పేద‌ల‌కు ఎంత మేలు జ‌రిగితే అంత మంచిది

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సమావేశం

ఇప్పటి వరకు 1.02 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకి లబ్ధి

వైయ‌స్ఆర్‌ ఆసరా, చేయూత పథకాల ద్వారా మ‌హిళ‌ల‌కు మేలు

అంబేడ్క‌ర్ పార్కు విజయవాడ నగరానికి తలమానికం కావాలి

మంత్రులు, అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మేలు జరిగితే అంత మంచిద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది. స‌మావేశానికి మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన కృష్ణదాస్‌, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు చేకూర్చారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందని ఈ సందర్భంగా మంత్రులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

మొత్తంగా 1,01,82,319 మందికి లబ్ధి చేకూరింది
2018-19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలానే 2019-20లో ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది (2020-21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి పొందగా.. మొత్తంగా 1,01,82,319 మందికి లబ్ధి చేకూరిందని అధికారుల సీఎం వైయ‌స్ జగన్‌కు తెలిపారు.

వైయ‌స్ఆర్ ఆస‌రా, చేయూత‌తో మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి
మన ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మేలు జరిగితే అంత మంచిద‌న్నారు. వైయ‌స్ఆర్‌ ఆసరా, వైయ‌స్ఆర్‌ చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలు అవుతున్నాయ‌ని, దీంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంద‌న్నారు. వైయ‌స్ఆర్ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు, వైయ‌స్ఆర్‌ చేయూత ప‌థకం ద్వారా  దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింద‌న్నారు. మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నామ‌ని, ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.

2021 ఏప్రిల్ 14 నాటికి పార్కు నిర్మాణం పూర్తి కావాలి
2021 ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యం నెరవేరాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మంత్రులు, అధికారుల‌కు సూచించారు. అంబేడ్కర్‌ పార్కును వేగంగా పూర్తి చేయాలని, విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులను పార్కు నిర్మాణ ప‌నుల‌ను రెండుగా విభజించాల‌ని ఆదేశించారు. 20 ఎకరాల్లో విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని, అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా పార్కును తీర్చిదిద్దాల‌ని సూచించారు. వచ్చే ఏప్రిల్‌ 14 నాటికి పార్కు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవాల‌న్నారు. మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాల‌న్నారు. విజయవాడ నగరానికి పార్కు తలమానికం కావాల‌ని, మంత్రులు, అధికారులు సవాల్‌గా తీసుకుని అంబేడ్కర్‌ జయంతి నాటికి పూర్తయ్యేలా చూడాల‌ని ఆదేశించారు. వీలైనంత కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

తాజా వీడియోలు

Back to Top