జూన్‌కల్లా పనులు పూర్తయ్యే కార్యాచరణ సిద్ధం చేయండి

పాఠశాలల్లో 'నాడు-నేడు'పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలు జూన్‌ మాసం కల్లా పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూళ్లలో ఫర్నీచర్‌, చాక్‌బోర్డ్స్‌ తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన ఒకటి రెండు అంశాలకు కూడా త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. అనంతరం స్కూల్‌ పిల్లలకు ఇవ్వనున్న యూనిఫామ్స్‌, బ్యాగ్‌ నమూనాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిశీలించారు. 72,596 గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్‌ కోసం రివర్స్‌ టెండర్లలో రూ.5.07కోట్లు ఆదా అయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రూ.79.84 కోట్లు టెండర్లలో ఎల్‌–1 కోట్‌చేస్తే రివర్స్‌టెండర్లలో రూ. 74.77 కోట్లుగా ఖరారైందని, అదేవిధంగా 16,334 అల్మరాల కోసం రూ.19.58 కోట్లకు ఎల్‌–1 కోట్‌ చేస్తే, రివర్స్‌ టెండర్లలో రూ.15.35కు ఖరారైందన్నారు. తద్వారా రూ. 4.23 కోట్లు ఆదా అయ్యిందని సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు తెలిపారు.

Back to Top