పది కోట్లకే ప్రభుత్వం ప్రగల్భాలు

  • సుదీర్ఘ కసరత్తు తర్వాతే 10 వేలలోపు ర్యాంకర్లకు మొత్తం ఫీజు చెల్లింపు నిర్ణయం
  • నామమాత్రపు భారమని తెలిసే ప్రతిభకు ప్రోత్సాహమంటూ ప్రగల్భాలు
  • 10 వేలలోపు ర్యాంకు వచ్చిన వారిలో లబ్ధి పొందేది సుమారు 500 మంది మాత్రమే
  • సర్కారు నిర్ణయంతో ఎక్కువ నష్టపోయేది బీసీ, ఈబీసీ విద్యార్థులే
  • 10 వేలకు పైన ర్యాంకు వచ్చిన వారు ప్రతిష్టాత్మక కాలేజీల్లో చేరే అవకాశాలకు గండి
  • ప్రతిభను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అందుకే ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థులు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో చేరినా, ఎంత ఫీజున్నా, ఏ వర్గానికి చెందిన వారైనా భరిస్తాం.’... ఇవీ ప్రభు‌త్వ ప్రగల్భాలు. అయితే, పేద విద్యార్థుల ప్రతిభకు ఈ ప్రభుత్వం పాతర వేసిందని, సర్కారుపై పడే భారం నామమాత్రమేనని, 10వేల లోపు ర్యాంకు వచ్చిన వారిలో ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించేది కేవలం వందల సంఖ్యలోని విద్యార్థులకేనని వాస్తవంగా తేలిన విషయం. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పట్టించుకోకుండా రోజుల తరబడి కసరత్తు చేసి భారం చాలా తక్కువని నిర్ధారించుకున్న తర్వాతే ప్రభుత్వం 10 వేల ర్యాంకు పొందిన వారికి ఫీజులు చెల్లించేందుకు సిద్ధమైందన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. కేవలం రూ.10 కోట్ల కన్నా ఎక్కువ భారం మోసే అవసరం ఉండదన్న భరోసాతోనే కిరణ్ సర్కారు ‌కుట్రపూరిత వ్యూహంతో వ్యవహరించి పేద విద్యార్థులకు అన్యాయం చేసిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

    గత ఏడాది ప్రవేశాలను ఒకసారి పరిశీలిస్తే.. 50 వేలకు పైగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కూడా ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు లభించిందని, కేవలం ఫీజు చెల్లించలేని కారణంగా ఈసారి 10 వేల నుంచి 50 వేలు ఆ పైచిలుకు ర్యాంకు వచ్చిన పేద విద్యార్థులు ఆ కళాశాలల్లో చేరి తమ ప్రతిభను మెరుగు పరుచుకునే అవకాశాలకు రాష్ట్ర సర్కారు గండికొట్టిందని అవగతమవుతుంది.

    కౌన్సెలింగ్ విప్పిన గుట్టు :

    ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను భారంగా భావిస్తున్న ప్రభుత్వం.. ఖర్చు తగ్గించుకునేందుకు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే విషయం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవడంతో తేటతెల్లం అయ్యింది. పది వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థుల్లో మన రాష్ట్రంలోని కళాశాలల్లో చేరేందుకు 5553 మంది మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్య 5900. ‌వీటిలో కనీసం 4 వేల మంది చేరతారనుకుంటే నమోదు చేసుకున్న వారిలో మిగిలేది కేవలం 1500 మంది. వీరంతా ఫీజులు పెరిగిన 85 కళాశాలల్లోనే చేరతారనుకున్నా... గత ఏడాది లెక్కల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధి‌ పొందేది కొంచెం అటు ఇటుగా 50 శాతం మంది మాత్రమే. వీరిలో ఎస్సీ, ఎస్టీలను మినహాయిస్తే కేవలం నూటికి 30 మందే ఫీజుల పథకం కింద లబ్ధి పొందగలరు.

    ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం 10 వేల లోపు ర్యాంకు తెచ్చుకుని ఫీజులు పెరిగిన ప్రైవేటు కళాశాలల్లో చేరి రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధి పొందేవారి సంఖ్య కేవలం 500 పైచిలుకేనని ప్రాథమిక అంచనాలు చెపుతున్నాయి. వీరందరికీ సగటున రూ.60 వేల ఫీజును ప్రభుత్వం భరించినా అంతా కలిపి‌ ప్రభుత్వానికి అయ్యే ఖర్చు మూడు కోట్ల రూపాయలే. ఇక ప్రభుత్వ కళాశాలల్లో చేరే 4 వేల మందికి అయ్యే ఫీజుల భారం రూ.6.5 కోట్లకు మించదు. అంటే 10వేల లోపు ర్యాంకు పొందిన వారికి మొత్తం ఫీజు చెల్లిస్తామన్న ప్రభుత్వం వాస్తవంగా చెల్లించాల్సి వచ్చేది రూ.10 కోట్లు దాటదని అంచనా.

