మంచి టీచర్‌ వ్యవస్థను మార్చగలరు

విద్యార్థులను అద్భుతమైన శిల్పాలుగా మార్చే గురువులకు వందనం

టీచర్స్‌ డే వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గురువులను ఎత్తైన‌ శిఖరంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ

నాకు జన్మనిచ్చిన నా తండ్రికి, విద్యా నేర్పిన గురువులకు రుణపడి ఉంటా 

విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మల్చడంలో గురువు పాత్ర కీలకం

విద్యా వ్యవస్థలో మన ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది

పెద్ద చదువులకు పేదరికం అడ్డకాకూడదనే లక్ష్యంతో అనేక మార్పులకు శ్రీకారం

ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువగా సమీక్షలు చేశా

ఈ మూడేళ్లలోనే విద్యారంగంపైనే రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం

గత ప్రభుత్వం విద్యను కార్పొరేట్‌ సెక్టార్‌కు అమ్మేసింది..

మన ప్రభుత్వం విద్యను అట్టడుగు వర్గాలకు దగ్గర చేసింది

అడక్కపోయినా ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 60 నుంచి 62కు ఏళ్లకు పెంచాం

ఉద్యోగులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షం, ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది

ఉద్యోగుల పెన్షన్‌ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్నాం

విజయవాడ: ‘‘సానపట్టకముందు వజ్రం కూడా రాయి మాదిరిగానే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే ఆ రాయి అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. మంచి టీచర్‌ స్కూల్, ఒక వ్యవస్థను మార్చగలుగుతాడు. అలాంటి మన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక వందనాలు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువులకు వందనం, నాకు చదువు నేర్పిన గురువులకు, అనేక తరాలకు చదువులు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు చేస్తున్నా. ఉపాధ్యాయులందరికీ కూడా ఒక శిఖరం లాంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ. మాజీ రాష్ట్రపతి, మన తెలుగువారు ఈ స్థాయికి తాను ఎదగడమే కాకుండా ఏకంగా టీచర్లందరినీ ఎత్తైన‌ శిఖరంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తికి వందనమన్నారు సీఎం వైయస్‌ జగన్‌. 

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్‌ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ఉపాధ్యాయుల కీలక పాత్ర గురించి వివరించారు. 

ఈ సందర్భంగా సీఎం ఏం మాట్లాడారంటే..
మన రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్‌ రంగంలోనూ, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోనూ పనిచేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ మెరుగైన జీవితాన్ని పొందడం ఎలాగో నేర్పినందుకు నాకు గురువుకు రుణపడి ఉంటాను. ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు. ఈ మాటలు నేను చెప్పడమే కాదు.. ప్రపంచ ఖ్యాతి గాంచిన అల్జెండర్‌ ది గ్రేట్‌ కూడా చెప్పారు. 

సానపట్టక ముందు వజ్రం అయినా రాయి మాదిరిగానే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే ఆ రాయి కూడా ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. మంచి టీచర్‌ స్కూల్‌ను మార్చగలుగుతాడు. ఒక వ్యవస్థను మార్చగలుగుతాడు. ఒక గ్రామంతో మొదలుపెడితే.. ఒక విప్లవాత్మక మార్పును తీసుకురాగలుగుతాడు. ఒక మంచి టీచర్‌ తాను కన్న పిల్లల భవిష్యత్‌ కోసం ఎంతగా తపిస్తాడో.. తన తరగతిలో ఉన్న ప్రతీ పిల్లాడూ అదే మాదిరిగా బాగుపడాలని ఆరాటపడతాడు. ఒక మంచి టీచర్‌ తన విద్యార్థులకు కేవలం సబ్జెక్ట్‌ మాత్రమే చెప్పడు.. వ్యక్తిత్వాన్ని కూడా మలుస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచడంలో ఉపాధ్యాయుడు చాలా కీలక పాత్ర పోషిస్తాడు. వారిలో దాగిన ప్రతిభను బయటకు తీయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడు. క్రమశిక్షణతో జీవించడం, బ్రతకడం ఎలాగో నేర్పే స్కిల్స్‌ టీచర్‌దగ్గర నుంచే వస్తాయి. పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తాడు.. తన దగ్గర చదువుకున్న పిల్లలంతా తనకంటే ఇంకా గొప్పవారు కావాలని ఆరాటపడతాడు. అది సాధించినప్పుడు సంతోషిస్తాడు. 

