పరిషత్‌ ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు

అబద్ధాన్ని నిజం చేయాలని రకరకాల కుయుక్తులు

ఓటమి కూడా అంగీకరించలేని పరిస్థితిలో ఎల్లోమీడియా

రాష్ట్ర ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ వీడియో సందేశం

తాడేపల్లి: పరిషత్‌ ఎన్నికల్లో విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ వీడియో సందేశాన్ని సీఎం అందించారు.  

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతున్నాను. పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు; శుభాకాంక్షలు తెలుపుతూ
ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు; ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. నిండు మనసుతో హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈరోజు ఇచ్చిన ఈ విజయం, అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా బాధ్యతను మరింతగా పెంచాయి. ఈరోజు ఎన్నికల తేదీ నుంచి కూడా ఒక్కసారి గమనించినట్లైతే, 2019 ఎన్నికల్లో అక్షరాలా 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 స్థానాలు, అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అక్షరాలా 50 శాతం పైచిలుకు ఓట్లతో, 86 «శాతం అసెంబ్లీ సీట్లతో, 87 శాతం పార్లమెంటు సీట్లతో.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రయాణం మొదలైంది.

తర్వాత మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి, అక్షరాలా 13,081 పంచాయతీలకు గానూ 10,536 పంచాయతీలు.. అంటే అక్షరాలా 81 శాతం పంచాయతీలలో పార్టీ మద్దతుదారులను దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది.
దాని తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఏకంగా 75కు 74 చోట్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగాం. అక్షరాలా 99 శాతం. 12 చోట్ల మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 12కు 12.. 100 శాతంతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. 

ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా 9,583 ఎంపీటీసీలకు గానూ 8,249 ఎంపీటీసీలు.. అంటే అక్షరాలా 86 శాతం ఎంపీటీసీలు. అదే మాదిరిగా 638 జడ్పీటీసీలకు గానూ 628 జడ్పీటీసీలు అంటే అక్షరాలా 98 శాతం జడ్పీటీసీలు కూడా దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు తెలిపి గెలిపించడం జరిగింది.

ప్రతి ఎన్నికలోనూ ఎక్కడా కూడా సడలని ఆప్యాయత, ఎక్కడా కూడా ప్రేమానురాగాలు తగ్గించకుండా ప్రజలంతా ప్రభుత్వానికి తోడుగా  నిలబడ్డారు.

దేవుడి దయ వల్ల ఈ రెండున్నర ఏళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతానికి పైగా చేయగలిగాము. ప్రజలందరి మన్ననలు కూడా పొందగలిగాము. దీనంతటికీ ప్రజలందరికీ సదా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాను.

కానీ ఇక్కడ కొన్ని విషయాలను ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నాను. ఈరోజు నిజంగా కూడా ఏ స్థాయిలో అవరోధాలు, ఇబ్బందులు ప్రభుత్వానికి కల్పించాలని చెప్పి రకరకాల శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఒకవైపు కోవిడ్‌తో డీల్‌ చేస్తున్నాం. మరోవైపున రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల అబద్ధాల మధ్య ఒకవైపు ప్రతిపక్షం. మరోవైపు ఇలా ఈనాడు దినపత్రిక. ఆంధ్రజ్యోతి. టీవీ5. ఇటువంటి అన్యాయమైన మీడియా సంస్థలు. అబద్ధాలను నిజం చేయాలని చెప్పి రకరకాల కుయుక్తులు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా.. కేవలం వాళ్లకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి కచ్చితంగా ముఖ్యమంత్రిని దింపేయాలని చెప్పి.. ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా అనే దుర్మార్గపు బుద్ధితో.. వాళ్ల మనిషిని ఆ సీట్లో ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా ఎక్కించాలని చెప్పి ఏకంగా చంద్రబాబునాయుడుగారిని భుజాన వేసుకుని నడుస్తున్న పత్రికలు. 

ఈరోజు కూడా ఆశ్చర్యకరమైన వార్త చూశాను. ఓడిపోయిన తర్వాత కనీసం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్‌ ఉంది. 
‘పరిషత్‌ ఏకపక్షమే. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయాస గెలుపు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం’.. 
నిజంగా ఇది పేపరా? పేపర్‌కు పట్టిన పీడనా ఇదేమన్నా? ఇంత అన్యాయమైన పేపర్లు బహుషా ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండవేమో!.

