తాడేపల్లి: ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సారవంతమైన భూములను ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ పోరాటం చేస్తున్న రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. అన్నదాతకు వైయస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కరేడు గ్రామ రైతులు కలిశారు. సస్యశ్యామలంగా పచ్చగా ఉండే కరేడు గ్రామ భూములను పరిశ్రమలకు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని రైతులు వినతిపత్రం అందజేశారు. పచ్చని పంటపొలాలను లాక్కుంటే మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు విన్న వైయస్ జగన్..వారికి ధైర్యం చెప్పారు. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. అవసరమైతే మీ గ్రామానికి కూడా వస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. వైయస్ జగన్ను కలిసిన అనంతరం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, కందుకూరు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్, రైతులు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే... భూములు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం తత్సారం: వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కరేడు రైతులంతా వైయస్ జగన్ గారిని కలిసి అన్నీ వివరించారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశాం. అలాగే పోర్టుకు ఆనుకుని ఇండోసోల్ కంపెనీకి అనుబంధ పరిశ్రమ ఏర్పాటుకు చేవూరులో 3000 ఎకరాలు రైతులను ఒప్పించి ఇప్పించి, రూ.417 కోట్లు వారికి ఇండోసోల్ కంపెనీ నుంచి ఇప్పించాం. కానీ కూటమి ప్రభుత్వం వారికి భూములు కేటాయించకుండా తత్సారం చేసింది. పైగా ఆ భూముల్లో ఇప్పుడు బీపీసీఎల్ కంపెనీని తీసుకొస్తే అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఇండోసోల్ కంపెనీకి ఇస్తామంటున్నారు కానీ బీపీసీఎల్ను వ్యతిరేకిస్తున్నారు. మరి ఇప్పుడు ఇండోసోల్ కంపెనీని అక్కడి నుంచి కరేడు గ్రామానికి తరలిస్తున్నారు. కరేడు భూములు సారవంతమైనవి. సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు నివసిస్తున్నారు. వేలాది కుటుంబాల జీవనాధారం తీసేసే ప్రయత్నం జరుగుతుంది. కరేడు పంచాయతీలో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి భూములను వ్యతిరేకించారు. ఇండోసోల్ కంపెనీని అక్కడి నుంచి తరిమేయాలనే కుట్ర జరుగుతోంది. పరిశ్రమలను రాష్ట్రానికి రానీయకుండా భూములన్నీ సేకరించి ఏదో కుట్ర చేయాలని ప్రజలకు అనుమానంగా ఉంది. తాజాగా జులై 13న ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ఇచ్చి దాని ప్రకారం 20,000 ఎకరాలు ఈ రెండేళ్ళలో ఏపీఐఐసీ ద్వారా కానీ మ్యారీటైం బోర్డు ద్వారా సేకరించాలని జీవో ఇచ్చారు. దానికి గాను 5 గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో టీమ్లు ఏర్పాటు చేస్తున్నారంటే... సింగరాయకొండ నుంచి కావలి వరకు జాతీయ రహదారి పక్కన 30 కిలోమీటర్లు పొడవునా సముద్రతీరంలో భూములన్నీ కబలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మాకు అనుమానంగా ఉంది. ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కుట్రను వైయస్ఆర్సీపీ త్వరలో బయటపెడుతుంది. ఈ ప్రాంత భూములన్నీ రాబందుల్లా కబలించే ప్రయత్నం జరుగుతుంది. ఇండోసోల్ కంపెనీకి గతంలో కేటాయించిన భూములు వారికి ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఈ జీవోలన్నీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో రైతుల తరుపున వైయస్ జగన్ గారు కూడా పోరాడుతారు. వారికి అండగా నిలబడతారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. సారవంతమైన భూములు రైతులకే చెందాలి: బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ కరేడు గ్రామంలో రెండు మూడు నెలలుగా ఈ భూముల గురించి రైతులు పోరాడుతున్నారు. ఏడాదికి రెండు పంటలు పండే భూములు వారి నుంచి లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. రైతులు తమ గోడు వైయస్ జగన్ గారిని కలిసి చెప్పుకున్నారు. ఇండోసోల్ కంపెనీకి మా ప్రభుత్వంలో మేం కేటాయించిన భూములు వారికి అక్కడ ఇవ్వకుండా ఇక్కడికి పంపారు. దీనిని మేం వ్యతిరేకిస్తాం అని వైయస్ జగన్ గారు చెప్పారు. ఇది అన్యాయమన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సారవంతమైన భూములు రైతులకే చెందాలి అంతేకానీ ఇలాంటి భూములు ఇవ్వకూడదన్నారు. సాగుకు నిరుపయోగం అయిన భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని వైయస్ జగన్ గారు చెప్పారు. వైయస్ జగన్ మాకు అభయం ఇచ్చారు: మిరియం శ్రీనివాసులు, రైతు, కరేడు గ్రామం: మేం వైయస్ జగన్ గారిని కలిసి మా కరేడు రైతుల సమస్యను వివరించాం. వైయస్ జగన్ మాకు అభయం ఇచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైయస్ఆర్సీపీ నాయకులంతా మాకు అండగా ఉంటారన్నారు. భవిష్యత్లో నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నేను రైతుల తరుపున వచ్చి పోరాడతాను అని భరోసా ఇచ్చారు. మేం ధన్యవాదాలు చెప్పాం. ప్రభుత్వం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మా ప్రాణాలైనా ఇస్తాం కానీ సెంటు భూమి కూడా ఇవ్వం. పచ్చని పంటలు పండే భూములను మేం వదులుకోం. పారిశ్రామిక అభివృద్ది పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం మా నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదు. జగన్ సార్ అండగా ఉంటామన్నారు: శ్రీనివాస మూర్తి, రైతు, కరేడు గ్రామం మా కరేడు రైతుల సమస్యలన్నీ వైయస్ జగన్ గారికి వివరించాం. సార్ మాకు అండగా ఉంటామన్నారు. మా రైతుల తరుపున జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.