ప్రపంచంలో పిల్లలు ఎలా బతకగలుగుతున్నారు అనేది మాత్రమే కాకుండా నిరంతరం కూడా వేగంగా మారుతున్న ప్రపంచంలో పిల్లలు పెద్దవారు అయిన తరువాత కూడా ఎలా బతకగలుగుతారనేది కూడా ఆలోచిస్తాడు. అందుకే ఏ దేశమైన, ఏ జాతి అయినా, ఏ మంచి ప్రభుత్వం అయినా, ఏ సమాజం అయినా.. చదువుకు ఉన్న అనేక ప్రయోజనాల దృష్ట్యా విద్యా సంస్థలనే కాకుండా, ఉపాధ్యాయులను కూడా గొప్పగా గౌరవిస్తుంది.. గౌరవించాలి కూడా.. 

చదువులకు ఉన్న విలువలకు, మారుతున్న ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యంత ప్రాధాన్యత రంగంగా విద్యారంగాన్ని గుర్తించి.. మన ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలంలో అనేక అడుగులు ముందుకువేసింది. మీ అందరికీ తెలిసిన విషయాలనే మరోసారి గుర్తుచేస్తున్నాను.

నేను ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన రివ్యూలలో విద్యాశాఖకు సంబంధించి చేసిన రివ్యూలు, బహుశా మరేశాఖలో చేసి ఉండను. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాలను, వారి తలరాతలను, భవిష్యత్తును మార్చగలిగిన గొప్ప అస్త్రం. అందుకే విద్యాశాఖపై ధ్యాసపెట్టాను. మనమంతా ఒక్క విషయం ఆలోచన చేయాలి. మన విద్యా విధానం, మన విద్యా వ్యవస్థ.. ఎలా ఉందనేది ఆలోచన చేయాలి. మనందరి ముందున్న సవాళ్లు.. చదువుకున్న చదువుల వల్ల మన పిల్లలకు ప్రయోజనం కలుగుతుందా..? లేక కేవలం పట్టా మాత్రమే వారి చేతుల్లో ఉంచే ఊరట కలిగించే మాదిరిగా మాత్రమే ఉందా..? అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 

కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాల పాటు చదువులకు దూరంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పేదవర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు స్వాతంత్య్రం తరువాత కూడా ప్రపంచంతో పోటీపడలేని చదువును, తమ మీద రుద్దబడిన చదువును, వేరే గత్యంతరం లేక చదువుకుంటున్న దుస్థితి. మార్చేందుకు మనందరి ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా దృష్టి సారించి శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టే మార్పులు కాదు. ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగు పరిచేందుకు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకొస్తున్న మార్పులు. అట్టడుగున ఉన్న పేద సామాజిక వర్గాల చరిత్రను పూర్తిగా మార్చేందుకు చేసిన మార్పులు. మరింత అర్థవంతమైన, భవిష్యత్తు తరాల చదువుల కోసం అడుగులు ముందుకేస్తున్న మార్పులు. 