ఈ ఎన్నికల్లోనే కాదు. ఇంతకు ముందు నేను చెప్పా. 2019 ఎన్నికల్లో ఏ రకంగా 86 శాతం సీట్లతో మొదలైతే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే 88 శాతంతో మొదలైతే.. ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికల్లో 80 శాతం పైచిలుకు పదవులతో ప్రయాణం అయితే.. ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికల్లో 99 శాతం, 100 «శాతం కార్పొరేషన్లు గెలవడం అయితే.. దాని తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 86 శాతం, 98 శాతంతో ఏ రకంగా గెలుపు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో ఇదంతా జరుగుతుంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ రకమైన రాతలు.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇవి సాక్షాత్తూ పార్టీ గుర్తుతో జరిగిన ఎన్నికలు. పార్టీ రహిత ఎన్నికలు కావు. పార్టీ గుర్తుతో జరిగిన ఎన్నికలు. ఇక్కడ ఏకంగా ప్రతి పార్టీ వాళ్ల వాళ్ల ఎ–ఫామ్స్, బి–ఫామ్స్‌ ఇచ్చాయి. ఆ ఎ–ఫామ్స్, బి–ఫామ్స్‌ ఆధారంగా అభ్యర్థులకు పార్టీ గుర్తు కూడా కేటాయిస్తారు. ఆ గుర్తు ఇచ్చిన తర్వాత ఆ గుర్తు మీద ఎన్నికలు జరిగాయి. అటువంటి ఎన్నికల్లో ఇంత బాగా ప్రజలంతా ఆశీర్వదించి ప్రభుత్వాన్ని దీవిస్తే దేవుడి దయ వల్ల.. దాన్ని కూడా జీర్ణించుకోలేక  ఏ రకంగా వక్రబాష్యాన్ని పాడుతున్నారనడానికి ఇదే నిదర్శనం.

కేవలం ఓటమిని కూడా అంగీకరించలేరు. దాంట్లో కూడా వక్రబాష్యం చెబుతూ, వాస్తవాన్ని ఎక్కడా కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు.
ఇటువంటి అన్యాయమైన మీడియా సామ్రాజ్యం మధ్యన, ఇటువంటి అన్యాయమైన ప్రతిపక్షం మధ్యన. ప్రజలకు మంచి చేయడానికి అడుగులు వేస్తే ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలని ఆరాటపడే పరిస్థితులు చివరకు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూస్తున్నారు.

ప్రజలకు ఏ కాస్త మంచి జరిగే ఉన్న పరిస్థితి ఉంటే, వెంటనే తప్పుడు వార్తలు, వెంటనే కోర్టులో కేసులు వేయడం.. ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలని చెప్పి ఆరాటంతో కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలను కూడా చూస్తున్నాం.

ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడిదయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రభుత్వం చల్లగా నడుస్తా ఉందని చెప్పి సవినయంగా ప్రజలందరికీ వినయపూర్వకంగా వారు చూపుతున్న ఆదరణ, ఆప్యాయతకు కృతజ్ఞుడినై ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

ఇదే ఎన్నికల ప్రక్రియ ఒకటిన్నర సంవత్సరం క్రితం మొదలైంది. రకరకాల పద్ధతుల్లో ఎన్నికలే జరగకుండా చూడాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎన్నికలు వాయిదా వేయించారు. కోర్టులకు వెళ్లి స్టేలు కూడా తీసుకొచ్చారు. చివరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్‌ కూడా ఆరు నెలల పాటు వాయిదా వేయించారు. ఇదే సంవత్సరంన్నర క్రితం ఎన్నికలు పూరై్త, ఇదే ప్రజా ప్రతినిధుల కనుక అందుబాటులో ఉండి ఉంటే కోవిడ్‌ సమయంలో మనందరికీ, ప్రజలందరికీ ప్రజా ప్రతినిధులు ఎంతగానో ఉపయోగపడి ఉండి ఉండేదన్న ఇంగిత జ్ఞానం కూడా ప్రతిపక్షానికి లేకుండా పోయిన పరిస్థితులు చూశాం.

ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంత మంచి ఫలితాలు వచ్చినందుకు మనసారా ప్రజలందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. ఇవాళ కష్టపడే దానికన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టపడతామని, ఇంకా ఎక్కువ మంచి చేసే ప్రయత్నం ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ.. మరొక్కసారి ఈ ప్రేమ ఆప్యాయతలకు రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

తాజా వీడియోలు

Back to Top