    నష్టపోయే బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులే ఎక్కువ :
    ప్రతిభకు కొలమానంగా 10 వేల ర్యాంకును మాత్రమే ప్రభుత్వం నిర్ధారించడంతో బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ వర్గాలలోని వేలాది మంది విద్యార్థులు భారీగా నష్టపోనున్నారు. ఎందుకంటే గతంలో 10వేలకు పైన 30 వేల లోపు ర్యాంకులు పొంది మంచి కళాశాలల్లో కూడా సీట్లు పొందినవారిలో ఎక్కువగా ఈ వర్గాల వారే ఉన్నారు. 2011-12 సంవత్సరానికి ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్లు వచ్చిన విద్యార్థుల ర్యాంకులను పరిశీలిస్తే ఈ వాస్తవం అవగతమవుతుంది. ఉన్నత‌ విద్యామండలి తన వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం... టాప్ ప్రైవేటు కళాశాలలుగా పరిగణించే సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, గోకరాజు రంగరాజు, మాతృశ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థుల ర్యాంకులను చూస్తే డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సుల్లో కూడా 10వేల కన్నా ఎక్కువ ర్యాంకులు వచ్చిన అనేక‌ మంది విద్యార్థులు సీట్లు పొందారు.

    సీబీఐటీలో: ఈ కాలేజీలో సివిల్ ఇంజనీరిం‌గ్‌లో బీసీ-ఏ గ్రూపునకు చెందిన 13,719 (బాలురు), 48,194 (బాలికలు) ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీట్లు వచ్చాయి. మెకానికల్ విభాగంలో బీసీ-ఏ బాలికలకు 25,465 ర్యాంకు వరకు సీటు వచ్చింది. ఇక మైనార్టీలు ఉండే బీసీ-ఈ గ్రూపులో అయితే బాలికలకు 13,143 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. కెమికల్‌ ఇంజనీరింగ్‌లో ఓసీలకు కూడా 10వేల కన్నా ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు వచ్చింది. బాలురకు 10,481 వరకు , బాలికలకు 14,398 వరకు సీట్లు వచ్చాయి. బీసీ-ఏ గ్రూపులో 55,788, బీ గ్రూపులో బాలురకు 18,342, బాలికలకు 22,439 వరకు సీట్లు వచ్చాయి. సీ, డీ గ్రూపుల్లోనూ 23,321 ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా చేరారు.

    శ్రీనిధిలో : ఈ కళాశాలలో అయితే సీఎస్ఈలో బీసీ ఏకు 17,421, సీ గ్రూపునకు 19,254, ఈ గ్రూపు విద్యార్థులకు 23,366 ర్యాంకుల వరకు సీట్లు వచ్చాయి. ఈసీఈ విభాగంలో బీసీ- సీ, ఈ గ్రూపుల‌ విద్యార్థులు 11,300 ర్యాంకు వరకు చేరారు. ఈఈఈలో అయితే బీసీ-ఏ బాలురకు 14,268, బాలకలకు 20,550 ర్యాంకుల వరకు, బీసీ-సీలో 22,464 వరకు, బీసీ-ఈలో 34,685 వరకు సీట్లు వచ్చాయి.

    వాసవిలో : సివిల్ విభాగంలో బీసీ-ఏ గ్రూపునకు 24,099, బీ గ్రూపునకు 17,036, డీ గ్రూపు విద్యార్థులకు 14,788 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. సీఎ‌స్ఈలో బీసీ-ఏ విద్యార్థులకు 10,323 ర్యాంకు వచ్చినా సీటు లభించింది. ఈఈఈలో మైనార్టీలు 12,207 వరకు సీట్లు పొందారు.

    మాతృశ్రీలో‌ : మాతృశ్రీ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో ఓసీ బాలికలకు 12,783 ర్యాంకు వచ్చినా సీటు వచ్చింది. ఇక బీసీ-ఏలో బాలురకు 31,245, బాలికలకు 58,250, బీసీ-బీలో బాలురకు 18,836, బాలికలకు 26,235 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. సీఎస్‌ఈలో బీసీ-ఏ గ్రూపు బాలురకు 25,590, బాలికలకు 29,764 ర్యాంకు వరకు, బీ గ్రూపులో బాలికలకు 11,678, డీ గ్రూపులో బాలురకయితే 10,440, బాలికలకు 11,067, ఈ గ్రూపులో 22,190 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఇక ఈఈఈలో అయితే బీసీ-ఏ గ్రూపులో 19,106, బీలో 11,578, డీలో 11,546, ఈలో 58,332 ర్యాంకుల వరకు సీట్లు వచ్చాయి.

    గోకరాజు రంగరాజు‌లో : ఈ కళాశాలలో సివిల్‌లో ఓసీ బాలురకు 11,309, బాలికలకు 16,791 వరకు సీట్లు వచ్చాయి. ఇక బీసీలకయితే 19,420 నుంచి 98 వేల ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. సీఎస్‌ఈ విభాగంలో బీసీ- ఏ గ్రూపు విద్యార్థులకు 21,898, బీ గ్రూపులో 11,936, సీ గ్రూపులో 37,291, డీ గ్రూపులో 14,222, ఈ గ్రూపులో 41,663 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈసీఈ విభాగంలో 14 వేల నుంచి 24 వేల వరకు, ఈఈఈలో 11699 నుంచి 39,828 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. సివిల్‌లో బీసీ ఈ విభాగంలో 98,687 ర్యాంకు పొందిన బాలికకు కూడా సీటు లభించింది. ఈ ర్యాంకుల వివరాలను బట్టి 10వేల నుంచి 50 వేల లోపు ర్యాంకులు పొందిన బీసీ, ఈబీసీ, వికలాంగ, మైనార్టీ విద్యార్థులు పూర్తిగా నష్టపోయినట్లేనని, 10వేల వరకు ర్యాంకులు వచ్చిన వారికి ప్రభుత్వం మోసే ఫీజుల భారం నామమాత్రమేనని అర్థమవుతోంది.

Back to Top