ఇవి గడిచిన ప్రభుత్వం మాదిరిగా ఎడ్యుకేషన్‌ సెక్టార్‌ నుంచి ప్రభుత్వం తప్పుకొని, కార్పొరేట్‌ సంస్థలకు ఎడ్యుకేషన్‌ సెక్టార్‌ను అమ్మేసి.. పేద సామాజిక వర్గాలకు అన్యాయం చేయడానికి ఉద్దేశించిన మార్పులు కావు. ఇవి.. పెద్ద చదువులకు, మంచి చదువులకు పేదరికం అడ్డురాకూడదు.. ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి రావాలని తీసుకొస్తున్న మార్పులు. 
గతంలో మాదిరిగా కార్పొరేట్‌ రంగంతో కుమ్మకైపోయి.. ఇంగ్లిష్‌ మీడియంను, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను పేదలకు దూరమయ్యేలా గత ప్రభుత్వం చేసిన మార్పుల వంటి మార్పులు కావు. గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రభుత్వ టీచర్లను, ప్రభుత్వ బడులను రెండింటినీ నిర్వీర్యం చేసేవిధంగా తీసుకొస్తున్న చర్యలు, మార్పులు అంతకంటే కావు. మనవన్నీ ప్రభుత్వరంగంలో విద్యా వ్యవస్థను 28 రాష్ట్రాల భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తూ మార్పులు తీసుకొస్తున్నాం. మనవన్నీ గవర్నమెంట్‌ బడికి మళ్లీ గుర్తింపు, వైభవం తీసుకురావాలని తపనతో చేస్తున్న మార్పులు. 

గవర్నమెంట్‌ బడిలో ఇప్పటికీ మరోదారి ఏదీ లేక చదువుకుంటున్న నిరుపేద వర్గాల జీవితాల్లో దశాబ్దాలుగా వారంతా ఆశిస్తూ ఎదురుచూస్తున్న మార్పులు. 
ఇవి.. చదివిస్తున్న ఆ తల్లులకు, చదువులను ప్రోత్సహించేందుకు మద్దతుగా నిలబడే మార్పులు. బడికి వచ్చిన పిల్లలు ఆకలితో ఉండరాదని, వారికి పౌష్టికాహారం అందించడమే కాకుండా.. రోజుకో మెనూ ఉండేలా వారి ఆహారం గురించి ఆలోచన చేస్తున్న మార్పులు.
గవర్నమెంట్‌ బడి కార్పొరేట్‌ బడికంటే బాగుండాలని, ఆ విధంగా తీసుకొస్తున్న మార్పులు. పేద పిల్లలు మాత్రమే కాకుండా మంచి చదువులు కావాలని కోరుకునే ప్రతీ తల్లిదండ్రీ, ఆ ప్రభుత్వ బడుల్లోనే పనిచేస్తున్న టీచర్లు సైతం వారి పిల్లలను.. ఇవే గవర్నమెంట్‌ బడుల్లో చదివించే పరిస్థితి రావాలన్న మంచి సంకల్పంతో తీసుకొస్తున్న  మార్పులు.
 ఇవి గవర్నమెంట్‌ బడిలో చదివిన పిల్లలు కూడా కార్పొరేట్‌ విద్యా సంస్థలతో పోటీపడి.. ఏ పరీక్షలో అయినా సరే నెగ్గేలా తీసుకొస్తున్న మార్పులు. 
విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడం ఎలా, అక్షరాస్యతను పెంచడం ఎలా, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందించడం ఎలా అన్న ప్రశ్నలకు సమాధానంగా మనందరి ప్రభుత్వం తీసుకొస్తున్న అవసరమైన మార్పులు. 
సరైన టాయిలెట్స్‌ లేకపోవడం వల్ల ఆడపిల్లలు ఎక్కువ శాతం బడి మానేస్తున్నారన్న నిజాన్ని గమనించిన తరువాతే.. వందశాతం అక్షరాస్యత, కనీసం 70 శాతం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ జీఈఆర్‌ పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న మన ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ ప్రయాణం చేస్తుంది. 

ఇవన్నీ జరగాలంటే, సౌకర్యాలన్నీ బాగుండాలంటే, లక్ష్యాలన్నీ చేరాలంటే పెద్ద మనసు చేసుకొని మనమంతా ఒక్కటైతేనే ఇది సాధ్యమవుతుంది. అమ్మఒడితో పాటు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్టు, బైజూస్‌ సంస్థతో ఒప్పందం, ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్స్‌ ఇవ్వడం, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్, బైలింగ్వెల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ ఇవ్వడం, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్‌ అప్‌గ్రేడేషన్స్‌ ప్రోగ్రాంతోపాటు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో విద్యా దీవెన, వసతి దీవెన, కరికుళం మార్పుతో ఇలా ఈ మూడేళ్లలో ఈ కార్యక్రమాల మీద మాత్రమే మనందరి ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాల రూ.53వేల కోట్లు. 

