‘తండ్రి’కి వందనం

పథకం జాబితాలో తల్లికి దక్కని స్థానం 

నంద్యాల జిల్లా పాములపాడులో పదుల సంఖ్యలో తండ్రుల పేర్లు

 

 

పాములపాడు: ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం అర్హుల జాబితాలో తండ్రుల పేర్లు దర్శనమిస్తున్నాయి. ఈ జాబితా చూసిన వారు అవాక్కవు తున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు గ్రామానికి సంబంధించి ఇటీవల వెల్లడించిన జాబితాలో ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. మొత్తం 724 మంది పేర్లతో జాబితా ప్రదర్శించగా, ఇందులో 20 మంది లబ్దిదారులు తండ్రి పేర్లతో దర్శనమిచ్చాయి. మరో విచిత్రమేమిటంటే జాబితాలో వరుస నెం 93, 96 లో కేవలం ’ న’ అనే అక్షరం పేరుతో లబ్ధి­దారుని పేరుగా చేర్చారు.  

ఆధార్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల్లో తేడాలు  
లబ్దిదారులకు సంబంధించిన జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతాల నంబర్లలో వ్యత్యాసాలు చోటు­చే­సుకున్నాయి. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తమ  ఖాతాల్లో పథకం నగదు జమకాలేదని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయా­ంలో ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా తొలిరోజే అమ్మఒడి నగదు పడిందని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

పేరు మారింది.. డబ్బులు రాలేదు 
తల్లికి వందనం జాబితాలో నా పేరు  లేదు. నా భర్త నాగలోకేశ్‌ పేరు వచ్చింది. ఆధార్‌ నంబరు కూడా ఆయనదే ఉంది. పథకం నగదు ఎవరి బ్యాంకు ఖాతాలో పడతాయో తెలీదు. స్కూల్లో మాత్రం నా వివరాలనే ఇచ్చాను. ఇప్పుడేమో జాబితాలో ఇలా. ఏం చేయాలో పాలుపోవడం లేదు.    – బాలీశ్వరమ్మ, పాములపాడు, నంద్యాల జిల్లా

అర్థం కాలేదు 
తల్లికి వందనం అర్హుల జాబితాలో నా భార్య పి. వరలక్ష్మి పేరు లేదు. ఎందుకు రాలేదో అర్థం కాలేదు. అనర్హుల జాబితాలోనూ లేదు. తీరా చూస్తే పిచ్చిగుంట్ల శివక్రిష్ణ  అని నాపేరు వచ్చిoది. ఆధార్‌ నంబరు నాదే ఉంది. తల్లికి వందనం నగదు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎవరి అకౌంట్లోనూ జమ కాలేదు. – పిచ్చిగుంట్ల శివక్రిష్ణ, పాములపాడు 

 

ఆ తల్లికి 21 మంది పిల్లలంట!!! 

Strange thing is coming to light every day in talliki vandanam scheme

జాబితాలోని ఒక పేజీలో ముగ్గురు పిల్లలకు తల్లిగా భావన పేరు పొందుపరిచిన దృశ్యం

తల్లికి వందనం జాబితాలో విచిత్రం 

లబ్ధిదారుల జాబితాలో 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా ప్రస్తావన

పుట్టపర్తి : ఆమె వయసు 35 ఏళ్లలోపే. కానీ 21 మంది పిల్లలు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. నిజమనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది తల్లికి వందనం జాబితాలో చోటుచేసుకున్న వైచిత్రి. ఇంతకీ ఏం జరిగిందంటే... తల్లికి వందనం పథకంలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. వివరాల నమోదులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా సూచిస్తూ జాబితాలో ప్రదర్శించిన వైనం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి సచివాలయం–1 పరిధిలో చోటుచేసుకుంది. 

పెడపల్లి సచివాలయం–1లో తల్లికి వందనం పథకం కింద అర్హుల జాబితాను ఈ నెల 13న ప్రదర్శించారు. 458 మంది పిల్లలకు రూ.13వేలు చొప్పున జమ చేస్తున్నట్టుగా 15 పేజీలతో కూడిన జాబితా ప్రదర్శించారు. ఇందు­లో భావన అనే మహిళ పేరు, ఆధార్‌ నంబరును 21 మంది విద్యార్థులకు తల్లిగా సూచించారు. దీంతో జాబితాను చూసినవారంతా అవాక్కవుతున్నారు. 

వాస్తవానికి ఆమెకు తొమ్మిది, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 19 మంది పిల్లలు ఇతరులకు చెందినవారు. వారికి ఈమెను తల్లిని చేసేశారు. ఇది ఎలా జరిగిందో.. ఎవరి నిర్లక్ష్యం వల్ల తప్పుగా నమోదు చేశారో తెలియదు కానీ.. జాబితా చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.  

35 ఏళ్ల ఆమెకు 21 మంది పిల్లలా?  
భావనకు ప్రస్తుత వయసు 35 ఏళ్లలోపే. కాగా ఆమెకు పిల్లలు 21 మంది ఎలా ఉంటారు? కనీస అవగాహన లేదా? అని అధికార యంత్రాంగంపై స్థానికులు మండిపడుతున్నారు. రెండో శనివారం, ఆదివారం కావడంతో సచివాలయం, పాఠశాలల తలుపులు తెరవలేదు. ఎవరిని అడగాలో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. 

Back to Top