ఏపీ బడ్జెట్ డొల్లతనాన్ని బయటపెట్టిన కాగ్

టీడీపీ సర్కార్ కు తలంటిన కాగ్
బడ్జెక్ కు విశ్వసనీయత లేకుండా చేశారు
బడ్జెట్ అస్తవ్యస్తంగా ఉందని తేల్చిన వైనం
2014-15లో రూ.24,194 కోట్లు అరువుతెచ్చి వినియోగించారు
ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వడ్డీతో సహా తీర్చాలిఃకాగ్


ఏపీః  రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా ఉందని, బడ్జెట్‌కు విశ్వసనీయత లేకుండా వ్యవహరించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తూర్పారపట్టింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పిన అంశాన్ని నివేదిక ధ్రువీకరించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోని డొల్లతనాన్ని కాగ్ ఎత్తిచూపింది. బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వ్యయం రూ.98,142 కోట్లుగా పేర్కొనగా ఇందులో 78.94 శాతం వ్యయాన్ని.. రెవెన్యూ రాబడుల నుంచి చేశారని, మిగతా రూ.24,194 కోట్లను ప్రభుత్వం అరువు తెచ్చిన నిధులను ఉపయోగించి చేశారని పేర్కొంది.

ఇలా వినియోగించిన అరువు నిధులను రాబోయే సంవత్సరాల్లో వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుందని, ఈ అదనపు భారానికి తగిన ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులు కూడా అరువు నిధుల వలన సమకూరవని స్పష్టం చేసింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట నిబంధనలను అతిక్రమించిందని, దీంతో రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని కాగ్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2014-15లో ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంస్కరణల లక్ష్యాలను సాధించజాలదని పేర్కొంది. 2014-15లో రూ.24,194 కోట్ల రెవెన్యూ లోటు నమోదు అయ్యిందని, ద్రవ్యలోటు రూ.31,717 కోట్లకు (6.10 శాతం) చేరిందని తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ద్రవ్యలోటు జీఎస్‌డీపీలో మూడు శాతానికి మించరాదని, అయితే ఇది 6.10 శాతానికి చేరిందని తెలిపింది. మొత్తం బకాయిలు జీఎస్‌డీపీలో 27.60 శాతం దాటకూడదని, కాానీ 32.03 శాతానికి చేరినట్లు కాగ్ పేర్కొంది. కాగ్ నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు..

 గ్రాంట్లు రాబట్టుకోవడంలో వైఫల్యం
13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.10,611.35 కోట్ల గ్రాంట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,665.84 కోట్లు మాత్రమే రాబట్టు కోగలిగింది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించడంలో జాప్యంతో పాటు వినియోగ ధ్రువపత్రాలు పంపించకపోవడం, ఇతర నిబంధనలు పాటించక పోవడంతో రూ.2,945.51 కోట్ల మేర గ్రాంటును రాష్ట్రం కోల్పోయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా రూ.1,572.78 కోట్ల గ్రాంటును స్థానిక సంస్థలు కోల్పోయాయి. కేంద్ర మార్గదర్శకాల మేరకు 13వ ఆర్థిక సంఘం నిధులను ఐదురోజుల్లోగా స్థానిక సంస్థలకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 17 సార్లు గడువు తీరిన తరువాత విడుదల చేయడంతో రూ.5.58 కోట్ల నివారించతగిన వడ్డీ చెల్లించాల్సి వచ్చింది.

