తాడేపల్లి: బద్వేలు ఉప ఎన్నికలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత వెంకటసుబ్బయ్య గారి భార్య డాక్టర్ సుధను అభ్యర్థిగా నిలబెడుతున్నామని, గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కన్నా.. ఎక్కువ మెజార్టీ రావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఎక్కడా అతివిశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని ఆదేశించారు. బద్వేలు ఉప ఎన్నికపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, కొడాలి నాని, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధను నిలబెడుతున్నామని, బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి హాజరైన వారందరిపై ఉన్నాయన్నారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలి సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీతో వెంకట సుబ్బయ్య గెలుపొందారని, ఉప ఎన్నికలో గతం కంటే ఎక్కవ మెజార్టీ రావాలని సూచించారు. 2019లో 77శాతం ఓటింగ్ జరిగిందని, ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెరగాలి, ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని, ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలన్నారు. ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. ఓటర్లను అభ్యర్థించాలని, వారు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్యం చేయాలన్నారు. నెలరోజులపాటు సమయాన్ని కేటాయించి, ఎన్నికపై దృష్టిపెట్టాలన్నారు. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని సీఎం వైయస్ జగన్ చెప్పారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయండి అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచించారు.