అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యం

జన్మభూమి కమిటీల ఆగడాలు ఇక సాగనివ్వను

3 లక్షలకు ఇచ్చే ప్లాట్లను ఎవరూ వద్దనకండి

నేను సీఎం అయ్యాక మొత్తం మాఫీ చేసేస్తా..

జగన్‌ చెప్పడంతోనే చంద్రబాబు పింఛన్‌ పెంచాడు

పార్టనర్, యాక్టర్‌కు మా చిన్నాన్న హత్య కనిపించలేదా

జనసేన అభ్యర్థుల నామినేషన్లలో కనిపించేది టీడీపీ జెండాలే

అయిదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతిలో జనసేన పాత్ర ఉంది

పాలకొల్లు బహిరంగ సభలో వైయస్‌ జగన్‌

పాలకొల్లు: పాల‌కొల్లు మీదుగా పాద‌యాత్ర సాగింది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విన్నాను. గోదావ‌రి ప‌క్క‌నే ఉన్నా.. రెండో పంట‌కు నీరు అంద‌ని ప‌రిస్థితి. పండిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర దొర‌క‌ని క‌ష్టాన్ని చెప్పారు. నేను విన్నాను.. మీ అంద‌రికీ నేను ఉన్నాన‌ని ఈ వేదిక నుంచి హామీ ఇస్తున్నా. డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు చాలా బాధలు పడుతున్నారు. వారి బాధలు చెప్పుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లినా వినే ఓపిక వారికి లేదు. అయిదేళ్లుగా తమ సమస్యలపై నినదించిన మహిళల మీద చంద్రబాబు దాడులు చేయించాడే తప్ప వారికి న్యాయం చేయలేదు. వారంతా పాదయాత్రలో ఉన్న నన్ను వచ్చి కలిశారు. వారందరికీ నేను అండగా ఉంటా. ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు వచ్చి తమ ఆవేదనను నాకు చెప్పుకున్నారు. పింఛన్‌ కావాలంటే లంచం. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల ఆగడాలు పెచ్చుమీరి పోతున్నాయి. బాధితులందరికీ నేను భరోసా ఇస్తున్నా... వారందరికీ నేను ఉన్నాను అని చెబుతున్నా. లంచాలు తీసుకునేది చంద్రబాబు... డబ్బులు కట్టేది పేదవాడు. చంద్రబాబు మీ అందరికీ 3 లక్షలకు ప్లాట్లు ఇస్తానంటే ఎవరూ వద్దనకండి. తీసుకోండి. నెలకు మూడు వేలు కట్టాల్సిన పనిలేదు. నేనొచ్చాక మొత్తం తీసేస్తా. మీ డబ్బులు నేనే కడతా. ఇక్కడే టౌన్‌ మధ్యలో డంపింగ్‌ యార్డు గురించి మనం పోరాటాలు చేశాం. అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. వంద పడకల ఆస్పత్రి అయిదేళ్లయినా పూర్తి కాలేదు. చంద్రబాబు చెప్పే అభివృద్ధి అంటే శ్మశానాలకు రంగులేసి కమీషన్లు తీసుకోవడమే. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలు విన్నా. నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, రైతులు అన్ని వర్గాల వారు వచ్చి నన్ను కలిశారు. అందరి బాధలు విన్నా. ఉద్యోగాలు లేక అప్పులు తెచ్చి కోచింగ్‌ సెంటర్లకు సంవత్సరాల తరబడి పరీక్షలకు ప్రిపేర్‌ అవుతన్నారు. వారందరి ఆవేదన నాకు అర్థమైంది. మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే... అందరి సమస్యలు తీరిపోతాయి. ప్యాకేజీ అని చెప్పి 5 కోట్ల మంది ప్రజలకు తీవ్రమైన వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. పద్నాలుగు నెలలుగా మీ అందరి మధ్య పాదయాత్ర చేశా. నన్ను మీరంతా దగ్గుర్నుంచి చూశారు. పదేళ్లుగా మీ పక్షాన పోరాడుతున్నా. పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ప్రజల పక్షాన పోరాడుతున్నా. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మొదట స్పందించింది జగనే. కానీ ఈ జగన్‌ కి కష్టం వస్తే మాత్రం ఎల్లో మీడియాకు, టీడీపీకి సంతోషం. చివరికి మా చిన్నాన్నను చంపితే కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న చంద్రబాబు పార్టనర్, యాక్టర్‌ ని మా చిన్నాన్న హత్య గురించి ఒకటే అడుగుతున్నా. మీ కుటుంబంలో కూడా చంద్రబాబు మనుష్యులు చంపించి మిమ్మల్నే నిందితులుగా చూపిస్తే.. ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తే నీకు నచ్చుతుందా అని  ప్రశ్నిస్తున్నా. టీడీపీ నాయకుల ప్రచారం, ఎల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారం, విచారణ జరగుతున్న తీరు నీకు కనిపించడం లేదా... అయినా మీ కుటుంబాలు చల్లగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నా. చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తుతున్న పార్ట్‌నర్, యాక్టర్‌కి బాబు అవినీతిలో ఖచ్చితంగా వాటా ఉంది. పార్టనర్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి వెళితే కనిపించే జెండాలన్నీ టీడీపీ వాళ్లవే. చంద్రబాబు అవినీతి, అక్రమాల మీద ఏనాడూ ఈ పార్టనర్, యాక్టర్‌ ప్రశ్నించడు. కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని మాత్రం తిట్టకుండా ఉండలేడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే రాబోయే 14రోజులు ఇంకా దారుణంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరికీ 3 నుంచి 5 వేల వరకు ఇవ్వాడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలంతా ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. బాబు కుట్రలను వివరించాలి. బాబు ఇచ్చే 3 వేల కోసం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవద్దని ప్రతి అక్క అవ్వ, తాతలకు మనం చెప్పాలి. 20 రోజులు ఓపికపడితే మన ప్రభుత్వం వస్తుందని కార్యకర్తలు వివరించాలి. అన్న గెలిస్తే ఉచితంగా ఉన్నత చదువులు చదివిస్తాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చెయ్యలేదు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వనేలేదు. ఎన్నికల తేదీ వరకు ఎంత అప్పు ఉంటే మొత్తం జగన్‌ సీఎం అయ్యాక మాఫీ చేస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. బ్యాంకుల దగ్గర నుంచి సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తామని చెప్పండి. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నను సీఎం చేసుకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి... కార్యకర్తలు వివరించాలి. మహిళలకు 75 వేలు ఇస్తామని మనం చెప్పాలి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదని వివరించాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కలవాలి. అందరికీ న్యాయం చేస్తామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక... ప్రతి రైతన్నకు మే నెలలో ఏడాదికి 12500 వంతున 50 వేలు ఇస్తామని చెప్పండి. గిట్టుబాటు ధరలకు జగనన్న గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. ఎన్నికలే రాకపోయుంటే.. జగన్‌ రెండు వేలు ఇస్తామని చెప్పకపోయుంటే చంద్రబాబు ఈ రెండు వేలు ఇచ్చేవాడా అని అడగండి. అందుకే మళ్లీ చెబుతున్నా. మనం గెలిస్తే పింఛన్‌ మూడు వేలు చేస్తామని ఇంటింటికీ వెళ్లి చెప్పండి. 

పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫున పోటీ చేస్తున్న బాబ్జీ అన్నను, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజును భారీ మెజార్టీతో గెలిపించాలి. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. 

పార్టీలో చేరికలు

అడపాల రమణ, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, సినీ రచయిత చిన్నకృష్ణ, గురుప్రసాద్‌ వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. 

Back to Top