ఏ నోట విన్నా జగన్.. జగన్.. జగన్..

కడప: జగన్.. జగన్.. జగన్..! ఏ నోట విన్నా.. ఎవరిని కదిపినా ఇదే మాట!! మరో ప్రజాప్రస్థానం జగన్నామస్మరణతో మార్మోగుతోంది. పాదయాత్రలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం తమ అభిమాన నేతను తలుచుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జైల్లో పెట్టినంత మాత్రాన జగన్‌ను తమ గుండెల్లోంచి తొలగించలేరని చెబుతున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని, జగన్ త్వరలోనే తమ ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ‘‘జగన్‌పై కక్షతోనే జైళ్లో పెట్టారు. వాళ్ల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా మేం మాత్రం వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం’’ అని పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శెట్టిబద్దుల రాజబాబు అని చెప్పారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని, ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావాలని విశాఖపట్నానికి చెందిన ఝాన్సీ అన్నారు. ‘‘చంద్రబాబు అవిశ్వాసం పెట్టమంటే పెట్టడం లేదు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యానడానికి ఇదే నిదర్శనం’’ అని ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సయ్యద్ గౌస్ పేర్కొన్నారు. ‘‘షర్మిలమ్మ పాదయాత్రకు ఎంతమంది జనం వచ్చారో చూశాక అయినా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంతమంది జగన్ వైపు ఉంటే ఆయన తప్పు చేయలేదని ఇంతమంది నమ్ముతుంటే ఇంకెన్నాళ్లు జైల్లో పెడతారు..’’ అని వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తికి చెందిన రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
గుండె చెబుతోంది.. పదం కలపమని!
‘‘చాలా దూరం.. ఒకటిన్నర రోజు ప్రయాణం.. 6 నెలలు.. 3 వేల కిలోమీటర్లు ఏదోఒక రోజు వెళ్లి పాదయాత్రలో పాల్గొనొచ్చులే అనుకున్నాం. కానీ మా గుండె మాత్రం మాట వినలేదు. షర్మిలమ్మ అడుగులో అడుగు కలపని చెప్పింది. అందుకే ఉండబట్టలేక వచ్చేశా..’ ఇదీ ఇతర జిల్లాల నుంచి పోటెత్తుతున్న జనం మాట!! షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, మహబూబ్ నగర్‌తోపాటు చాలా ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కోస్తా నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా.. ఇలా అన్ని ప్రాంతాల నుంచి ప్రజావాహిని తరలివచ్చింది. ఇక రాయలసీమ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top