తాడేపల్లి: పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్లకు, ఎవరో రాసిస్తే చెప్పే దబాయింపులకు వైయస్ఆర్ సీపీలో బాల కార్యకర్త కూడా భయపడడు అని కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇక్కడే ఉంటా.. ఎదుర్కొంటా అని మాట్లాడుతున్న పవన్కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తాము కూడా వైయస్ఆర్ సీపీ ఆఫీస్ నుంచి బలంగా చెబుతున్నాం, ఎస్.. వెయిటింగ్. చంద్రబాబు, బీజేపీ, పవన్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ కలిసి రండి.. వెయిటింగ్ అంటూ పేర్ని నాని సవాల్ విసిరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు.
పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..
2019 ఎన్నికల ముందు వరకు అమరావతి అసలు రాజధానే కాదని, అది ఒక కుల రాజధాని, అది అందరి రాజధాని కాదు అని.. పవన్కళ్యాణ్, లోక్సత్తా జయప్రకాశ్నారాయణ, సీపీఎం, సీపీఐ, బీజేపీకి సంబంధించిన ఐవైఆర్ కృష్ణారావు కూడా అన్నారు. అమరావతి చంద్రబాబు దోపిడీకి ఆలవాలం. అది కేవలం ధనిక వర్గానికి లేదా ఒక కులానికి సంబంధించిన రాజధాని అని వారంతా అన్నారు. మళ్లీ వారే ఇవాళ ఏమంటున్నారు?. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తున్నామని, అన్నీ ఇక్కడే ఉండాలని మాట మార్చిన దరిమిలా.. ఆవేదనకు లోనైన ఉత్తరాంధ్ర ప్రజలు.. మరీ ప్రత్యేకించి డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్కు వెళ్లి తొడ గొట్టిన చందంగా, అమరావతి నుంచి వైజాగ్ వెళ్లి, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం లేదని.. అంతా తమకే కావాలని తొడ గొట్టే పరిస్థితి ఉంటే వారిలో భావోద్వేగం పెరగదా?
ఆ మాత్రం తెలియదా?..
ఉత్తరాంధ్ర మేధావులు, అక్కడ అభివృద్ధి కోరే వారు జేఏసీ ఏర్పాటు చేస్తే, దానికి వైయస్సార్సీపీ మద్దతు ఇచ్చింది. ఆ విషయం కూడా తెలియని పవన్కళ్యాణ్, అధికారంలో ఉండి గర్జన ఏమిటి? అంటున్నారు.
సీఎం వైయస్ జగన్ ఒకటి ధర్మం అనిపిస్తే, దానికి మద్దతు ఇస్తారు. మీరు మర్చిపోయినట్లున్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద మీటింగ్ పెట్టి, ఆ తర్వాత ఇంటికి వెళ్లి పడుకున్నట్లు కాదు. అధికారంలో ఉన్నప్పటికీ, ఉక్కు కార్మికులు ఉద్యమం చేస్తే వారికి మద్దతు ఇచ్చాం. ప్రభుత్వ పరంగా ఆర్టీసీ కార్మికులతోనూ సమ్మె చేయించాం. మీ పార్టనర్ చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక మాదిరిగా, అధికారంలో లేకపోతే మరో మాదిరిగా మాట్లాడతారు.
పవన్ మాటలు నీటి మీద రాతలు..
మీరు పూటకో మాట, నెలకో మాట, ఏడాదికో మాట. ప్రతి ఎన్నికలప్పుడు ఒక్కో మాట. ఏ మాత్రం నిబద్ధత లేని, నిలకడ లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క పవన్కళ్యాణ్ మాత్రమే. అందులో ఆయన నిష్ణాతుడు. పవన్ మాటలు నీటి మీద రాతలు. రెండూ ఒకటే. ఏ మాత్రం తేడా లేదు. ఇవాళ పవన్ మాట్లాడిన మాటలు రేపు ఉంటాయని లేదు. రేపు మరొకటి మాట్లాడతాడు.
ఎయిర్పోర్టు వద్ద దారుణంగా..
ఐపీఎస్ అధికారులు బెదిరించారని పవన్ అంటున్నారు. విమానాశ్రయం వద్ద మీ పార్టీ కార్యకర్తలు.. మంత్రులను పచ్చి బూతులు తిట్టారు. గొడవలకు సిద్ధమై పెద్ద కర్రలకు జెండాలు తగిలించి తీసుకొచ్చారు. దీన్ని అందరూ గుర్తించారు. అన్నింటికి వీడియోలు ఉన్నాయి. అసలు వాటిని జెండా కర్రలు అంటారా? వెనకబడిన కులానికి చెందిన ఒక మహిళా మంత్రి వస్తే, సిగ్గుతో చచ్చిపోయేలా తిట్టారు. ఆమెను కనీసం కారు నుంచి కూడా దిగనీయలేదు. సభ్య సమాజం కోసం అయినా, పవన్ స్పందించలేదు. జరిగిన దానికి చింతిస్తున్నానని పవన్ అనలేదు.
