తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెటుతోందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజు ముసుగులో దాదాపు రూ.8500 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.5వేలకే ప్రైవేటు వ్యక్తులక దారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజు ముసుగులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను 66 ఏళ్ళ పాటు ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించి, పేద విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే... దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గత వైయస్ జగన్ పాలనలో ఐదేళ్లలోనే 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, వేగంగా పనులు మొదలుపెట్టారు. నాడు- నేడు ద్వారా ప్రపంచశ్రేణి వసతులతో అపోలో, ఏఐజీ వంటి కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులకు దీటుగా కాలేజీల నిర్మాణంను పరుగులు పెట్టించారు. మూడు విడతల్లో సుమారుగా రూ. 8500 కోట్లతో కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైద్య విద్యను అభ్యసించాలని కలలు కనే పేదింటి బిడ్డల ఆశలను నెరవేర్చాలనే గొప్ప ఆశయంతో వైయస్ జగన్ ముందడుగు వేశారు. ప్రతి జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందించాలని వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఆయా ఆస్పత్రుల నిర్మాణం కోసం అతి కష్టం మీద ప్రైమ్ ఏరియాల్లోనే 50 ఎకరాల చొప్పున భూములు సేకరించారు. మొదటి దశలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించారు. రెండో దశలో పాడేరు, పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లె మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని నిర్ణయించాం. పాడేరు కాలేజీకి 50 సీట్లు కూడా మంజూరయ్యాయి. పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని వెనక్కి ఇచ్చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. రెండో దశలో పూర్తి కావాల్సిన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మూలన పడేసింది. ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించేందుకు సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టి ఏకంగా 66 ఏళ్ల పాటు హక్కులు కల్పించబోతోంది. గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోంది. కన్సెల్టెన్సీ ముసుగులో పథక రచన ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నారు. అధ్యయనం చేసి ప్రైవేటు వ్యక్తులకు ఏవిధంగా ఇస్తే బాగుంటుందో చెప్పే బాధ్యతను కేపీఎంజీ అనే ఒక కన్సల్టెన్సీకి అప్పగించారు. ప్రభుత్వం ముందుగానే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకుని మధ్యలో కన్సల్టెన్సీని తీసుకొచ్చి వారి రిపోర్టుతోనే ఇచ్చామనేలా కథ సిద్దం చేసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో సాకారమైన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలకు కట్టబెట్టే యత్నాలను టీడీపీ కూటమి సర్కారు ముమ్మరం చేసింది. 66 ఏళ్లపాటు ఎకరం లీజు ఏడాదికి రూ. 100లకే.. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కనీసం 50 ఎకరాల్లో నిర్మాణం చేయడం జరిగింది. వాటిలో ఎకరం విలువ దాదాపు రూ. 2 కోట్లకు పైమాటే. ఇలాంటి స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ. 100లకే లీజు పేరుతో కట్టబెట్టే వ్యూహాలకు పదునుపెట్టింది. 50 ఎకరాల స్థలంతో పాటు రూ.500 కోట్లతో నిర్మించిన కాలేజీలను ఏడాదికి కేవలం రూ. 5 వేలకే అప్పజెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్కు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకు ఇస్తున్నారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే రేపొద్దున పేదవాడు అనారోగ్యంతో ఆయా ఆస్పత్రులకు వెళితే వారికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉండదు. వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే హక్కు ప్రభుత్వం కల్పిస్తోంది. డాక్టర్ విద్యను అభ్యసించాలనుకున్న ఎంతోమంది పేద విద్యార్థుల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లాడు. ఈ ఏడాది కాలంలో ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఎంతోమందికి స్థానికంగానే ఉచిత వైద్యంతోపాటు మరెంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికేవి. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటుపరం చేసే నిర్ణయంతో అన్ని అవకాశాలకు గండికొట్టేశాడు. ఇది మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అమ్ముకునే కుట్రే. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కాదని ముందుకెళితే వైయస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. మళ్లీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిర్ణయాన్ని రివ్యూ చేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏడాదిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆర్థిక, రాజకీయ, సాంఘిక అంశాల మీదనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటికి అర్థమే మారిపోయింది. వ్యవసాయం, పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. సమస్యలపై రైతులు రోడ్డెక్కుతున్నారు. పరిశ్రమల ఊసేలేదు. ఐకానిక్ టవర్లంటూ మాయమాటలతో కాలయాపన చేస్తున్నారు. వారు ఎంచుకున్న అతికొద్ది మందిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. సాంఘిక అభివృద్ధి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో. సంక్షేమం అంటే ఈ ప్రభుత్వానికి నచ్చని పని. విద్య, వైద్యరంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పొలిటికల్ డెవలప్ మెంట్ అంటే రెడ్ బుక్ పాలనతో ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు బనాయించడమే ఈ ప్రభుత్వానికి తెలుసు. ఏడాదిలోనే అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఎందుకు తీసేయలేదు? ఇప్పటికే ఉచితంగా వైద్యం అందించే సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీలో 1059 ప్రొసీజర్ల నుంచి ఏకంగా 3257 ప్రొసీజర్లకు పెంచి ఉచితంగా వైద్యం అందించేలా గత ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేసింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ఇన్సూరెన్స్ మోడల్తో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. వైద్యాన్ని బాధ్యతగా అందించాల్సింది పోయి పేదలను కన్నీరు పెట్టిస్తున్నారు. ఆపరేషన్ చేయించుకుని మంచానికి పరిమితమై ఉపాధికి దూరమై ఆకలికి అలమటించే పరిస్థితి పేదవాడికి రాకూడదని గత వైయస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకొస్తే, ఏడాదిగా దాని ఊసే ఎత్తడం లేదు. గ్రామాల్లో ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్లు లేరు. మెడికల్ కాలేజీలు నిర్వహణ కష్టం కాకూడదని కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను మా ప్రభుత్వం తీసుకొచ్చేలా 108 జీవో తీసుకొచ్చింది. దానిపై మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో 108ని రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. ఏడాది గడిచినా ఎందుకు పట్టించుకోలేదు? మేం కట్టిన మెడికల్ కాలేజీల మొత్తాన్నే గంపగుత్తుగా ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీలో ఏడాదికి లక్ష డెలివరీలు అయ్యేవి. వారికి ఒక్కొక్కరికి రూ. 5వేలు ఇచ్చేవాళ్లం. ఏడాదిగా దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిలిపేసింది.