చిత్తూరు: విద్యా, వైద్యం కోసం పేదవాడు అప్పు చేయకూడదన్నదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం. ఈ ఆశయం దిశగా ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అంతంటితో ఆగకుండా మానవతా దృక్ఫథంతో వైద్యానికి అవసరమైన ఆర్థికసాయాన్నిఅందిస్తూ ఎందరికో ప్రాణదానం చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో పది నెలల బాబు లివర్ మార్పిడికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనస్సుతో రూ.17.5 లక్షల ఆర్థిక సాయం అందించి ఆపరేషన్ చేయించారు. 12 గంటలు శ్రమించిన చెన్నై గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు.. చిన్నారికి లివర్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసి ప్రాణాలు నిలిపారు. శ్రీకాళహస్తి పట్టణం, బీపీ అగ్రహారానికి చెందిన మునీశ్వర్ (10 నెలల బాబు) లివర్ సంబంధ సమస్యతో బాధపడుతు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, నిరుపేద కుటుంబం అయిన బాబు తల్లిదండ్రులు సమస్యను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే ఈ సమస్యను జగనన్న దృష్టికి తీసుకెళ్లి ఆపరేషన్ కు కావాల్సిన రూ. 17.5 లక్షలను సీఎం ఆర్థిక సహాయం నుంచి తల్లిదండ్రులకు అందజేశారు. చెన్నై గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు దాదాపు 12 గంటల శ్రమించి లివర్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి బిడ్డకు పునర్జన్మ అందించారు. ఈ సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ.. గత 2 సంవత్సరాల్లో 80కి పైగా పీడియాట్రిక్ లివర్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశామని కానీ మేము చేసిన ఆపరేషన్ లో అతి చిన్న వయసు వారికి ఆపరేషన్ చేయడం ఇదే ప్రథమం అన్నారు. ఈ ఆపరేషన్కు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, అలాగే సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వైద్యులు చెప్పారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి ఆరోగ్యం,విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకాళహస్తి లో నిరుపేద కుటుంబంకి చెందిన మునీశ్వర్ (10 నెలల బాబు) లివర్ మార్పిడి ఆపరేషన్ కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 17.5 లక్షలు అందజేసి నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపారని తెలిపారు. ఇంత పెద్ద సాయం చేసిన సీఎం వైయస్ జగన్కు పాదాభివందనాలు తెలిపారు. ఇంత పెద్ద ఆపరేషన్ ను 12 గంటలపాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేసిన గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బాబు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా బాబుకు పునర్జన్మ ప్రసాదించిన సీఎం జగనన్నకు, ఎమ్మెల్యే మధన్నకు, గ్లోబల్ హాస్పిటల్ వైద్య బృందానికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు.