నవరత్నాలతో రాజన్న రాజ్యం

జూటూరు (పత్తికొండ రూరల్‌) : వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో రాజన్య రాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందామని ఆపార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని జూటూరులో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. బూత్‌ కమిటీ కన్వినర్‌ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గడపగడపకూ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లుగా నెరవేర్చని హామీలను ప్రజలకు వివరించారు. రామకృష్ణ, రామాంజినేయులు, లలితమ్మలు తాము ఇప్పటివరకు అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందుకోలేకపోయామని నాయకులకు తెలిపారు. ఈసందర్భంగా శ్రీరంగడు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో వంచన రాజ్యమేలిందని చెప్పారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరిన వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. నవరత్నాలతో రాజన్న ఉన్నప్పటి సంక్షేమ రాజ్యం తిరిగి తెచ్చుకుందామన్నారు. రాజన్నకు గుర్తుగా జగనన్నకు తోడుగా ప్రజలు బాసటగా నిలవాలన్నారు. 32 మందిని వైయస్‌ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. కార్యక్రమంలో మండల కన్వినర్‌ బజారప్ప, నాయకులు శ్రీనివాసులు, అశోక్, వడ్డే సంజన్న, మాజీ సర్పంచు లక్ష్మన్న, రంగన్నలు పాల్గొన్నారు.

Back to Top