తాడేపల్లి: డీఎస్సీ–2025 బాధితులకు అండగా ఉంటామని, వారి కోసం పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ డీఎస్సీలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కుట్ర చేసిందని, అందుకే చంద్రబాబు, నారా లోకేష్ తమ ప్రశ్నలకు సమాథానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇంకా చేసిన తప్పును అధికారుల సాయంతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కాగా, జగన్గారు మాట ఇస్తే తప్పనిసరిగా నిలబెట్టుకుంటారన్న పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి.. డీఎస్సీ అభ్యర్థులకు ఇప్పుడు న్యాయం జరగకపోతే, రేపు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే, అర్హులకు కచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్థులకు అండగా ఉంటామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, తమకు తోడుగా నిలవాలంటూ ఆదివారం పెద్ద సంఖ్యలో డీఎస్సీ అభ్యర్థులు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు. తమ గోడు వెళ్లబోసుకున్న వారు, తమకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. డీఎస్సీ–2025లో అన్యాయానికి గురైన వారితో వైయస్ఆర్సీపీ లీగల్సెల్ ప్రతినిధులు మాట్లాడారు. వారి తరపున న్యాయ పోరాటం చేసేందుకు అవసరమైన వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీస్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు కూడా డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనై ధైర్యం కోల్పోవద్దని, వారికి న్యాయం జరిగేలా తమ వంతుగా పోరాడతామని చెప్పారు. అదే సమయంలో ప్రస్తుతం ఎంపికైన డీఎస్సీ అభ్యర్ధులకు తాము వ్యతిరేకం కాదనే విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. డీఎస్సీ–2025లో స్పోర్ట్స్ కోటా భర్తీలో జరిగిన అక్రమాలపైనే పోరాడుతున్నామని తెలిపారు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే..: డీఎస్సీ ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కుట్ర : శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి. వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్. – డీఎస్సీని విజయవంతంగా రాసిన తర్వాత కూడా కూటమి సర్కార్ చర్యల వల్ల ఇబ్బందిపడుతున్న అభ్యర్ధులు ఇక్కడికి వచ్చారని భావిస్తున్నాం. మామూలుగా అయితే మీరంతా ఇప్పటికే పోస్టింగ్ ఆర్డర్లు తీసుకుని ఉండాలి. ఈ ప్రభుత్వం తెలిసి, కావాలని, కుట్రపూరితంగా చేసిన కుంభకోణానికి మీరంతా బలయ్యారని భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో మీరంతా మాట్లాడినప్పుడు మీరంతా బాధలు వెళ్లబోసుకున్నారు. ఏ పరీక్షలు జరిగినా, వ్యవస్ధలో ఉన్న లోపాల వల్ల కానీ, అధికారుల అలక్ష్యం వల్ల కానీ, లేదా కావాలని అవినీతికి పాల్పడటం వల్లో లీకులు జరుగుతుంటాయి. కానీ ఈసారి డీఎస్సీలో ప్రతీదీ ఓ కుట్రతో ముందే ప్లాన్ చేసుకుని చేసినట్లే అనిపిస్తోంది. ఔట్ సోర్సింగ్ గా ఉన్న ఓ వ్యక్తి ప్రశ్నాపత్రాల్ని పరీక్ష కేంద్రాల్ని పంపడంలో భాగంగా ఉంటూ పరీక్ష రాసి టాపర్ గా వచ్చాడు. దీన్ని ప్రభుత్వమే అంగీకరించి అతన్ని తప్పించింది. ఆ తర్వాత అతను కోర్టుకు వెళ్లడం వల్ల బయట అందరికీ తెలిసింది. ఓ వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చింది, అతన్ని లిస్ట్ లో నుంచి తీసేశారనేది సామాన్యులకు కూడా అర్ధమైంది. దీంతో బాధితులు అధికారుల్ని కలిశారు, కోర్టుకు, మానవ హక్కుల కమిషన్ కు వెళ్లారు. ఒకవేళ ఇందులో ఏ తప్పూ జరగకపోతే మేం పారదర్శకంగా దర్యాప్తు చేయించి బాధ్యుల్ని చట్టం ముందు నిలబెడతాం అంటూ చెప్పాల్సిన విద్యా మంత్రి దీన్ని సమర్ధించుకుంటున్నారు. అంతా బాగా జరిగిందని చెప్తూ, అధికారులతో చెప్పిస్తూ అనుమానాలకు తావిస్తున్నారు. బాధితులకు వైయస్ఆర్సీపీ పూర్తి స్ధాయిలో అండగా నిలుస్తుంది: ఆ రోజు పరీక్ష రాసి, పాసైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు తప్ప బయటి వ్యక్తుల్ని ఏమీ వెరిపై చేయలేదనే అంశం కావాలనే కప్పి పుచ్చుతున్నారు. కానీ ఎగ్జామ్ తో సంబంధం లేకుండా రిక్రూట్ మెంట్ చేయలేదనే అంశాన్ని కప్పి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఈ వ్యవహారంపై బయటికి వచ్చి సమాధానం ఎందుకు చెప్పడం లేదు, కేవలం కార్యదర్శులతో మాత్రమే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు? వాళ్లు తిప్పి తిప్పి అవే కారణాలు చెప్తున్నారు. ఈ బుకాయింపు, కప్పి పెట్టాలనే ప్రయత్నాల్ని బయటికి తీయాలని వైఎస్సార్సీపీ ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇది కచ్చితంగా సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిన కేసు. నువ్వే దొంగ, నువ్వే పోలీసు, నువ్వే జడ్జి అంటే మేం ఒప్పుకోం. దేశంలో ఇంత అన్యాయమైన కుంభకోణం ఎక్కడా జరిగి ఉండదు. బ్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల స్కాంలు జరుగుతాయి, కానీ యువతే భవిష్యత్తు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం, తిరిగి వాళ్ల జీవితాలతో ఆడుకోవడం సరికాదు. ఈ విషయంలో మీకు పూర్తి మద్దతు అందిస్తాం. జి.అంజనప్ప, ఉమ్మడి అనంతపురం జిల్లా, డీఎస్సీ బాధితుడు: – మెగా డీఎస్సీలో మోసపోయిన మాకు తోడుగా ఉంటూ, మద్దతు నిస్తూ, జరిగిన మోసాన్ని బయటపెడుతున్న అందరికీ నా నమస్కారాలు. నేను ముందు పీహెచ్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. ముందుగా మెడికల్ చెకప్ చేసి 30 శాతం వైకల్యం ఉందని చెప్పారు. నాకు 40 శాతం వైకల్యం ఉందని కలెక్టర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రశ్నించాను. సెప్టెంబర్ 4న అనంతపురం జీజీహెచ్ నుంచి కలెక్టర్, డీఈవోకు నా ఫిర్యాదు పంపారు. కానీ డీఈవో ఆర్జేడీకి దీన్ని పంపలేదు. ఆర్జేడీ గారు మీకు 30 శాతం వైకల్యంగానే గుర్తించాలని డీఈవో చెప్తున్నారు. ఆయన్ని అడిగితే ఆర్జేడీ .. డీఈవో సకాలంలో తనకు పంపడం వల్ల ఉద్యోగం కోల్పోయావని చెప్తున్నారు. అలా ఇద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. కన్వీనర్ కష్ణారెడ్డిని అఢిగితే అధికారులు సరైన సమయంలో పంపలేదు కాబట్టి ఉద్యోగం కోల్పోయావని చెప్తున్నారు. ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డే దీనికి సాక్ష్యం. అప్పీలు చేసుకున్నా 40 శాతం వైకల్యం ఉందన్న విషయం బయటపెట్టకుండా కోర్టునే మభ్యపెడుతున్నారు. నన్ను విజయవాడ జీజీహెచ్ కు పంపిస్తే అక్కడ పరీక్షల తర్వాత 40 శాతం వైకల్యం అని ఇచ్చిన పాత సర్ఠిఫికెట్లు ఫేక్ అంటున్నారు. డీఎస్సీ బాధితురాలు , అనంతపురం జిల్లా – అంజనప్పకు 40 శాతం పీహెచ్ కోటా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల హారిజాంటల్ రిజర్వేషన్ లో భాగంగా బీసీ–ఏ కోటాలో ఉన్న నేను ఉద్యోగం కోల్పోయారు. అధికారులు అతన్ని ఎక్కడా 40 శాతం వైకల్యం పరిగణనలోకి తీసుకోవడం లేదు. కురబ శ్రీనివాస్ అనే మరో వ్యక్తిని పరిగణనలోకి తీసుకుని, అంజనప్పను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల నేనూ ఉద్యోగం కోల్పోయాను. డీఈవో, ఆర్జేడీ ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. 15వ తేదీ సెలెక్షన్ లిస్ట్ వచ్చాక 16వ తేదీ డీఈవో వద్దకు వెళ్తే ఆర్జేడీ, కలెక్టర్లకు నా ఫిర్యాదు పంపారు. అంజనప్పకు ఉద్యోగం వస్తే నాకూ వస్తుంది. జరిగిన తప్పిదాన్ని కప్పిబెట్టాలని చూస్తున్నారు. అడిగితే అంజనప్ప సెలెక్షన్ లిస్ట్ వచ్చిన రోజు సర్టిఫికెట్లు తీసుకుని వెరిఫికేషన్ కు వెళ్లారని చెప్తున్నారు. రెండో విచారణ కమిటీలో అయినా న్యాయం జరుగుతుందని కన్వీనర్ కష్ణారెడ్డిని కలిశాం. అయినా అంజనప్పకు 40 శాతం వైకల్యం ఉందని కోర్టుకు కూడా చెప్పకుండా దాచిపెట్టి 30శాతం వైకల్యాన్నే చూపిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్ కు వెళ్తే అక్కడ సామాగ్రి లేదని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. అనంతపురం, బళ్లారి ఆస్పత్రుల్లోనూ పరీక్షలు చేయిస్తే 40 శాతం వైకల్యం ఉందని తేల్చారు. ఇతనికి తీవ్రమైన కంటి సమస్య ఉందని నిర్ధారించారు. ఇతన్ని తప్పించాలనే 30 శాతం వైకల్యం చూపిస్తున్నారు. దీనికి అన్ని సాక్ష్యాధారాలున్నాయి. ఎం.వెంకటలక్ష్మి, విశాఖ జిల్లా డీఎస్సీ బాధితురాలు – నేను డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాశాను. అందరి లాగే నాకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ వచ్చింది. సర్ఠిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత నా పేరు సెలెక్షన్ జాబితాలో లేదు. కారణం ఏంటని చూస్తే నాతో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వచ్చిన విశాలాక్షి అనే అభ్యర్ధికి జోన్ 3లోకి వచ్చే గుంటూరులో టీజీటీ సర్ఠిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. అక్కడ వెరిఫికేషన్ జరిగిన ఆమెకు గుంటూరులో ఇవ్వాల్సి ఉండగా.. ఆమెకు విశాఖ జిల్లాలో కూడా రాస్తే 8వ ర్యాంక్ కు వచ్చిందనే కారణంతో ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు. అధికారుల తప్పిదం వల్ల నేను ఉద్యోగం కోల్పోయాను. స్దానికురాలు కాని విశాలాక్షి అనే ఆమె 2018 డీఎస్సీలోనూ విశాఖ నుంచి దరఖాస్తు చేసినా పరీక్ష రాయలేదు. గుంటూరులో ఆమెకు జరిగింది నాన్ లోకల్ వెరిఫికేషన్ మాత్రమే. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఆ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.రవిచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.