ఆయన వల్ల నియోజకవర్గ ప్రజలకు ఒరిగింది శూన్యం అని చెప్పారు. రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని కుటుంబం చంద్రబాబుదని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా రతనాల రాయలసీమ, రాళ్ల సీమగా మారుతోందని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన రైతు ప్రేమికుడు, రైతు బాంధవుడు జగనైతే, వ్యవసాయమే దండగ అనేలా రెండేళ్లుగా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. భూముల కోసం రైతులను వేధిస్తున్న కిరాతకుడు, కీచకుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... జగన్ ని తిట్టడానికే లోకేష్ ప్రొద్దుటూరు పర్యటన ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ ప్రొద్దుటూరికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడేసి పోయాడు. ఆయన వచ్చి పోవడం వల్ల నియోజకవర్గ ప్రజలకు జరిగిన ప్రయోజనం మాత్రం శూన్యం. జగన్ గారి మీద నిందలు మోపి, సొంత డబ్బా కొట్టుకుని పోయాడు. రెండేళ్లుగా నిద్ర లేచించి మొదలు పడుకునే వరకు తండ్రీకొడుకులు జగన్ గారి పేరు ఎత్తకుండా చంద్రబాబు, లోకేష్లకు రోజు గడిచింది లేదు. వారికి జగన్ గారిని చూస్తే అంత భయంతో వణికిపోతున్నారు. జగన్ క్యాన్సర్ గడ్డ. జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపాడు. జగన్ రైతు ద్రోహి. జగన్ కారణంగా పరిశ్రమలన్నీ వెనక్కి పోయాయి. ఇవన్నీ ఆయన్ను తిట్టినవైతే. కూటమి అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని, పెట్టుబడులు ప్రవాహం మొదలైంది, రైజింగ్ రాయలసీమ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. జగన్ గారి మీద నిందలు మోపడం, వారి గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆయన పర్యటన కారణంగా ఒరిగింది శూన్యం. పరిశ్రమలు వెళ్లిపోయాయని చెబుతున్న లోకేష్, అసలు దాల్మియాను ఎవరు తీసుకొచ్చారో తెలుసుకోవాలి. అలాంటి పరిశ్రమల మీద చంద్రబాబు, ఎల్లో మీడియా కక్షగట్టి కేసులు పెట్టిన గత చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ఆ రోజు దాల్మియా పెట్టుబడులపై విషం కక్కారు. ఇవాళ అదే దాల్మియాను భేష్ అంటున్నారు. పరిశ్రమలు వెళ్లిపోవడం గురించి సజ్జన్ జిందాల్ని అడిగితే లోకేష్ కి ఇంకా వివరంగా చెబుతారు. వివేకా మర్డర్ కేసు టీడీపీకి ఒక ప్రత్యేక వస్తువు వివేకానందరెడ్డిని చంపాడని మొన్నటిదాకా ఎంపీ అవినాశ్రెడ్డి పేరుతో దుష్ప్రచారం చేసిన కూటమి నాయకులు ఇప్పుడు కొత్తగా వైఎస్ జగన్ పేరుతో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దేశంలోనే ప్రముఖ దర్యాప్తు సంస్థ సీబీఐ, సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు విషయంలో చాలా స్పష్టంగా స్పందించాయి. సునీత గారు కాలయాపన చేస్తూ పిటిషన్లు వేస్తున్నారని, ఇకపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఎవర్నీ విచారించాల్సిన అవసరమే లేదని తేల్చిచెప్పాయి. ఇకపై దీనిపై పరిశోధన, దర్యాప్తు, విచారణ అవసరం లేదని సీబీఐ కూడా చెప్పింది. అయినా లోకేష్, చంద్రబాబు పదే పదే వైఎస్ జగన్ గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ బురదజల్లుతున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడనేది మాత్రమే నిజం. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన నగ్న సత్యం. ఎన్టీఆర్కి ఎవరు వెన్నుపోటు పొడిచారో లోకేష్ చెప్పాలి. వంగవీటి మోహన రంగా, పింగళి దశరథరామ్, మల్లెల బాబ్జీ తదితరుల హత్యలకు కారకులెవరో చంద్రబాబుని అడిగి లోకేష్ తెలుసుకోవాలి. ప్రపంచం మొత్తానికి తెలిసిన నిజాలను కూడా వక్రీకరించడంలో వారు దిట్ట. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకాలు తండ్రీకొడుకులు. రెండేళ్లలో వ్యవసాయ రంగం నిర్వీర్యం జగన్ క్యాన్సర్ గడ్డ లేక రాష్ట్ర ప్రజల ఆశాకిరణమా అనే దానిపై ప్రజల రిఫరెండం కోరదామా? రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్య సంపద జగన్. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే నాయకుడు అనేది గత ఐదేళ్ల పాలనతో నిరూపింతం అయ్యింది. రాష్ట్రానికి చంద్రబాబు, తెలుదేశం పార్టీకి లోకేష్ క్యాన్సర్ గడ్డలు. లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పతనం కావడం ఖాయం. గడిచిన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆర్బీకే సెంటర్లు, ఈ క్రాపింగ్, సున్నా వడ్డీ రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, అగ్రి ల్యాబ్లు, ఆక్వా రైతుల కోసం అప్సడా, సీఎం యాప్.. వంటి ఎన్నో కార్యక్రమాలతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన రైతు ప్రేమికుడు జగన్. కానీ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది, రైతు రుణమాఫీ పేరుతో వచించింది, పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్నది, రైతులకు గిట్టుబాటు ధరలు దక్కకుండా బినామీలతో దళారుల సిండికేట్లను నడుపుతున్నది చంద్రబాబు. ఆఖరుకి భూములు ఇవ్వడం లేదని అమరావతిలో రైతుల పొలాలను సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేశామని రైతులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. అదికారం ఉంది కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని లోకేష్ భ్రమ పడుతున్నాడు. రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని కుటుంబం చంద్రబాబుది. సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా రతనాల రాయలసీమ, రాళ్ల సీమగా మారుతోంది. రాయలసీమ ప్రజలను చంద్రబాబు సవతి తల్లి బిడ్డలుగా చూస్తున్నాడు. రాయలసీమకు వచ్చిన పరిశ్రమలన్నీ వైయస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషితోనే వచ్చాయి. పరిశ్రమలు రాకపోయినా వచ్చినట్టు చంద్రబాబు భ్రమలు కల్పిస్తున్నాడు. సంక్షేమం, అభివృద్ధి పచ్చి అబద్ధం. దోపిడీ మాత్రమే నిజం సంక్షేమ పాలన అంటూ లోకేష్ చెప్పుకోవడం హాస్యాస్పదం. రెండేళ్లలో 5 లక్షల పింఛన్లు పీకేయడమే తప్ప ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన పాపానపోలేదు. ఆడబిడ్డ నిధి ఊసే లేదు. నిరుద్యోగ భృతి అడ్రస్ లేదు. 50 ఏళ్లకు పింఛన్ గురించి నోరెత్తడం లేదు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. కనీసం మూడు సిలిండర్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఇవన్నీ చేయకపోగా కరెంట్ చార్జీలు, పెట్రోల్ ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇంటి పన్నులు పెంచారు. గ్యాస్ రేట్లు పెరిగాయి. వైయస్ఆర్సీపీ హయంలో తీసుకొచ్చిన పోర్టులు, మెడికల్ కాలేజీలు, బస్టాండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ బడుల ఆధునికీకరణ ఆపేసి అభివృద్ధి చేశామని ఎలా చెప్పుకుంటాడు? ఏ నియోజకవర్గంలో కొత్తగా ఏ ఒక్క పని జరగడం లేదు. జరిగేవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సాగునీరు.. ఇవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. డాక్టర్ కావాలన్న ఎంతోమంది పేద విద్యార్థుల కలను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చిదిమేశాడు. బడుల్లో కనీసం బాత్రూమ్లు కూడా కట్టడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అలాగే ఉన్నాయి. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మేం చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే వైఎస్ జగన్ గారి మీద వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఫైర్ అయ్యారు.