మన విధానం.. ఉచితంగా విద్యను అందించడంతో పాటు అది క్వాలిటీ ఎడ్యుకేషన్‌గా ఉపయోగపడే చదువు ఇవ్వాలన్నది మన విధానం. ఇందులో ఉపాధ్యాయుల తోడ్పాటు చాలా కీలకం అవుతుందని సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ రంగాల మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని సగర్వంగా చెప్పగలను. గత ప్రభుత్వాలు చూస్తూ ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్‌ రంగానికి పెద్దపీట వేసి.. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం వేస్ట్, ప్రభుత్వ స్కూల్స్‌కు వెళ్లడం వేస్ట్, చివరకు ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా వేస్ట్‌ అనే విధంగా నిర్వీర్యం చేస్తూ పోతే.. చివరకు అది గవర్నమెంట్‌ ఉద్యోగాల నుంచి పూర్తిగా తీసేసే పరిస్థితికి పోయేది. అలాంటి గత పాలనకు పూర్తిగా విరుద్ధంగా, ప్రభుత్వరంగం మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

60 నుంచి 62 సంవత్సరాలకు రిటైర్‌మెంట్‌ వయస్సును ఎవరూ అడక్కపోయినా పెంచామని సవినయంగా తెలియజేస్తున్నాను. ఎవరూ అడక్కపోయినా.. ఎస్‌జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోట్‌ చేస్తాం. స్కూల్‌ అసిస్టెంట్లను గ్రేడ్‌ 2 హెడ్‌ మాస్టర్లుగా ప్రమోట్‌ చేస్తున్నాం. హెడ్‌ మాస్టర్‌లను ఎంఈవోలుగా కూడా ప్రమోట్‌ చేస్తూ నియామకాలు సాగిస్తున్నాం. ఇవన్నీ ఎవరూ అడగలేదు. కానీ, విద్యారంగంలో ఇవన్నీ అవసరం అని తలచీ.. వెనకడుగు వేయకుండా మనసు పెట్టి ఆలోచన చేసి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. 

క్షేత్రస్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకు వేగంగా వేస్తున్నాం. గత రెండు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్‌ విషయంలో కూడా పూర్తి చిత్తశుద్ధితో ఉద్యోగుల మీద ప్రేమ, మంచి చేయాలనే తపనతో.. సొల్యూషన్‌ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం మనది. 

గతంలో ఏనాడూ ఉద్యోగుల మీద సానుభూతి చూపని ప్రభుత్వం.. ఈరోజు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని, రెచ్చగొట్టాలని, టీచర్లను సైతం వదలకుండా విశ్వప్రయత్నాలు చేస్తుంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అని ఆలోచన చేయాలి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల పెన్షన్‌ సమస్యకు అనుకూలంగా ఒక్క వాక్యం కూడా రాయని, చూపని ఎల్లో పత్రికలు, ఛానళ్లు.. ఇప్పుడు కనీసం ఒక సొల్యూషన్‌ కొరకు మనందరి ప్రభుత్వం మనసుపెట్టి ఆలోచన చేస్తూ.. అడుగులు ముందుకేస్తుంటే.. అప్రిశేట్‌ చేయకపోగా.. రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతున్నారు. ఇవన్నీ గమనించాలని అడుగుతున్నాను. అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర మనది. టీచర్లకు, గవర్నమెంట్‌ బడులకు గతంలో ఎన్నడూ లేనంతా గౌరవం పెంచుతూ మంచి జరిగేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది అని సవినయంగా తెలియజేస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మీ అందరి తోడ్పాటు సర్వదా లభించాలని, విద్యారంగంలో ఇంకా ఎక్కువ మంచిచేసే మార్పులకు కట్టుబడి ఉంటానని మనసారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top