మాఫియాలా ప్రశ్నపత్రాల మాల్‌ ప్రాక్టీస్‌

నారాయణ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా అక్రమం

అన్నింటికీ ఆద్యుడు, కర్త, నిర్దేశకుడు నారాయణే

ఆ విషయాన్ని నారాయణ సిబ్బందే చెప్పారు

పక్కా ఆధారాలతోనే నారాయణ అరెస్టు

మాల్‌ ప్రాక్టీస్‌పై ప్రభుత్వం కఠినంగా ఉంటుంది

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వానికి ప్రాధాన్యం

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేపల్లి: మాల్‌ ప్రాక్టీస్‌ తప్పు కాదని టీడీపీ చెప్పగలదా? అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప‌క్కా ఆధారాల‌తో నారాయ‌ణ‌ను అరెస్ట్ చేస్తే .. రాజ‌కీయ క‌క్ష‌తో అంటూ చంద్ర‌బాబు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వ్య‌వస్థలను మేనేజ్‌ చేస్తూ మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడి మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారని, ఇంతకంటే దిగజారుడుతనం ఏమైనా ఉందా బాబు అని ప్ర‌శ్నించారు. త‌ప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని, మాల్ ప్రాజ‌క్టీస్‌పై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. నారాయణ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా అక్రమాలు జ‌రుగుతున్నాయ‌ని, ఇదంతా నారాయ‌ణ క‌నుస‌న్న‌ల్లో కొన‌సాగుతుంద‌న్న విష‌యాన్ని నారాయ‌ణ విద్యా సంస్థ‌ల సిబ్బందే చెప్పార‌న్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యంలోని మీడియా పాయింట్‌ వ‌ద్ద వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల ఏం మాట్లాడారంటే..

నారాయణ విద్యా సంస్థల్లో జరిగింది ప్రశ్నపత్రాల లీక్‌ కాదు. పరీక్ష ప్రారంభం కాగానే, పేపర్‌ను ఫొటో తీసి, కొందరి వద్దకు పంపి, సమాధానాలు రాయించి, వాటిని విద్యార్థులకు చూపడం ద్వారా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో, మొత్తం వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ఈ వ్యవహారం జరిపారు. ఆ కేసులోనే అన్ని ఆధారాలతో నిన్న నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను అరెస్టు చేయడం జరిగింది. మరోవైపు పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే దీనిపై సీరియస్‌గా స్పందించిన సీఎం వైయస్‌ జగన్, తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టొద్దని స్పష్టం చేశారు. ఆ ప్రక్రియలోనే నారాయణను అరెస్టు చేశారు.

ఎప్పటి నుంచో మాల్‌ ప్రాక్టీస్‌
నిజానికి గతంలో కూడా నారాయణ విద్యా సంస్థల్లో ప్రశ్నపత్రాలు బయటకు తీసుకురావడం, తద్వారా మంచి ఫలితాలు వచ్చేలా చూడడం కొనసాగింది. ఎందుకంటే ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి. అప్పుడు అంతా సాఫీగా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తొలి రెండేళ్లు కోవిడ్‌ వల్ల పరీక్షలు జరగలేదు. ఈసారి పరీక్షలు నిర్వహించడంతో, ఆ విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారం బయట పడింది. 

ఆనవాయితీగా హేయమైన నేరం
ఒక నేరం జరిగినప్పుడు.. అందులోనూ ఒక అత్యంత హేయమైన నేరం. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే నేరం, పిల్లల మెరిట్‌ను దెబ్బ తీసే నేరం. పవిత్రమైన విద్యా వ్యవస్థను కళంకితం చేసే నేరం. అది కూడా వ్యక్తిగతంగా కాకుండా, సంస్థాపరంగా చేయడం. దాని కోసం మాఫియా ముఠా మాదిరిగా వ్యవహరించడం. ఒక ఆనవాయితీగా మారింది.

చర్య తీసుకోవాలా? వద్దా?
దీన్ని ఈ సమాజం ఎలా పరిగణించాలి. ఇలాంటి నేరం తిరిగి జరగకుండా ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి? చూసీ చూడనట్లు వదిలేయాలా? లేదా ఈ వ్యవహారంలో పునాదుల వరకు వెళ్లి నియంత్రించాలా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలా? వద్దా?.నిజానికి విద్యార్థుల భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చర్యలను అభినందిస్తారు. పిల్లల భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా ఒక చెదపురుగుగా మారి, వ్యవస్థను కూడా నాశనం చేస్తున్న వ్యవహారాన్ని.. ఒకేసారి కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదం మోపినందుకు అభినందించాలి.

