మహనీయుల స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన

సమ సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నాం

అన్ని వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే

పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమం

అమరావతి: మహనీయులు బీ.ఆర్‌.అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌ రామ్‌ల స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోందని, సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ముందడుగులు వేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్జీవన్‌రామ్‌ చిత్ర పటానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కైలే అనిల్‌ కుమార్, మల్లాది విష్ణు, సుధాకర్‌బాబు, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ విముక్తి కోసమే కాకుండా.. సామాజికంగా అట్టడుగు వర్గాలు కూడా విముక్తి పొంది సమసమాజ నిర్మాణం దిశగా తొలి అడుగు వేసిన మహనీయుల్లో బీ.ఆర్‌ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్‌లు ఉన్నారన్నారు. వారి స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారన్నారు. మహనీయుల జయంతులు, వర్ధంతులు కేవలం మొక్కుబడి మాటలకు కాకుండా.. ఆచరణాత్మకంగా సీఎం వైయస్‌ జగన్‌ అడుగు వేస్తున్నారన్నారు. 
 
వైయస్‌ఆర్‌ తనయుడిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సమాజంలోని అట్టడుగువర్గాల్లోని ఆఖరి ఇంటి వరకు సంక్షేమం అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలకంగా ఎలా పాల్గొంటుందని, ఆ దిశగా ఎలా అడుగు వేస్తున్నాం.. దాని ఫలితాలు ఎలా ఉన్నాయనేది రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. అట్టడుగున ఉన్న కులాలను వెలికి తీసి.. వారికి ఉనికి కల్పించారన్నారు. అగ్రవర్ణాలతో దీటుగా అట్టడుగు వర్గాల ప్రజలకు అన్నిరకాల అవకాశాలు కల్పించే దిశగా రెండేళ్లలోనే పెద్ద ముందడుగు పడిందన్నారు. ప్రభుత్వం అట్టడుగు వర్గాల వారికి కల్పిస్తున్న అవకాశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారు కూడా మిగిలినవారితో పోటీపడే విధంగా సమాన అవకాశాలు సాధించుకునే విధంగా ప్రోత్సహించడం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కర్తవ్యంగా గుర్తించి అందుకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. 
 

Back to Top