గుంటూరు: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ లాక్కుంటోందని, దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు కుట్రలతో విజయం సాధించారని విమర్శించారు. బుధవారం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. గుంటూరులో 57 డివిజన్లలో వైయస్ఆర్సీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. 'మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చేసినవారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినవారు కన్నా లోపలుండి వెన్నుపోటు పొడిచే వారు మరింత ప్రమాదకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కార్పోరేషన్ లో అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవటాని సిద్దంగా ఉన్నామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇమడలేని వారు వెళ్లిపోవచ్చు: పార్టీలో ఇమడలేని వారు బయటకు వెళ్లిపోవచ్చని అంబటి రాంబాబు సూచించారు. అంతేకానీ, లోపలుండి కుట్ర రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా మార్చాలని చూస్తున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి స్థానిక సంస్థలను తమ వశం చేసుకోవాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. పార్టీ గీత దాటిన వారి పైన సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ వీడాలి టీడీపీ చేసిన అక్రమాలను కళ్లముందు చూస్తున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ప్రజాస్వామ్యం కోసం గళం విప్పిన పవన్ ఇప్పుడు మాత్రం మౌనం వహించడం ఏంటని విమర్శలు గుప్పించారు. అలాగే బుడమేరు వరదల పేరిట 9 కోట్ల రూపాయల స్కాం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆ స్కాంను బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ వైపు నిలిచిన 24 మంది కార్పొరేటర్లను ఆయన అభినందించారు. వారు మా పార్టీకి బలమైన సైనికులు అని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కార్పొరేటర్లపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. జగనన్నవెంటే ఉంటా: మేయర్ కావటి మనోహర్ నాయుడు తాను చివరి వరకూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు కార్పోరేషన్ లో వైయస్ఆర్సీపీకి మెజారిటీ ఉన్నా స్టాండింగ్ కమిటీలోని ఆరు స్థానాలను కూటమి కైవసం చేసుకుందన్నారు. ఇదేదో అతి పెద్ద విజయం అన్నట్లు అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైయస్ఆర్సీపీ ఖాళీ అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. లోపాయికారీ ఒప్పందంతో కొంతమంది కార్పోరేటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పేర్కొన్నారు. మాతో పాటే ఉంటూ కొంతమంది వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారని, క్రాస్ ఓటింగ్ పాల్పడివారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.