తప్పు ఒప్పుకోక పోగా..యాగీ
కానీ అలాంటిది. మీరు గమనిస్తే.. నిన్న నారాయణను అరెస్టు చేస్తే.. టీడీపీ నాయకులు,. ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. నారాయణ సంస్థల్లో జరుగుతోంది తప్పు అని ఒప్పుకోవాలి. వ్యవస్థలో చీడపురుగుల్లా మారిన, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరాలి. కానీ వారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ప్రశ్నపత్రాలు బయటకు వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్న నిందితులు ఇచ్చిన నేర అంగీకార స్టేట్‌మెంట్‌ ప్రకారమే, నారాయణను అదుపులోకి తీసుకున్నారు. కానీ చంద్రబాబు ఇది రాజకీయ కక్ష అని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. నిన్న ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా న్యాయ కోవిదులు, మేధావులతో సీరియస్‌గా చర్చించారు. ఒక గొప్ప మేధావి, సంఘ సంస్కర్తను అరెస్టు చేస్తే, ఎలా వ్యవహరిస్తారో.. నారాయణను అరెస్టు చేయగానే, చంద్రబాబు ఆ విధంగా పని చేశారు. అసలు నారాయణను అరెస్టు చేస్తే చంద్రబాబు ఎందుకు అంతగా భయపడుతున్నారు? ఆ విద్యా సంస్థల వెనక చంద్రబాబు ఉన్నారా?. మరోవైపు నిన్న నారాయణను అరెస్టు చేసినప్పటి నుంచి ఎల్లో మీడియా చేసిన హడావిడి, దుష్ప్రచారం కూడా అంతా ఇంతా కాదు. ఆయన కుమారుడి వర్థంతి జరుపుతుంటే అరెస్టు చేశారని, చాలా దూరం ఉంది కాబట్టి చిత్తూరు తీసుకుపోయారని.. ఏదేదో ప్రచారం చేశారు. ఇంకోసారి ఆయనను ఎక్కడికో తీసుకుపోయారని దుష్ప్రచారం చేశారు.

ఆ మాట టీడీపీ చెప్పగలదా?
నిజానికి మాల్‌ ప్రాక్టీస్‌ తప్పు కాదని టీడీపీ చెప్పగలదా? నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని, ఇతర విద్యార్థులకు నష్టం జరుగుతున్నా ఆ పార్టీ సమర్థిస్తుందా?. తమకు నారాయణే అన్నీ డైరెక్ట్‌ చేస్తారని, ఆ సంస్థల సిబ్బంది స్వయంగా నేర అంగీకార స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాతే, నారాయణను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

అంత హడావిడిగా అవసరమా?
తెల్లవారుజామున బెయిల్‌. అంత అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ఇంటి వద్ద వాదనలు ఏమిటి? అది అంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందా?. నారాయణ 2014లోనే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ ఆయనే అన్నీ చూసుకుంటున్నాడు కదా? పైగా మాఫియాలా పని చేస్తున్న ఈ మాల్‌ ప్రాక్టీస్‌ పూర్తిగా నారాయణ కనుసన్నల్లోనే జరుగుతోందని సిబ్బంది స్వయంగా చెప్పినా బెయిల్‌ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాంకేతికపరంగా నారాయణ ఛైర్మన్‌ కాకపోవచ్చు. ఆయన అల్లుడు ఇప్పుడు ఆ సంస్థలు చూస్తుంటే, రేపు ఆయనను అదుపులోకి తీసుకున్నా, టీడీపీ ఇలాగే స్పందిస్తుందా?

మాల్‌ ప్రాక్టీస్‌ను అదుపు చేస్తాం
ఏదేమైనా వ్యవస్థను నాశనం చేస్తున్న మాఫియాను కచ్చితంగా అదుపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తోంది. తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గదు.

ఎంత కాలం ఆ ముసుగులో..
చంద్రబాబుకు ఒక మాట. ఆయన ప్రతిదీ రాజకీయ కక్ష అంటున్నారు. నిజంగా అదే నిజమైతే అధికారం చేపట్టగానే అది జరిగేది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయడం లేదు. మాఫియా వ్యవహారం బయటపడిన తర్వాత, పక్కా ఆధారాలతోనే నారాయణను అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి ఎంత కాలం ఇలా రాజకీయ కక్షలంటూ విమర్శలు చేస్తూ, ఆ ముసుగులో ఇలాంటి నేరాలను కూడా సమర్థిస్తారు.

తాజా వీడియోలు

Back to Top