అమరావతి: ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు, వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని వైయస్ జగన్ స్పష్టం చేశారు. సచివాలయంలో నేడు కలెక్టర్, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. 2014–2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయని.. కానీ 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని వైయస్ జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్టుగా దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. జిల్లాల్లో డేటాను పరిశీలించి.. ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే.. వెంటనే వారికి పరిహారం ఇవ్వండని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ఎక్కడైనా సరే... రైతు కుటుంబాల్లో జరగ రానిది జరిగితే.. వెంటనే కలెక్టర్ స్పందించాలన్నారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లండని తెలిపారు. రైతులు కాని, కౌలు రైతులు కాని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కచ్చితంగా కలెక్టర్ ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని.. మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదన్నారు. మనది ప్రజల ప్రభుత్వమని, మానవత్వం ఉన్న ప్రభుత్వమని.. ఈ దిశగానే పాలన ఉంటుందన్నారు. చనిపోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతితో ఉండాలని, మానవత్వంతో మెలగాలన్నారు. మనిషే చనిపోయాడు... మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని వైయస్ జగన్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిజంగా ఇది రైతు ప్రభుత్వమే అని మరోమారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రుజువు చేశారని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.