నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లకు అంతిమ సంస్కారం బాధ్యతలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి మేకపాటి పార్ధివదేహాన్ని నెల్లూరుకు తరలించే ఏర్పాట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయానికి చేర్చిన అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి రోడ్డు మార్గంలో తరలించనున్నారు. మంత్రి మేకపాటి ప్రత్యేక వ్యక్తిత్వం వల్ల కుల,మత,ప్రాంతం,వర్గం, పార్టీలకతీతంగా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలి రానుండడంతో అందుకు తగ్గట్లు అక్కడి ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో అంతిమ సంస్కారాల పనుల్లో భాగస్వామ్యం అవుతోన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రి మేకపాటి మీద అవధుల్లేని అభిమానంతో అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించే పనుల్లో నెల్లూరు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు.