మరోసారి గొప్పమనసు చాటుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

వైయ‌స్ఆర్ వీరాభిమాని కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు అంద‌జేత‌ 
 

గుంతకల్లు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. సంకల్పయాత్రలో తన వెంట నడుస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోగా, ఆదుకుంటానని ఆ కుటుంబానికి ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సాయమందించి భరోసా ఇచ్చారు. వివరాలు.. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రంగారెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి వీరాభిమాని. ఇతనికి భార్య రమణమ్మ, కుమార్తెలు భారతి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఇడుపులపాయ నుంచి రంగారెడ్డి ఆయన వెంట నడిచారు. నెల్లూరు జిల్లా కాండ్ర గ్రామంలో అభిమాన నేతతో కరచాలనం చేసి ఫొటో కూడా దిగారు. అదే రోజు మధ్యాహ్నం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో గూడూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.  

కుటుంబాన్ని ఆదుకుంటానని వైయ‌స్ జ‌గ‌న్‌ హామీ 
రంగారెడ్డి మృతి వార్త తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ కాండ్ర గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు గుర్తు చేయగా, వెంటనే స్పందించిన ఆయన రూ.10 లక్షల చెక్కు పంపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే వైవీఆర్‌ పెద్దొడ్డి గ్రామపెద్దల సమక్షంలో రంగారెడ్డి కుటుంబసభ్యులకు అందజేశారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. 

Back to Top