రెవెన్యూ లోటు ఎక్కువ చూపారు
రెవెన్యూ లోటును ఎక్కువ చేసి చూపారని కాగ్ ఆక్షేపించింది. రూ.24,194 కోట్ల రెవెన్యూలోటులో ఉమ్మడి ఆంధ్రప్రదే శ్ రాష్ట్రానికి చెందిన (01-04-2014 నుంచి 01-06-2014 వరకు) రూ.10,417.49 కోట్లను కూడా చూపించారని పేర్కొంది. విద్యుత్ సంస్థల రుణాలైన రూ.6,994.46 కోట్లను గ్రాంటుగా మార్చడాన్ని రెవెన్యూ లోటుగా చూపించారని, ఇది అవాస్తవిక వ్యయం అని స్పష్టం చేసింది. రుణాలను భరించే సామర్ధ్యం తగ్గిపోతోందని కూడా కాగ్ పేర్కొంది. ప్రభుత్వ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి గ్యారెంటీపై తీసుకుంటున్న అప్పులను బడ్జెట్‌లో వెల్లడించడం లేదని తప్పుపట్టింది.

మార్చి 2015 నాటికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పులు రూ.1,66,580 కోట్లుగా కాగ్ పేర్కొంది. 50 శాతానికి పైగా అప్పులను ఏడు సంవత్సరాల గడువులో తీర్చాల్సి ఉంటుందని, అందువల్ల రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో చిక్కుకుంటుందని కాగ్ హెచ్చరించింది. సముచితమైన చెల్లింపుల వ్యూహాన్ని రూపొందించాలని సూచించింది. 2014-15 బడ్జెట్ కేటాయిపులలో వైరుధ్యమేర్పడిందని, బడ్జెట్ ప్రక్రియ, బడ్జెట్ పర్యవేక్షణ ప్రక్రియ, నిర్వహణ సమాచార వ్యవస్థ పటుత్వం మీద సందేహాలు కలుగుతున్నాయని కాగ్ పేర్కొంది.

ఆర్థిక సంవత్సరంలో వినమయ పద్దుల ఆడిట్ నిర్వహించగా 10 గ్రాంట్లు, ఒక అప్రోప్రియేషన్ విషయంలో.. ఒక్కొక్క కేసులోనూ రూ.100 కోట్ల కంటే అధికంగా, మొత్తం కేటాయింపుల్లో 20 శాతం కంటే ఎక్కువగా మిగుళ్లు (రూ.13,464.93 కోట్లు) ఏర్పడ్డాయని వెల్లడైంది. మొత్తం మిగుళ్లు రూ.18,387.47 కోట్లలో ఇది 73 శాతం. ఈ మిగుళ్లలో రూ.11,050.16 కోట్లు మూడు గ్రాంట్లలోనే ఉన్నాయని, ఇది బడ్జెట్ ప్రతిపాదనల్లోని ఖచ్చితత్వం, విశ్వసనీయతలపై సందేహాలు రేకెత్తిస్తోందని కాగ్ పేర్కొంది. అవాస్తవిక బడ్జెట్ కేటాయింపుల పర్యవసానంగా ఏర్పడిన భారీ మిగుళ్లు, అవసరం లేని అనుబంధ గ్రాంట్లు, కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చులు, అధిక రీ-అప్రోప్రియేషన్ల వలన ఏర్పడిన అదనపు వ్యయం వంటివి బడ్జెట్ నిర్వహణ లోపాలను సూచిస్తున్నాయని కాగ్ వ్యాఖ్యానించింది.
 
 సబ్ ప్లాన్‌లకు తక్కువ కేటాయింపులు
 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల వ్యయాన్ని కాగ్ తప్పుపట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఉప ప్రణాళికకు ప్రణాళికా వ్యయంలో 17.10% నిధులు కేటాయించా ల్సి ఉండగా... 16 శాతమే కేటాయించిందని, అలాగే ఎస్టీ ఉప ప్రణాళికకు 5.33 శాతం కేటాయించాల్సి ఉండగా 5.2 శాతమే కేటాయించారని కాగ్ తెలిపింది. ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.1,418.59 కోట్లకు, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.582.76 కోట్లకు రీ-అప్రోప్రియేషన్ చేశారు. ఇది పథకం అమలులో అసమర్థతను తెలుపుతుందని కాగ్ వ్యాఖ్యానించింది. 
Back to Top