తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నా కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న సీఎం చంద్రబాబు, కరవును ఎదుర్కోవడానికి కనీసం ప్లాన్ సిద్ధం చేయలేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ అయ్యారు. జూలై నాటికే కరవు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా, డెల్టాకు నీరిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రచారం వల్ల, నమ్మిన రైతులు సాగుకు దిగారని, ఇప్పుడు తీవ్ర కరవు పరిస్థితులు రావడంతో నారుమళ్లు సైతం ఎండి పోతున్నాయని, అయినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన కార్యాచరణ లేకపోవడం వల్ల, రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల మేర నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు, సమస్యను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారన్న శ్రీ వైయస్ జగన్, నాడు తమ ప్రభుత్వంలో అదే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తూ జీఓ:176 ఇచ్చామని గుర్తు చేశారు. అయితే తన మనిషి అయిన బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా కోర్టులో పిల్ వేయించిన చంద్రబాబు, అది అమలు కాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అవే రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు హడావిడి చేస్తున్నారని, అది కోర్టులో నిలబడదని తెలిసినా, రిజర్వేషన్లు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి సరఫరా, రవాణా జరుగుతోందని, ఎక్కడా దానికి అదుపు లేదని, చివరకు పోలీస్ వాహనంలోనే గంజాయి దొరికితే పరిస్థితి ఏమిటని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు. అడ్డంగా దొరికినా కేసును మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆయన, స్వయంగా పోలీసులే ఇలా ఉంటే.. ప్రజలు ఇక ఎవరిని నమ్మాలని అన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, ప్రభుత్వ నిర్లక్ష్యం.. బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు చేస్తున్న డ్రామా.. యథేచ్ఛగా గంజాయి సరఫరా, రవాణాపై వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రెస్మీట్లో శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏమేం మాట్లాడారంటే..: ఆ ప్రశ్నలకు సమాధానం లేదు: డీఎస్సీలో అక్రమాలు, పేపర్ లీకేజీపై ఆధారాలతో సహా మీడియాతో మాట్లాడాను. అప్పుడు నేను సాక్ష్యాలు, ఆధారాలతో సహా లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన సవాల్కు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కానీ, మీడియా ప్రశ్నలకు బదులిస్తూ నేను మాట్లాడిన వాటిపై కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నట్లు విమర్శలు చేస్తూ, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మూడు ప్రధాన అంశాలపై నాణానికి ఇటువైపు ఉన్న విషయాలు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో కరవు పరిస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యం. రైతుల కష్టాలు బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న డ్రామా రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి సరఫరా, రవాణా. చివరకు పోలీసులే పాత్రధారులు అవుతున్న వైనంపై వివరిస్తాను. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు: తీవ్ర వర్షపాత లోటు. కుంభకర్ణుడిలా సీఎం చంద్రబాబు: రాష్ట్రంలో ఇప్పుడు కరవు పరిస్థితి నెలకొంది. తీవ్ర వర్షాభావం. ఖరీఫ్ ప్రారంభం.. అంటే జూన్ నుంచి ఇప్పటి వరకు (ఆగస్టు 25 నాటికి) –52 శాతం (మైనస్) వర్షపాతం. కోస్తా ఆంధ్రలో చూస్తే –47.18%, రాయలసీమలో –52.36%. ఏ జిల్లా చూసినా కూడా వర్షపాత లోటు కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబునాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప, రైతులకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టలేదు. సాధారణంగా జూన్ నుంచి ఇప్పటి వరకు (ఆగస్టు 25) 394 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు పడింది కేవలం 189.62 మి.మీ. రాష్ట్రంలో 688 మండలాలకు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే 91 శాతం ప్రాంతం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితి. వాటిలో 434 మండలాల్లో లోటు వర్షపాతం ఉంటే.. మరో 191 మండలాలలో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. అంటే మైనస్ 19 నుంచి మైనస్ 59 శాతం వరకు వర్షపాత లోటు కనిపిస్తోంది. ఇంకా 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు, వైయస్సార్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు ఉంది. ఈ డేటా మొత్తం ఒకసారి గమనిస్తే అందరికీ స్పష్టంగా కనిపించేది ఏమిటంటే.. తరుచూ కరవుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, కోస్తాలోనూ ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. అయినా వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడుగారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఇష్టపడటం లేదు. రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం అడుగులు ముందుకు వేయడం లేదు. రాష్ట్రంలో ఖరీఫ్ పంట సాగు చూస్తే.. 