వైయ‌స్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా అత్యవసర వైద్య పరికరం వితరణ

అనంతపురం: దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రికి పీర్‌బయో ఆప్టిమా పోర్టబుల్‌ సక్షన్‌ మెషిన్‌ను అందజేశారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగుల శ్వాస మార్గాల్లో పేరుకుపోయిన ద్రవాలను తొలగించి, సులభంగా శ్వాస తీసుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే వైద్య పరికరాన్ని వితరణ చేయడం అభినందనీయమని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

వైయ‌స్‌ఆర్‌ పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి విశేష కృషి చేశారని, ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, తాగు, సాగునీటి కార్యక్రమాలతో ప్రజలకు భరోసా కల్పించారని రమేష్‌ గౌడ్‌ గుర్తుచేశారు. వైయ‌స్‌ఆర్‌ ఆశయాల స్ఫూర్తితో ప్రజా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వర్థ నాయక్‌, మాజీ రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న, వెన్నపూస రవీంద్రరెడ్డి, చింత సోమశేఖరరెడ్డి, రిజ్వాన్‌, వాసంతి సాహిత్య, ఎద్దుల అమర్‌నాథ్‌రెడ్డి, సైఫుల్లా బేగ్‌, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Back to Top