సాగునీటి ప్రాజెక్టులపై బాబు కుట్ర

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ అధినేత‌

ప్రాజెక్టు పూర్త‌యితే సీఎం వైయ‌స్ జగన్‌కు మంచి పేరు వస్తుంద‌ని భ‌యం

అమ‌రావ‌తి: తాను అధికారంలో వున్నపుడు ప్రజలకోసం చేసిందేమి లేకపోగా, సాగునీటి ప్రాజెక్టులను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరాన్ని కూడా అయన పట్టించుకున్నది లేదు.  రాయలసీమ ఎడారిగా మారడమే ఆయ‌న‌ చేసిన అభివృద్ధికి అద్దం పడుతుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నపుపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు వైయ‌స్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు సీఎం  వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి రాయల‌సీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్న అడ్డంకులు సృష్టించడమే ఆయ‌న‌ గొప్పతనం. అది ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యుంటుంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రాజకీయ పార్టీలన్నీ ముఖ్తకంఠంతో ఒక్కటై దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతుంటే ఏపిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏపీ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆగిపోవాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అందరూ ఐక్యం అయితే ఏపీలో ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఒంటరిగా చేశారు.

ప్రజలకోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధం అని డబ్బాలు కొట్టుకున్న బాబు సొంత రాష్ట్రానికి ముఖ్యంగా సొంత ప్రాంతానికి నష్టం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. ఇక పచ్చమీడియా అయితే వాళ్ళు చెప్పిందే నిజం అని ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి రాయలసీమ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఏపిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. నారా బాబు రాష్ట్ర  ప్రయోజనాలను పక్కకు నెట్టి సొంత ప్రయోజనాలకోసం పోరాడుతున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే రాయలసీమ ప్రాజెక్ట్ పై చంద్రబాబు, తన అనుచరగణం పచ్చమీడియా సహాయంతో కుట్రలు పన్నుతున్నారు. రాయలసీమ  ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టిస్తే సీఎం వైయ‌స్‌ జగన్ కు మంచి పేరు వస్తుందనేది చంద్రబాబు భయం. ఇక్కడ కూడా రాజకీయంగా ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలు మాట్లాడడం లేదు . హైదరాబాద్ లోని తన విలాసవంతమైన భవంతి లో సేద తీరుతూ అపుడపుడు రాష్ట్ర ప్రాయాజనాల కోసం ఆలోచన చేస్తారు అనుకుంటే జూమ్ బాబు మాత్రం రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలకు పూనుకుంటున్నారు. ఉండవల్లి కరకట్ట నివాసంలో ఉన్నపుడు అందుబాటులో ఉన్న నేతల సమావేశం పేరుతో హడావిడి చేసే చంద్రబాబు ఇప్పుడు జూమ్ ను ఉపయోగించుకొని పార్టీ నేతలతో సమావేశంతో పాటు తనకు అనుకూలమైన పచ్చ మీడియా ప్రతినిధులతో అనుకూల ప్రశ్నలు వేయించుకుంటూ ప్రభుత్వం చేపట్టే ప్రతి పనికి అడ్డంకులు సృష్టిస్తూ తానూ రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడే యోధుడిని అని కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టిన రాయలసీమ పథ‌కాన్ని వివాదాస్పదం చేసేందుకు శ‌త‌విధాలా ప్రయత్నిస్తున్నారు చంద్ర‌బాబు. తాజాగా పార్టీ నేతలతో , విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో లేని పోని గొడవలను వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడుతోందని ,ఈ గొడవల ద్వారా  ప్రభుత్వం సాధించిందేంటో సమాధానం చెప్పాలని  పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడారు. ముచ్చుమర్రి రాయలసీమకు జీవనాడిగా ఉంటుందని ఆ ప్రాజెక్టును పూర్తిచేయకుండా రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రభుత్వం గొడవలు పెడుతోందంటూ  తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడారు. తన తాబేదారులతో ఇదే తరహాలో మాట్లాడిస్తున్నారు. తనకు గత ఎన్నికల్లో  రాజకీయంగా నష్టం చేసిన ప్రాంతం పై ఉన్న కక్షతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన సొంత పార్టీ నేతలే అభిప్రాయం పడుతున్నారు.

గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగు నీరు మరియు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా ఇబ్బంది అని భావించి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పథకాలకు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చటమే. అందుకే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పుడు వారికి ఏ పీ నుంచి చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేలా సిద్ధం అయ్యారు. తనతో పాటు తనకు వంతపాడే తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు అండ్ కో  రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎద్దు ఈనింది అంటే గాటన కట్టేయండి అన్నట్లుగా చంద్రబాబు మాటే వేదంగా నడుచుకునే పచ్చమీడియా, పార్టీలు, ఆయనకు వంతపాడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ  వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు .

రాయయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మే లో ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సీఎం వారం రోజుల క్రితం వరకు నోరు మెదపలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా స్పందించలేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన సీఎం వైయ‌స్‌ జగన్ ను అభినందిచకపోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా ఉండాల్సిన చంద్రబాబు  మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణాలో తమ భావజాలాలు, అభిప్రాయాలు విభిన్నమైన అన్ని పార్టీలు ఏకం అయ్యాయి.  40 ఇయర్స్ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, నా అనుభవం అంత లేదు మీ వయస్సు అని చెప్పే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా భజన బృందం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వ రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తు ఆ విధంగా ముందుకు పోతున్నారు.

Back to Top