63 లక్షలకు పైగా ఎకరాలకు గాను కేవలం 50 లక్షలకు పైగా ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే సాగు దాదాపు 80 శాతం మాత్రమే కనిపిస్తోంది. ప్రభుత్వ ఆర్భాట ప్రచారం. నమ్మిన రైతులు నట్టేట.. ఎకరాకు ఇప్పటికే ఏకంగా రూ.15 వేల నష్టం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై, తీవ్ర కరవు పరిస్థితులు కనిపిస్తున్నా కూడా జూలై 10న, పంటలకు నీళ్లిస్తున్నామంటూ పట్టిసీమ లాకుల వద్ద పూజ చేసిన మంత్రి రామానాయుడు, ఫోజులిచ్చి ఫోటోలు దిగారు. వెన్నుపోటు పార్టీకి చెందిన మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళను నమ్మి నీళ్లు ఇస్తారనుకున్న కృష్ణా డెల్టా రైతులే కాకుండా, రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా రైతులంతా అప్పులతో పెట్టుబడి పెట్టారు. అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని, నార్లు నాటి వ్యవసాయంలోకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. కానీ, ఆ నార్లన్నీ ఇవాళ ఎండిపోయిన పరిస్థితి. ఖరీఫ్లో సాగుకు సన్నాహక ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు ద్వారా ఇప్పటికే ప్రతి ఎకరాకు రైతు కనీసం రూ.15 వేలు నష్టపోయే దుస్థితి. ఇక్కడ అంతా ఒక విషయాన్ని గమనించాలి. ఎల్నినో ప్రభావం ఉందని తెలుసు. జూన్లోనే లోటు వర్షపాతం నమోదైంది. జూన్లో –25 శాతం, జూలైలో –66 శాతం లోటు వర్షపాతం. ఇది అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్లు పోజులు ఇచ్చి, నీరు విడుదల చేస్తున్నట్లు హంగామా చేశారు. ఇంకా ‘ప్రతి ఎకరాకు, కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు’ అంటూ తమ అనుకూల మీడియాలో రాయించుకున్నారు. కానీ, ఈరోజు ప్రభుత్వం నీళ్లు ఇవ్వని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబునాయుడుగారు కనీస మానవత్వం అనేది కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం: ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ గురించి చెప్పాలి. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే విషయంలో చంద్రబాబునాయుడుగారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అని అంటే.. శ్రీశైలంలో గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) 885 అడుగులు. ఈ ఆగస్టు 11న ప్రాజెక్టులో 879.50 అడుగుల నీరుంది. అప్పుడు అవకాశం ఉన్నా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబునాయుడుకు మనసు రాలేదు. ఇది చాలా కీలకాంశం. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ప్రాజెక్టులో 880 అడుగులు ఉంటేనే పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయొచ్చు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గే కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి తగ్గుతూ పోతుంది. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో, అప్పుడు నీరు ఇవ్వాలనుకున్నా సాధ్యం కాదు. కాగా, ఇప్పుడు (ఆగస్టు 25) శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని చూస్తే, అక్కణ్నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా నీరు వాడేస్తోంది. అలా రోజుకు 48 వేల క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. కానీ, సీఎం చంద్రబాబు ఇక్కడ కూర్చుని ఏదీ పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ప్రాజెక్టులో (ఆగస్టు 25న) ఇన్ఫ్లో చూస్తే, అది కేవలం 7 వేల క్యూసెక్స్ మాత్రమే. అంటే శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్స్ అయితే, అవుట్ఫ్లో ఏకంగా 48 వేల క్యూసెక్స్. అంటే దాదాపు 3.5 టీఎంసీలు. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లో ప్రాజెక్టులో నీటి మట్టం కనిష్ట స్థాయి 854 అడుగుల దిగువకు పడిపోతుంది. అప్పుడు ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరున్నా, రాయలసీమకు సరఫరా చేయలేం. సీమ ప్రాజెక్టుల్లో అడుగంటిన నీరు: తెలుగుగంగ కెనాల్ మీద ఆధారపడి ఉన్న వెలుగోడు, బ్రహ్మసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు అయితే, ఇప్పుడు (ఆగస్టు 25న) వాటన్నింటిలో కలిపి 55 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో డెడ్ స్టోరేజ్ దాదాపుగా 14 టీఎంసీల దాకా తీసేస్తే ఇక అందుబాటులో ఉన్న నీరు కేవలం 41 టీఎంసీలు మాత్రమే. అంటే కేవలం 23 శాతం నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఇక ఆ తర్వాత కింద ఎస్ఆర్బీసీ, జిఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే.. గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్లలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 59 టీఎంసీలు కాగా, ఇప్పుడు (ఆగస్టు 25న) 31 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో డెడ్ స్టోరేజీ 8 టీఎంసీలు తీసేస్తే, ఇక మిగిలింది కేవలం 23 టీఎంసీలు మాత్రమే. అంటే ఆ ప్రాజెక్టుల్లో కేవలం 39 శాతం మాత్రమే నీళ్లు అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇంకా హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులను చూస్తే.. జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి. వీటన్నింటి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 43 టీఎంసీలు కాగా, ఇప్పుడున్న (ఆగస్టు 25న) నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. అందులో కూడా డెడ్ స్టోరేజ్ 1.65 టీఎంసీలు తీసేస్తే ఇక అందుబాటులో ఉండేది కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే. ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే ఆగస్టు దాదాపు అయిపోయింది. సెప్టెంబరు 15 తర్వాత వర్షాలు తగ్గుముఖమే. ఇలాంటి పరిస్థితుల మధ్య శ్రీశైలం నుంచి ఎడాపెడా నీరు తోడేస్తే భవిష్యత్తులో కరవు పరిస్థితి మరింత తీవ్రం కానుంది. అందుకే పరస్థితి తీవ్రత గుర్తించి, పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు కోసం ఎందుకు చర్య చేపట్టడం లేదని చంద్రబాబుగారిని గట్టిగా అడుగుతున్నాను. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయలసీమ ప్రజలకు మా ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలుపెట్టాం. పులిచింతల వద్ద కూడా నీటి గండి. లిఫ్ట్లు కడుతున్న తెలంగాణ ప్రభుత్వం: మరోవైపు నాగార్జునసాగర్ కింద పులిచింతల వద్ద పరిస్థితి చూస్తే.. అక్కడా దారుణంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా లిఫ్టుల నిర్మాణం చేస్తోంది. అయినా చంద్రబాబునాయుడు చోద్యం చూస్తున్నారు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీల నీరు తరలించడానికి రూ.1,450 కోట్లతో చేపట్టిన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇది పూర్తిగా అక్రమ ప్రాజెక్ట్. అయినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఇంకా అదే తెలంగాణ ప్రభుత్వం, అక్కడే పులిచింతల చేరువలో చింతలపాలెం మండలం, బుగ్గ మాదారం వద్ద çకృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీల నీరు తరలించడానికి రూ.394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు కెపాసిటీ దాదాపు 45 టీఎంసీలు కాగా, అక్కణ్నుంచి దాదాపు 10.5 టీఎంసీల నీరు తీసుకెళ్లేలా లిఫ్ట్ల నిర్మాణం కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్నా, సీఎం చంద్రబాబుగారు చోద్యం చూస్తున్నారు తప్ప, కనీసం స్పందించడం లేదు. కనీసం ప్రశ్నించడం లేదు. రైతులను ఆదుకోని కూటమి ప్రభుత్వం. ఉచిత పంటల బీమాకు మంగళం: తీవ్ర కరవు వల్ల ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా చంద్రబాబునాయుడుగారు రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకుంటున్నాడా? అంటే అదీ లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైయస్సార్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి వారికి తీవ్ర అన్యాయం చేశాడు. ఇప్పుడు రైతులే ప్రీమియం కట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణంగా ఉందంటే.. ఒక ఉదాహరణ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానం. 2022–23 ఖరీఫ్ సీజన్లో (అంటే మా ప్రభుత్వ హయాంలో) ఉచిత పంటల బీమా ఆంధ్రప్రదేశ్లో 1.18 కోట్ల దరఖాస్తులకు వర్తిస్తే, ఈ ఏడాది (2026–27) ఖరీఫ్లో ఆ దరఖాస్తుల సంఖ్య కేవలం 40 లక్షలు మాత్రమే. (అంటూ ఆ డేటా పీపీటీలో చూపిన శ్రీ వైయస్ జగన్, చదివి వినిపించారు) ఇప్పుడు నేను అడుగుతున్నా. నాడు ఎక్కడ 1.18 కోట్ల దరఖాస్తులు. ఇప్పుడు ఎక్కడ 40 లక్షలు. ఎంత తేడా! అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకుంటే తప్ప. అంటే 30–35% కూడా ఇన్సూరెన్స్ కవర్ లోకి రావడం లేదు. ఇంకా మరో దారుణం ఏమిటంటే, 2023–24లో అంటే మా ప్రభుత్వంలో చివరి ఏడాది, చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలైలో ఇన్సూరెన్స్ ప్రీమియమ్ కట్టాలి. అంటే 2023 ఖరీఫ్కు సంబంధించిన పంటల బీమా ప్రీమియమ్ను 2024 జూలైలో కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియమ్ కడితే, కేంద్ర ప్రభుత్వం తన కంట్రిబ్యూషన్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే రైతుల తరపున, ఇంకా తన వాటాగా రెండు వంతుల ప్రీమియమ్ రాష్ట్ర ప్రభుత్వం కడితే, కేంద్రం మూడో వంతు ప్రీమియమ్ చెల్లిస్తుంది. కానీ, చంద్రబాబుగారు ఆ ప్రీమియమ్ కట్టకపోవడం వల్ల రైతులు దాదాపు రూ.3 వేల కోట్లు నష్టపోయారు. ఆయన అప్పుడు ఆ ప్రీమియమ్ కట్టి ఉంటే, రైతులకు అంత నష్టం జరిగి ఉండేది కాదు కదా?. చంద్రబాబు హయాం. వ్యవసాయ రంగానికి శాపం: గత ఏడాది అక్టోబరులో మొంథా తుపాన్ వచ్చింది. ఎంతో నష్టం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఒక్క పైసా సాయం చేయలేదు. అటు ఉచిత పంటల బీమా నాశనం చేశారు. మరోవైపు ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఆపేశారు. ఈ–క్రాప్ను కూడా నాశనం చేశారు. రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ల్యాబ్లను నిర్వీర్యం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అదే మా ప్రభుత్వ హయాంలో సీఎం–యాప్ ఉండేది. ‘కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్’. ప్రతి ఆర్బీకే పరిధిలో పంటల మద్దతు ధర ప్రకటిస్తూ పోస్టర్లు ఉండేవి. గిట్టుబాటు ధరలు ఇవి అని. ఏ ఆర్బీకే పరిధిలో ఆ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి వస్తే, అగ్రికల్చరల్ అసిస్టెంట్ (అతడు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్) వెంటనే సీఎం–యాప్ ద్వారా అలారం మోగించే వాడు. దీంతో ఆ బాధ్యత చూస్తున్న జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి మార్కెట్లో జోక్యం చేసుకునేవాడు. ఆ ఆర్బీకే పరిధిలోనే వెంటనే పంటలు కొనుగోలు చేసేవాడు. అలా మార్కెట్లో పంటల ధరకు పోటీ సృష్టించే వాడు. దీని వల్ల పంటల ధరలు పెరిగేవి. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థను చంద్రబాబుగారు పూర్తిగా నాశనం చేశారు. మా ప్రభుత్వ హయాంలో, ఆ 5 ఏళ్లలో పంటల కొనుగోలు కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. సున్నా వడ్డీ రద్దు. పెట్టుబడి సాయం ఒట్టిదే: చివరకు రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని కూడా చంద్రబాబునాయుడుగారు రద్దు చేశారు. ఇంకా దారుణం ఏమిటంటే.. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడు ఈయన అన్న మాట ’పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ’ అంటూ పేరు మార్చి ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. అలా ఈ మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19 వేలు. అంటే రూ.41 వేలు ఎగ్గొట్టాడు. ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబునాయుడుగారు ఆదుకున్నాడా? అసలు ఆదుకునే ప్లాన్ ఏదైనా ఉందా? అని అడుగుతున్నాను. ఎంతసేపూ వాటిపైనే ధ్యాస. కంటింజెన్సీ (ప్రత్యామ్నాయ) ప్లాన్ లేదు: చంద్రబాబునాయుడుగారు ఎంతసేపూ మాపై తప్పుడు ప్రచారాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, టాపిక్స్ డైవర్ట్ చేయడం, రెడ్బుక్ వినియోగం మీదే ధ్యాస. అంతేతప్ప, కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకోవాలి అన్న దానిపై ఏ మాత్రం ధ్యాస లేదు. జూన్ నుంచి ఇప్పటి వరకు –52 శాతం వర్షపాతం నమోదైంది. నిజానికి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు గత నెల నాటికే కంటింజెన్సీ (ప్రత్యామ్నాయ) ప్రణాళిక సిద్దం చేయాలి కదా? దాన్ని ఆగస్టులో అమలు చేయాలి కదా? కానీ, చంద్రబాబు ప్రభుత్వం దీనిపై అస్సలు దృష్టి పెట్టలేదు. అసలు కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు లేదు? రైతులకు ఎందుకు విత్తనాలు సరఫరా చేయలేదు? అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసలు, జొన్నలు, సజ్జల విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు. ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులకు ఏం సాయం చేశారు? జూలై చివరి నాటికి వర్షపాతం –52 శాతం లోటు ఉన్నా, రైతులను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు. ప్రత్యామ్నాయ పంటల ఆలోచన ఎందుకు లేదు. నేను అడుగుతున్నాను. అసలు ఎంత మంది రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు ఉచితంగా ఇచ్చారు? రైతులను ఆదుకోవాలన్న దిశలో ఏ చర్యలు లేవు. అప్పుడు ఇస్తే ఏం లాభం? ఇప్పటికే అవి మొదలై ఉండాలి కదా?: ఈరోజు ఆగస్టు 26. అంటే ఆగస్టు కూడా దాదాపు గడిచిపోతోంది. ఇక సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలకు అవకాశం లేదు. ఆ తర్వాత మీరు ఏమి ఇచ్చినా ఏం లాభం? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఏం మేలు చేసినా, ఎవరికి ఏం విత్తనాలు ఇచ్చినా ఎవరికి ఏం లాభం? నిజంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీలకు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించడం ఇప్పటికే మొదలై ఉండాలి కదా? జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న పశుగ్రాసం ఈ పాటికే చూసుకొని ఉండాలి కదా? ఎక్కడ తక్కువ ఉంది? ఎక్కడ ఎక్కువగా ఉంది? ఎక్కణ్నుంచి ఇతర చోట్లకు సరఫరా చేయొచ్చు. వీటన్నింటిపై పూర్తి వివరాలు ఉండి, ఆ మేరకు పశుగ్రాసం సరఫరా చేయాలి కదా? మరి ఇవన్నీ ఎందుకు కాలేదు అని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మనం ఏం చేస్తున్నాం అని చెప్పి, గుండెల మీద చేతులు వేసుకుని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అని, చంద్రబాబుగారిని గట్టిగా నిలదీస్తున్నా. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు. డ్రామా: నాడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు: స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు. దీనికి సంబంధించి 2019లో మేము వచ్చిన తర్వాత జీఓ నెం:176 జారీ చేసి, బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబునాయుడుగారు తన పార్టీ నాయకుడు, అంతకు ముందు తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఎంపాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్ (ఏపీఎస్ఈజీసీ) సభ్యుడు అయిన బిర్రు ప్రతాప్రెడ్డి ద్వారా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది అప్పట్లో. ఇప్పుడు అదే పేరుతో మహా డ్రామా: 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి, మరోసారి మహా డ్రామాకు చంద్రబాబునాయుడుగారు తెర లేపారు. కోర్టుకు పోయేది ఆయనే. కొట్వి వేయించేది ఆయనే. మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని మాకు చెప్పేది మళ్లీ ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా.. మేము ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్ లో బీసీలను మేం ఏ మాదిరిగా ప్రమోట్ చేశాము అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెబుతాను. బీసీల కోసం చిత్తశుద్ధితో కృషి చేశాం. ఇవీ ఆ గణాంకాలు. గర్వంగా చెప్పగలం: బీసీల అభ్యున్నతి విషయంలో నిజంగా ఎవరైనా చిత్తశుద్ధితో కృషి చేశారంటే అది ఒక వైయస్సార్సీపీ, ఆ ప్రభుత్వం మాత్రమే అని గట్టిగా చెప్పగలుగుతాను. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలన్న ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది ఒక్క వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసినా బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మాకు మేముగానే 34 శాతమే కాదు అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. మా క్యాబినెట్ లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40 శాతం మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ ఐదు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీ, మైనారిటీలకే ఇచ్చాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు నలుగురు బీసీలను పంపించింది మేమే. అంటే దాదాపు 36 శాతం ప్రాతిని«థ్యం కల్పించాం. అదే చంద్రబాబునాయుడుగారు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అదే మేము మా హయాంలో నలుగురిని రాజ్యసభకు పంపాం. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం. అంటే 44 శాతం బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చాం. అంటే 48 శాతం వారికి ప్రాతినిథ్యం కల్పించాం. 13 జడ్పీ ఛైర్పర్సన్ పదవులు ఉంటే, వాటిలో 6 పదవులు, అంటే 48 శాతం బీసీలకు ఇచ్చాం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9, అంటే 69% బీసీలకే ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానాల్లో 239 అంటే 38% బీసీలకే ఇచ్చాం. మున్సిపల్ ౖఛైర్పర్సన్ పదవులు 84 ఉంటే వాటిలో 44, అంటే 53% బీసీలకే ఇచ్చాం. 639 జడ్పీటీసీల్లో 227 అంటే 36% బీసీలకే ఇచ్చాం. 8,239 ఎంపీటీసీ స్థానాలకు 3,361 అంటే 41 శాతం బీసీలకే ఇచ్చాం. 10,536 సర్పంచ్ల్లో దాదాపు 4 వేల మంది బీసీలు. అంటే 38 శాతం వారికే ఇచ్చాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్ పదవులు 196 ఉంటే వాటిలో 76, అంటే 39% బీసీలకే ఇచ్చాం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137 లో 53 బీసీలకే ఇచ్చాం, అంటే 37 శాతం బీసీలకే ఇవ్వడం. ఇంకా 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి ద్వారా ఆ కులాలకు నేరుగా ప్రయోజనాలు కల్పించాం. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని అంటే అది ఒక వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. ఇందులో మహిళలకు 50% ఇది కూడా ఒక విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరీ తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతే కాదు, బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైయస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించడం జరిగింది, బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాం. ఇది రికార్డుల్లో ఉంది. ఇంకా అనేక పథకాల అమలులో బీసీలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.1.30 లక్షల కోట్లు బదిలీ చేశాం. నాన్ డీబీటీతో కలిపితే ఆ మొత్తం అక్షరాలా రూ.1.82 లక్షలు. ఒక్కసారి ఆ పథకాలు గుర్తు చేసుకుంటే..: అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలు ద్వారా బీసీ కుటుంబాలకు ఎప్పుడూ జరగని మంచి చేశాం. కానీ ఇప్పుడు చంద్రబాబునాయుడుగారు బీసీల బతుకుల్ని బొగ్గిపాలు చేస్తున్నారు. నేను చెప్పినవన్నీ వాస్తవంగా జరిగినవే. అంతా ఆన్ రికార్డ్. ఈరోజు నేను చెబుతుంటే, మీరు వింటుంటే నిజంగా వెంట్రుకలు లేచి నిలబడే పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ ఒక్క వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ హయాంలో మాత్రమే జరిగాయి. బీసీల బతుకు బుగ్గిపాల్జేస్తున్న చంద్రబాబు: కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని ఏం చేస్తున్నాడు. వారి బతుకులు బుగ్గిపాల్జేస్తున్నాడు. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ఆ పథకాలన్నీ ఈరోజు ఏమయ్యాయి? అన్నీ రద్దయ్యాయి. పైగా ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు కూడా మోసాలు. సంతకాలతో ఇంటింటికీ ఇచ్చిన బాండ్లు, మ్యానిఫెస్టోతో కలిపి చెత్తబుట్టలో పడేశాడు. అలాంటి ఆయన తనకు బీసీల మీద ప్రేమ అంటాడు. అన్నీ మోసాలే. పైగా బీసీలు ఎవరైనా రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేక, వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. అందుకు ఇవీ ఉదాహరణలు: ఒక యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి (అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్ చేసింది 18 ఏళ్ల పిల్లాడు), దానికి కుట్రకోణం యాడ్ చేసి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టించాడు. ఒక మహిళా ఎస్సైని అడ్డుపెట్టుకొని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి, మా పార్టీ నాయకుడు చింతాడ రవిని జైలుకు పంపారు. నేను శ్రీకాకుళం జైలులో సీదిరి అప్పలరాజును చూడటానికి వెళ్ళినప్పుడు, వచ్చిన వేలాది ప్రజల్లో, అంత మంది సమక్షంలో మా బీసీ అభ్యర్థి, ఆముదాలవలస కోఆర్డినేటర్ చింతాడ రవి, ఒక మహిళా ఎస్ఐని చంపడానికి ప్రయత్నం చేశాడట!. అలా కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. మరో కేసు కర్నూల్లో. టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే పైగా తప్పుడు కేసులు పెట్టి్టంచడానికి అదే టిడిపి కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులు చింపేయించి, అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షి పై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీనే, ఫోన్ చేసి, ఫోన్ లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి, ‘అన్నా నాపై దాడి చేస్తున్నారు. నా ఇంటి మీద పడతున్నారు’ అని చెబితే, పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్లీ ఫోన్ చేసి ‘అన్నా పరిస్థితి విషమిస్తా ఉందన్నా‘ అని చెప్పి అంటే ఎమ్మెల్యే స్వయంగా ఆ ఊరు వెళ్లి, ఆ కార్యకర్తను కారులో ఎక్కించుకుని తీసుకొస్తుంటే దారిలో ఎమ్మెల్యే మీద దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరగ్గొట్టారు. ఇంకా ఒక టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను ఆయనే చింపుతాడు (ఆ వీడియో ఉంది. మొత్తం వైరల్ అయింది). కానీ, ఆ నింద మా ఎమ్మెల్యేపై వేసి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలుకు పంపారు. దాడికి గురైన కార్యకర్తను ఎమ్మెల్యే స్వయంగా తీసుకెళ్లి పోలీసులకు చూపినా, తన తమ్ముడి చేయి విరగ్గొట్టింది ఎవరో చెప్పినా.. పోలీసులు పట్టించుకోలేదు. కనీసం కేసు నమోదు చేయలేదు. మళ్ళీ అదే ఎమ్మెల్యే ఇంట్లో పడుకుని ఉంటే, అర్ధరాత్రి తర్వాత వందల మంది పోలీసులు వెళ్లి, ఆయన ఇంటిపై దాడి చేసి, ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్ కు అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. అది చాలా దారుణమైన కేసు. మద్యం రవాణా అనేది జిల్లా స్థాయిలో జరిగే కాంట్రాక్ట్. దాని విలువ కూడా తక్కువే. అయినా మద్యం రవాణాలో అక్రమాలంటూ తండ్రీ కొడుకులిద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కారుమూరి సునిల్ మా పార్టీ అభ్యర్థిగా ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. చంద్రబాబు హయాంలో ఎక్కువగా నష్టపోయేది బీసీలే: చంద్రబాబుకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తారా?. విశాఖపట్నంలో ఏడుగురు మత్స్యకారులు వేటకు పోతే అందులో ఆరుగురు చనిపోతే కనీసం వాళ్లని చూడడానికి స్థానిక మంత్రి పోలేదు. అలాంటి ఆయన బీసీల మీద ప్రేమ గురించి మాట్లాడతాడు. పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.9 వేల కోట్లు. ఫీజు చెల్లించకపోవడంతో పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో వారు చదువులు మానేస్తున్నారు. దీని వల్ల అత్యధికంగా నష్టపోయింది బీసీలే. అయినా వారిని పట్టించుకునే నాథుడు లేడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మరో మోసం చేస్తున్నారు. అంతా మాఫియా రాజ్యం. పప్పు బెల్లాలకు ప్రభుత్వ ఆస్తులు: ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తోంది ఏమిటి అంటే మట్టి మాఫియా, శాండ్ మాఫియా, సిలికా క్వార్ట్›్జ, లాటరైట్ మాఫియా. ఇంకా లిక్కర్ మాఫియా. అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు వీళ్లకు నచ్చిన వాళ్లకు, వీళ్ల బంధువులకు కట్టబెట్టడం, ఇసుకను అధిక రేట్లకు అమ్మడం. ఇంకా రాజధానిలో నిర్మాణాలు మామూలు రేట్లకు కూడా కాదు. అక్కడ చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణ వ్యయం రూ.22 వేలు దాటింది. రాజధాని ప్రాంతంలో అమరావతి పేరు చెప్పి బిల్డింగుల పేరులో చేస్తున్న స్కాములు. పోర్టులు శనక్కాయలు, బెల్లానికి అమ్మడం, ఫిషింగ్ హార్బర్లు శనక్కాయలు, బఠానీలకు అమ్మడం, మెడికల్ కాలేజీలనూ శనక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, విలువైన భూమి ఎక్కడ కనపడినా (విశాఖపట్నంలో ఏ భూమి ఉండడం లేదు. అంతా ఇచ్చేయడమే) శనక్కాయలు, బఠానీలకు వాళ్లకు కావాల్సిన వారికి ఇచ్చేయడం. ఇన్ని స్కామ్లు. యథేచ్ఛగా గంజాయి సరఫరా. రవాణా: ఇవన్నీ గాక డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కర్, అది కల్తీ లిక్కర్ ప్రతి ఊరికి వ్యాపించాయి. ప్రతి వీధికి వ్యాపించాయి. ఇది మాత్రమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన. మొన్న ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్లను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నారు. ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని నమ్మాలి?. పోలీస్ కారులో గంజాయి. లిక్కర్: మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు. తాజా సమాచారం ప్రకారం మత్తులో కారు నడిపింది మరో ఎస్ఐ అంటున్నారు. ఆ మత్తులో ఒక ఆటోను వారు ఢీ కొట్టారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్ తో సహా ఉన్న ఇద్దరు ఎస్సైలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్లు చూడడం జరిగింది. ఇంకా కారు డిక్కీలో గంజాయి, లిక్కర్, పోలీస్ యూనిఫామ్ ఉన్నాయి. అవన్నీ చూసిన ప్రజలంతా షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా? లేదా కొలంబియాలో ఉన్నామా? అని అందరికీ సందేహం కలిగింది. ఇదంతా చూసిన రాష్ట్ర ప్రజలు కూడా ఆందోళన చెందారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తుంటే ఒక సీఐ వచ్చి, వారిని బెదిరించాడు. వీడియో తీస్తే జైల్లో పెడతానని హెచ్చరించాడు. (అంటూ మీడియాకు పీపీటీలో ఆ వీడియో, ఫోటోలు చూపారు. ఆ ఘటనకు సంబంధించి వచ్చిన పేపర్ కథనం చదివి వినిపించారు) ఆ ఘటనపై పోలీసుల కవరింగ్ ఎలా ఉందంటే..!: ఇంత జరిగిన తర్వాత, దీన్ని ఎలా కవర్అప్ చేస్తున్నారో చూడండి. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజు మీడియాతో మాట్లాడిన వీడియో ప్రదర్శించి చూపారు. అలాగే ఎఫ్ఐఆర్లో ఏం రాశారు? ఇద్దరు ఎస్ఐలు ఏ వాంగ్మూలం ఇచ్చారు అనేది కూడా పీపీటీలో చూపారు. డీఎస్పీ గారు అంటారు.. ‘ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుంటే, రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఆరా తీస్తే, గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా, వీళ్ళిద్దరు కార్లో ఛేజ్ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది’ అని చెప్పారు. మరి ఎస్పీగారు ఏం చెప్పారంటే.. ‘కాదు కాదు ముందస్తుగానే మాకు సమాచారం వచ్చింది. ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రైడ్ చేశాం’ అని చెప్పారు. మరి ఎఫ్ఐఆర్లో ఏం రాశారు?: ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్సైలు, వీళ్ళ వాంగ్మూలం ఏముందని చూస్తే.. ‘ఇద్దరు ఎస్సైల్లో ఒక ఎస్సై కొడుక్కి.. కడుపునొప్పి వచ్చిందంట! అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురువ ఎస్సై పిలిస్తే సంతమాగులూరు ఎస్సై వెళ్లాడట!. ఎంత పరస్పర భిన్న (కాంట్రాడిక్షన్) మాటలు చూడండి!. (అంటూ మళ్లీ ఆ వీడియోలు పీపీటీలో ప్రదర్శించి చూపారు. ఎఫ్ఐఆర్లో ఏం రాశారనేది చదివి వినిపించారు) ‘అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్సై, బల్లికురువ ఎస్సైలము ఈరోజు మేము మా.. స్టేషన్లలో ఉన్నాము మహారాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్సె్పక్టర్ గారికి సంతమాగులూరు ఎస్సై అయిన నేను మరియు బల్లికురువ ఎస్సై అయిన వారము వ్రాసి ఇచ్చిన రిపోర్ట్. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్సై, బల్లికురువ ఎస్సైలము, ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటలకు బల్లికురువ ఎస్సై గారు వారి కుమారుడికి కడుపునొప్పి ఉన్నదని అద్దంకి హాస్పిటల్లో తీసుకుని వెళ్లాలని బల్లికురువ ఎస్సై గారు నాకు ఫోన్ చేసి పిలవగా నేను బల్లికురువ వెళ్ళినాను.’ ఎస్పీది ఒక మాట. 108 సర్వీస్ రికార్డులో మరో మాట: ‘కాగా, అంతకు ముందు ఎస్పీ గారు మాట్లాడుతూ ఏమన్నారు? ఎస్ఐ 108 కి ఫోన్ చేశాడని చెప్పారు. ఆ వెహికిల్ వచ్చేదాకా అక్కడే ఉండి ఎక్కించాడు అని చెప్పాడు కదా?’. మరి ఇక్కడ పేషెంట్ కేర్ రికార్డులో ఏం రాశారు? 108 అంబులెన్స్ కి కాల్ చేసింది స్థానికుడు అని రాశారు. (అంటూ ఆ రికార్డు పీపీటీలో చూపారు) 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రికార్డ్ అది. భవ్య హెల్త్ సర్వీసెస్ వాళ్ళే. ఈ చంద్రబాబునాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వారికి ఆ సర్వీసులు అప్పగించారు. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం తమకు కాల్ చేసింది స్థానికుడు. ఎస్ఐలను కాపాడేందుకు కుట్ర: మరి నేను అడుగుతున్నాను. కారులో గంజాయి కనిపిస్తాంది. ఆటోను మత్తులో ఢీకొట్టారు. దాంతో ఆటోలో ఉన్న పేషెంట్లు ఆస్పత్రిలో చేరారు. (అంటూ ఆ ఫోటోలు పీపీటీలో చూపారు) కారులో గంజాయి దొరికింది. ఆ కారులో ఉంది ఎస్ఐలు. అంతా మత్తులో ఉన్నారు. కారుతో ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న వారు ఆస్పత్రి పాలయ్యారు. కారు డిక్కీలో గంజాయి ఉంది. పోలీస్ యూనిఫామ్ ఉంది, లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే, డీఎస్పీ వారిని కాపాడాలని ప్రయత్నించారు. వీడియోలు తీసేటప్పుడు సీఐ బెదిరించాడు. పాపం ఎస్పీ (ఆయనకు విషయం పూర్తిగా తెలుసో తెలియదో.. నాకు తెలియదు). ఆయన కూడా ఎస్ఐలను కాపాడాలని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏ చర్య తీసుకున్నారు?: పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల శాఖ. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి? ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. వారిని సర్వీస్ నుంచి తొలగించాలి. జైల్లో పెట్టాలి. ఒక మెసేజ్ పంపించాలి. అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వు ఏం చేస్తా ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్నావు. ఆ ఎస్సైలను కాపాడే దాని కోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సమాచారం, వివరణలు. అన్నీ బిల్డ్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నిజంగా ప్రజలకు ఏమనిపిస్తుంది? అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు అని చెప్పి ప్రజలకు అభిప్రాయం కలిగిస్తున్నారు. ఎస్పీ, డీఎస్పీ చెప్పింది ఒకవేళ నిజమే అయితే?: జేమ్స్ బాండ్ మాదిరి 007 మాదిరి నిజంగానే ఎస్సైలు ఆ మాదిరిగా ఈ ఎస్పీ చెప్తున్నట్టుగా, ఈ డీఎస్పీ చెప్తున్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసి ఉంటే వాళ్లకు నువ్వు ఏం చేస్తావు? శభాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సీఎం మెడలు ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వు ఏం చేశావు?. ఏం చర్య తీసుకున్నారని చూస్తే.. నలుగురు పోలీసు అధికారులపై చర్యలు. వీఆర్కు సంతమాగులూరు ఎస్సై. అదేగా?. అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావ్, నువ్వే మరోవైపున ఏమంటావు, వీఆర్ అంటున్నావ్. అంటే మీ ఎస్పీ, డీఎస్పీ అందరూ కలిసి డిఫెండ్ చేస్తున్నారు. ఎస్ఐలను కాపాడడానికి ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తున్నారు. దారుణంగా దిగజారిన వ్యవస్థ: నిజంగా వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయింది అని చెప్పడానికి ఉదాహరణలు. విజయవాడ, కృష్ణలంకలో సీఐ వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో ద్వారా మరణవాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతికుమార్. వాళ్ళ కుటుంబం చేసిన ఆరోపణ ఏమిటి?. తమ కొడుకు చేత చేయకూడని పనులు చేయించే కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని. అదే విజయవాడ నడిబొడ్డున మరో పిల్లోడు సాయికృష్ణ పోలీస్ కస్టడీలో లాకప్డెత్. చివరకు బూడిద కూడా దొరకని దుస్థితి. అద్దంకి గంజాయి కేసులో ఏం వినిపిస్తోంది?: అద్దంకిలో పోలీస్ కారులో పట్టుబడిన గంజాయి, లిక్కర్ బాటిళ్లకు సంబంధించి, తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే.. గ్రానైట్ మాఫియా నుంచి పోలీసులు కలెక్షన్ చేసి ఎమ్మెల్యేకి ఇంత, చిన్నబాబుకి ఇంత, పెద్దబాబుకి ఇంత అని వాటాలు వేసి మరి పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ అక్కడ మత్తులోకి జారిపోయారట. ఆ మత్తులోనే కారులో వస్తూ యాక్సిడెంట్ చేశారు. అంతా కుమ్మక్కయ్యారు. సిండికేట్లకు రాష్ట్రాన్ని పంచారు: సాధారణంగా ఎక్కడైనా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పరిధిలో రేంజ్లు ఏర్పాటు చేస్తారు. ఐజీలకు ఆ రేంజెస్ ఇస్తారు. రాయలసీమ రేంజ్ అని, కోస్తా రేంజ్ అని ఇస్తారు. అలా డివిజన్ చేస్తారు పోలీసుల పని సౌలభ్యం కోసం. కానీ, రాష్ట్రంలో తొలిసారి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. రేంజెస్గా విభజించి సిండికేట్లకు రాష్ట్రాన్ని పంచారు. వీళ్లే కలెక్షన్లలో పాత్రధారులుగా ఉండడం. ఎమ్మెల్యేలతో సహాయ సహకారాలు తీసుకుంటూ.. ఎమ్మెల్యేలు వీళ్ళు అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యేకి ఇంత, వీళ్ళకింత, చిన్నబాబుకి ఇంత, పెద్దబాబుకి ఇంత అని ఆర్గనైజ్డ్గా చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఏమిటని చూస్తే, గంజాయి, డ్రగ్స్ అన్నవి సరఫరా దాటిపోయాయి. ఒక పెద్ద మాఫియాగా మారాయి. ఈ క్రమంలో నేరస్తులు, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు, అందరూ కుమ్మక్కై, మాఫియాలా మారి దందా నడుపుతున్నారు. అందుకే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి: విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహెల్ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తే, పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు!. తీరా చూస్తే తప్పించుకున్నాడనేది కాదు, తప్పించబడ్డాడు అన్నది. జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటివరకు ఆ సోహెల్ ను పట్టుకోలేకపోయినారు. ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టినోడు కనపడకుండా పోతున్నాడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్వయంగా స్థానిక టిడిపి నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టిడిపి నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో అధికార పార్టీకి చెందిన అనుచరులు తమిళనాడుకు 220 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. కుప్పంకు చెందిన టిడిపి నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయాలు చేస్తూ పట్టుబడ్డారు. ఇది సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్ మయం, నకిలీ లిక్కర్ మయం. కాదా అని నేను చంద్రబాబుగారిని అడుగుతున్నాను. మా హయాంలో ఉక్కుపాదం మోపాం: అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేశాం. నాలుగున్నర కోట్ల గంజాయి మొక్కలను తొలగించాం. 13,210 మందిని అరెస్ట్ చేశాం. 2,950 వాహనాలు జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని గంజాయి రవాణా జరిగే రూట్లన్నిటిని బ్లాక్ చేశాం. ఆపరేషన్ పరివర్తన్: ఏజెంట్ల మాయలో పడి, వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేసుకుంటూ.. జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో, గంజాయి సాగును వాళ్ళతో మానిపించి, వాళ్లకు ప్రత్యామ్నాయ పంటల సాగు చూపాం. అందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఒక ఆపరేషన్గా చేపట్టి, దానికి ‘ఆపరేషన్ పరివర్తన్’ అనే పేరు పెట్టాం. ఇంకా ఆపరేషన్ నవోదయం కార్యక్రమం కూడా అమలు చేశాం. రూ.144 కోట్లు ఖర్చు చేసి, గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. 3 లక్షలకు పైగా ఎకరాల పోడు భూమిని గిరిజనులకు పంచిపెట్టాం. ఇప్పుడంతా రివర్స్. ఒక్క గంజాయికే గిట్టుబాటు ధర: కానీ, ఈరోజు పరిస్థితి మొత్తం రివర్స్. పోలీసుల చేతనే, వారినే వ్యాపారంలో భాగస్వాములను చేసి, మాఫియా సామ్రాజ్యం ఏర్పడింది. అధికార పక్ష నాయకులు, పోలీసులు.. అందరూ కలిసికట్టుగా, ఒకటై మాఫియా సామ్రాజ్యంలా మారారు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఒక్క గంజాయికి తప్ప. చివరగా, మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా వైయస్సార్సీపీ పోటీ చేయలేని పరిస్థితి వచ్చి, ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. స్థానిక ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు అనుమానమే. కానీ, ప్రజాస్వామ్యంలో పోరాడక తప్పదు. స్థానిక ఎన్నికల్లో గెలుపు, ఓటములు పెద్దగా ప్రభావం చూపవు. అదే సాధారణ ఎన్నికల విషయానికి వస్తే.. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు, పోలీసులను ఉపయోగించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకుండా ఒకసారి చేయొచ్చు. కానీ ఎప్పుడూ అది సాధ్యం కాదు. మీకు గుర్తుండే ఉంటుంది. నా పాదయాత్రకు ముందు జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని వాడి, టీడీపీ గెల్చింది. కానీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మేము 40 వేల ఓట్లతో గెల్చాం. వర్షపాతం లోటు, ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిసినా, చంద్రబాబు ఏ మాత్రం జాగ్రత్త పడలేదు. దీంతో రైతులు చాలా నష్టపోతున్నారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు తన పాత్ర ఏమిటనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయనది క్రెడిట్ చోరీ. క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్. మరి చంద్రబాబుగారి పాలన ఈ విధంగా ఉంటే, ఎవరుఓట్లు వేస్తారు? అని శ్రీ వైయస్ జగన్ ముగించారు.