రేపు సీఎం వైయ‌స్ జగన్ విశాఖ జిల్లా పర్యటన

తాడేప‌ల్లి:   ముఖ్య‌మంత్రి  వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలో శుక్ర‌వారం పర్యటించనున్నారు. ఈ నెల 15న విశాఖ‌లో వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందించే కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొననున్నారు. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ బయలుదేరతారు సీఎం వైయ‌స్ జగన్. 10.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుని వైయ‌స్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం వుంటుంది.

అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తాడేపల్లికి బయలు దేరతారు. మరోవైపు రేపు మధ్యాహ్నం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఏరియల్‌ సర్వే జరుపుతారు. ఏరియల్ సర్వే కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. 
ఆమేరకు పోలవరం వద్దా, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్.

Back to Top