చంపాలని చూస్తారా?..
ఇద్దరు మహిళా మంత్రులు.. రోజా, రజనిని తిడతారా? దళిత మంత్రి నాగార్జున మీద చెప్పులు వేస్తారా? అదేనా మీ సంస్కారం? రోడ్ల మీద జనం అల్లాడుతున్నారు కాబట్టి, మీరు కారులో నేరుగా హోటల్కు వెళ్లమని పోలీసు అధికారులు చెబితే, తప్పా? మీరు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని చెబితే, దాన్ని కూడా తప్పు పడుతున్నారు. అంటే మీరు కారు ఎక్కి, చేయి ఊపుతూ వెళ్తే, జనం మీ వెంట పడి రావాలి. అదేనా మీ ఉద్దేశం. ఏ పదవి లేదు. కానీ వేల మంది ఫ్యాన్స్ ఉంటే ప్రివిలేజ్ కావాలి. కానీ ప్రజలు ఎన్నుకున్న మంత్రులకు ఆ ప్రివిలేజ్ అవసరం లేదా? ఇష్టానుసారం తిడతారా? కర్రలతో కొడతారా? చంపాలని చూస్తారా?
సిగ్గు విడిచి మాటలు..
ఆయనకు ఎవరో పతిత చెప్పారట. రాళ్లు వేయడం తప్పు కాదన్నాడట. ఆయన ఎవరో తీసుకురండి. మీ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడండి. మీ వాళ్లు కేవలం స్లోగన్స్ మాత్రమే ఇచ్చారా? అయితే వాటికే తల పగులుతుందా? మంత్రి రోజా అనుచరుడి తల పగిలింది. సిగ్గు విడిచి, బరితెగించి పవన్ మాట్లాడుతున్నాడు. తమ పార్టీ కార్యకర్తను జైలులో కొట్టారని పవన్ అంటున్నాడు. మళ్లీ ఆయనే చెప్పాడు. తమ పార్టీ వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకువచ్చానని. మరి వాళ్లే చెప్పారట. జైలులో కొట్టారని. అవేం పొంతన లేని మాటలు. అన్నీ కల్పిత మాటలు.
పొంతన లేకుండా..
వైయస్సార్సీపీ మీద ద్వేషం లేదు. పోలీసులంటే కోపం, ద్వేషం లేదు అంటాడు. తన తండ్రి కానిస్టేబుల్గా ఒకరోజు విశాఖలో పని చేశారని, మరోరోజు పాలకొల్లులో పని చేశారని, భీమవరంలో పని చేశారని, తెనాలిలో పని చేశారని, నెల్లూరులో పని చేశారని చెప్పారు. ఇవాళ మంగళగిరిలో పని చేశారని చెప్పారు. కానిస్టేబుల్ పోస్టు ఒక జిల్లాలోనే ఉంటుంది. నా అన్న చిరంజీవి అని చెప్పకుండా, మా నాన్న కానిస్టేబుల్ అని చెబుతున్నాడు. మా అన్న చిరంజీవి అని చెప్పి సినిమాల్లోకి వచ్చావా? లేక మీ నాన్న పేరు చెప్పుకుని వచ్చావా?
అవి విధానపరమైన విమర్శలా?..
విధానపరమైన విమర్శలు చేస్తాడంట? సీఎం వైయస్ జగన్ గురించి, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి అంబటి రాంబాబు గురించి, నా గురించి మాట్లాడినవి విధానపరమైనవా? వ్యక్తిగతమైనవా?. 2019 ఎన్నికల్లో కాకినాడ వెళ్లి చలమలశెట్టి సునిల్ గురించి మాట్లాడింది విధానపరమైందా? వ్యక్తిగతమైందా? రామచంద్రాపురం వెళ్లి తోట త్రిమూర్తులు గురించి నీవు మాట్లాడింది విధానపరమైందా? వ్యక్తిగతమైందా? కాకినాడ రూరల్లో మీటింగ్ పెట్టి కన్నబాబును విధానపరంగా విమర్శించావా? వ్యక్తిగతంగా విమర్శించావా? అంటే ప్రజలకు ఏవీ గుర్తు లేవనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వ్యక్తిగత దూషణలు చేశారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్పై ఏం మాట్లాడారు? అవి విధానపరమైనవా? వ్యక్తిగతమైనవా?
ఒకటికి పది ఇస్తాం..
ఇది సినిమా కాదు. నీవు డైలాగ్ చెబితే, తంతే పడిపోవడానికి. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అట్టుకు పది అట్లు పెడతాం. వాయినానికి 10 వాయినాలు ఇస్తాం. పవన్ ఇంకో మాట అన్నారు. మేము మాట మారుస్తున్నామట. నిజానికి మాట మార్చడానికి ఐకాన్ పవన్కళ్యాణ్. పూటకో మాట. నిలకడ లేని మాటలు. నిలకడ లేని మాటలకు. మాట మార్చే తత్వానికి ఐకాన్ పవన్ అని డిక్షనరీలో వేయాలి.
వికేంద్రీకరణ అంటే..
13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి ముక్కలు ముక్కలు చేశామంట. నిజానికి ఆ నిర్ణయం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. చివరకు మీ పార్టనర్ చంద్రబాబు కూడా తన నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయమని కోరారు. దాని కోసం ఉత్తరం రాశారు. ఇక ఆయన బావమరిది మా హిందూపురంను జిల్లా కేంద్రం చేయమని మా ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. మీ చుట్టాలు, మీ పార్టనర్లను అడిగితే వికేంద్రీకరణ అంటే ఏమిటన్నది తెలుస్తుంది.
ఏమిటి పైశాచికత్వం? మూర్ఖత్వం?..
పోలీసులపై ఒత్తిడి ఉంటుందట. వారికి ఉద్యోగపరమైన ఒత్తిడి ఉంటుంది. కొందరు గాలితనం ఉన్నవారు, వసికర్రలకు, లావు కర్రలకు జెండాలు తొడిగి, ఎయిర్పోర్టులోకి వచ్చి, గొడవలు చేసి, హత్యాయత్నం చేస్తే, పోలీసులు ఊర్కుంటారా?. గతంలో ఒక పేపర్లో మీమీద వార్త రాస్తే, రివాల్వర్తో ఆ పత్రిక ఆఫీస్కు వెళ్లి బెదిరించావా? లేదా? టీవీ ఛానల్లో ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే, దానిపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆ టీవీని బాయికట్ చేయమని కోరావు. ఆ స్వేచ్ఛ నీకు ఉన్నప్పుడు.. ఏకంగా మంత్రుల మీద హత్యాయత్నం చేస్తే, పోలీసులను ఏం చర్యలు తీసుకోవద్దని అంటున్నావు. మావాళ్లు ఏం చేసినా పట్టించుకోవద్దు అంటున్నావు. ఏమిటి పైశాచికత్వం. మూర్ఖత్వం.
ఒక్కసారి లెక్కలు చూడండి..
రూ.3 వేల పెన్షన్ అడిగితే బెదిరిస్తున్నామా? ఇది వైయస్ జగన్ ప్రభుత్వం. ఎవరు పెన్షన్ ఆపాలనుకున్నా, ఆ పని చేయలేరు. అలా పరిపాలన సాగుతోంది. మీ పార్టనర్ పరిపాలన కాదు ఇది. వారి హయాంలో ఎందరి పెన్షన్లు తొలగించారో లెక్కలు చూడండి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అన్ని పెన్షన్లు కలిపి దాదాపు 40 లక్షలు మాత్రమే ఉంటే, ఇవాళ ఏకంగా 63 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం.
ఆరోజు నెలకు పెన్షన్ల కింద కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, ఇవాళ రూ.1590 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దానికి దీనికి ఎక్కడైనా పోలిక ఉందా?
ఎవరు స్పాన్సర్స్?..
గొప్ప ఛానళ్లు తనను బలపర్చమని పవన్ కోరుతున్నాడు. అంటే ఆయనకు అవసరం వచ్చినప్పుడు వారి సహకారం కావాలి. మొన్నటి వరకు ఆ ఛానల్స్ను తిట్టాడు. అసలు విశాఖలో రచ్చ చేసిందెవ్వరు?. పవన్ స్పెషల్ ఫ్లైట్స్లో వస్తారు. అంతా చేసి ఆయన ఇచ్చేది రూ.60 లక్షల చెక్కులు. అది కూడా ఇన్సూరెన్ప్ కంపెనీలు ఇచ్చేవే. దాని కోసం స్పెషల్ ఫ్లైట్స్. వాటికి ఎంత ఖర్చవుతుంది? అందులో వచ్చేది మీరు ఇద్దరే? దానికి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు?
ప్రజల దృష్టి మళ్లించే కుట్ర..
విశాఖలో 15న గర్జన కార్యక్రమం ఉందని, చంద్రబాబు సలహా మేరకు అక్కడికి వచ్చి రచ్చ చేశారు. చంద్రబాబు చేసిన కుట్రలో పావుగా వచ్చి డ్రామాలు ఆడడం పాపం కాదా? ఉత్తరాంధ్ర ప్రజల ఉసురు పోసుకోరా? గర్జన నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర. ఇక్కడ తననే యుద్ధం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం చెబుతోందట. మరి తన పార్టీ కార్యకర్తలు నలుగురు మంత్రులను హత్యాయత్నం చేయబోయారని వారికి చెప్పాలి కదా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మవద్దని వారికి చెప్పాలి కదా?
మీ పాచికలు పారవు..
పవన్కు చివరగా చెప్పేది ఒకటే.. సీఎం వైయస్ జగన్ గత మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని మరుగునపర్చి, మసిపూసి అలజడి సృష్టించాలని మీరు, చంద్రబాబు ఎన్ని పథకాలు రచించినా.. వైయస్ జగన్ బలమైన ముద్ర వేసుకున్నారు. ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు నాటకాలు కానీ ఏం చేసినా ప్రజల గుండెల్లో సీఎం వైయస్ జగన్ సుస్థిరమైన ముద్ర వేసుకున్నారు. మీ నాటకాలు, చంద్రబాబు డైరెక్షన్లో ఏం చేసినా, ప్రజల్లో మీ పాచికలు పారవు. నీవు ఖాకీ చొక్కా సినిమాల్లో వేయగలవు. కానీ రాజకీయాల్లో కాదు. డైలాగ్లు కూడా సినిమాల్లో మాదిరిగా బయట చెబితే, అడ్డుకట్ట వేస్తాం. మాటకు మాట చెబుతాం. ప్రజలు మీ సినిమాలు చూస్తారని, మీ దగ్గరకు వచ్చి ఈలలు వేసినంత మాత్రాన రాజకీయం మారదు. ప్రజల గుండెల్లో వైయస్ జగన్కి ఉన్న సుస్థిర స్థానం చెక్కు చెదరదు. ఇదే మాట చంద్రబాబుకు కూడా చెప్పండి.
అది జరుగుతుందనుకున్నావ్:
తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని 2014లో పవన్ కోరారు. మళ్లీ 2019లో ఆ పార్టీకి ఓటేయొద్దని చెప్పారు. అంటే మెచూరిటీ లేని నిర్ణయాలు తీసుకునేది పవన్ అని అర్ధమవుతోంది. బీజేపీకి ఓటేయమని, కాంగ్రెస్ విముక్త భారత్ అని 2014లో చెప్పిన పవన్, 2019లో అదే బిజేపీ విముక్త భారత్ అన్నారు. అలా ఎందుకన్నాడు? 2014లో జగన్గారికి ఓటేయవద్దన్నావు. 2019లో కూడా అదే మాట చెప్పావు. 2014లో ప్రజలు నీ మాట విన్నారని అనుకున్నావు. అదే 2019లో కూడా జరుగుతుందని అనుకున్నావు. కానీ 2014 నుంచి మీ పార్టనర్ పాపపు పరిపాలన చూసి, బాధలు పడిన ప్రజలు తిరగబడ్డారు. మీరు, ఎల్లో మీడియా, చంద్రబాబు ఎంత విషం చిమ్మినా ప్రజలు తమ గుండెల్లో వైయస్ జగన్కి స్థానం ఇచ్చారు. 2024లో కూడా అదే జరుగుతుంది.
ఎక్కడ అడ్డుకున్నాం?:
ఆయన సభను ఎక్కడ అడ్డుకున్నారు? ఎన్ని సభలు జరిగాయి? జనవాణి పేరుతో కాగితాలు తీసుకునే డ్రామాలు చేస్తున్నారు. మీ కార్యకర్తలే ప్రజలను తీసుకొచ్చి, వారితో ఏవో కాగితాలు ఇప్పిస్తున్నారు. దాన్ని అడ్డుకున్నది ఎవరు? నిన్న కూడా విశాఖలో ఆ కార్యక్రమం చేసుకోమంటే, వద్దన్నారు. దాంతో తిరిగి వెళ్లిపోమని సాయంత్రం పోలీసులు నోటీస్ ఇచ్చారు. నువ్వు ఎన్ని సినిమా డైలాగ్లు కొట్టినా, చంద్రబాబు కోసం ఎన్ని తంతులు చేసినా అదిరేవాడు, బెదిరేవాడు ఎవరూ లేరు.