రామాయపట్నం: ప్రజల సొమ్ముతో నిర్మించిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే కుట్రకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో రామాయపట్నం‘ కార్యక్రమం భారీ ప్రజాస్పందన మధ్య విజయవంతమైంది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కందుకూరు వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మత్స్యకారులు కార్లు, బైక్లతో భారీ ర్యాలీగా రామాయపట్నం పోర్టు ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ‘రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి.. దాన్ని ప్రైవేటీకరించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. ఇది అంతం కాదు.. ప్రజల హక్కుల కోసం ప్రారంభమైన పోరాటానికి ఇదే ఆరంభం‘ అని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..: జగన్ గారి హయాంలోనే రామాయపట్నం పోర్టు: ప్రజల ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కలలుగన్న రామాయపట్నం పోర్టును వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించి, వేల కోట్ల రూపాయలతో నిర్మించింది. దాదాపు పూర్తయిన ఈ ప్రజా ఆస్తిని కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన పోర్టును కొందరి లాభాల కోసం తాకట్టు పెట్టే ప్రయత్నాలను వైయస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటుంది. కారుచౌకగా కట్టబెట్టే కుట్ర: రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును కేవలం రూ.1,500 కోట్లకు అప్పగించాలని చూస్తున్నారు. నిర్మాణానికి తీసుకున్న అప్పులు ప్రభుత్వమే చెల్లిస్తుంది.. మిగిలిన పనులు ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.. కానీ నిర్వహణ హక్కులు మాత్రం ప్రైవేటుకు ఇస్తారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ఆస్తిని ప్రైవేటుకు కట్టబెట్టే ఈ దోపిడీ వెనుక ఉన్న ప్రయోజనం ఎవరికో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది అభివృద్ధి కాదు. ప్రజల ఆస్తులపై పగటిపూట జరుగుతున్న బహిరంగ దోపిడీ. స్థానిక ప్రజల ఆశలపై నీళ్లు: ఇంత ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లడమే. రామాయపట్నం పోర్టు కోసం రైతులు భూములు త్యాగం చేశారు. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. వారి త్యాగాలతో నిర్మించిన పోర్టును ఇప్పుడు ప్రైవేటు చేతుల్లో పెట్టడం అంటే వారి ఆశలపై నీళ్లు చల్లడమే. రైతులు, మత్స్యకారులు, స్థానిక యువత హక్కులను కాలరాసే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైయస్ఆర్సీపీ ఉద్యమం ఆగదు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉ«ధృతం చేస్తాం. అంతం కాదు.. ఆరంభం మాత్రమే: పోర్టును పరిశీలించేందుకు, ప్రజలకు నిజాలు చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, పోలీసులతో బలవంతంగా తరలించడం ప్రభుత్వ భయానికి నిదర్శనం. ప్రజల ఆస్తిని అమ్మే కుట్ర బయటపడుతుందనే భయంతోనే మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజల ఆస్తులను కాపాడే ఈ పోరాటం ఇక్కడితో ముగిసేది కాదు. రామాయపట్నం పోర్టు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగే వరకు, ప్రైవేటీకరణ నిర్ణయం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాన్ని మరింత ఉ«ధృతం చేస్తాం. అందుకే ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే‘ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు.