వైయస్ఆర్‌ కాంగ్రెస్ వారం రోజుల నిరసనలు

హైదరాబాద్:

రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వర్తమానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానా‌నికి తీవ్ర నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 3 శుక్రవారం రాష్ట్ర బంద్‌ చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ సూచించింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ  వైయస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

‘రాష్ట్రపతి వర్తమానాన్ని’ కేంద్రం పంపిన విధానం రాజ్యాంగ స్ఫూర్తిని, సమాఖ్య స్ఫూర్తిని ఎగతాళి చేసేలా ఉందని పార్టీ పీఏసీ సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశం వివరాలను పార్టీ పీఏసీ సభ్యుడఉ డాక్టర్ ఎం‌వీ మైసూరారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
కేంద్రం ఆ వర్తమానం పంపిన తీరు చూస్తే ఇక్కడుండేది ఒక రాష్ట్రమని, ప్రభుత్వం, చట్ట సభలున్నాయనే గుర్తింపు కూడా లేకుండా సొంత ఇంటి వ్యవహారంగా ప్రవర్తించిందని మైసూరారెడ్డి విమర్శించారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా శాసనసభలో వ్యవహరిస్తున్న తీరును కూడా మైసూరా తీవ్రంగా తప్పు పట్టారు.

వారం రోజుల నిరసనల క్రమం ఇదీ :
కేంద్ర ప్రభుత్వ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నెట 3 శుక్రవారం బంద్ చేయడంతో పాటు వరుసగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు ‌నిర్వహించాలని పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు పార్టీ పిలుపు ఇచ్చిందని మైసూరారెడ్డి తెలిపారు. 4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో జరిగే పరిణామాలను బట్టి ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణను కూడా ఖరారు చేస్తామన్నారు.

మన రాష్ట్రం విడిపోతే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మూడూ దారుణంగా నష్టపోతాయని, అందుకే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సమైక్యం కోసం త్రికరణశుద్ధితో పోరాడుతోందని‌ మైసూరారెడ్డి తెలిపారు. ఏపీ ఎన్జీవో‌ల బంద్ కూడా 3వ తేదీనే ఉందని మీడియా ప్రస్తావించినప్పుడు శాసనసభా సమావేశాలు ప్రారంభం అవుతున్నది 3నే కనుక తమ పార్టీ బంద్‌కు పిలుపు ఇచ్చిందని, రెండూ యాదృచ్ఛికం కావచ్చన్నారు. అయినా సమైక్యం కోసం ఎవరు ఆందోళనకు పిలుపునిచ్చినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్, విభజించాలని లేఖ ఇచ్చిన టీడీపీతో కలిసి తమ పార్టీ పనిచేయబోదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

విజయమ్మ పేర్కొన్న ఆ 18 అంశాలపై చర్చకు సిద్ధమే :
అవినీతిపై శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ‌టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై మైసూరారెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబుకు సంబంధించి 18 అవినీతి అంశాలపై తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ హైకోర్టులో‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారని, సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకుని ఆయన విచారణను ఆపుకొన్నారని మైసూరా గుర్తుచేశారు. ఆ అంశాలపై చంద్రబాబు పిలిస్తే చర్చకు తాము రెడీ అన్నారు.

మంత్రుల శాఖలు మార్చడం సీఎం ఇష్టమని, శ్రీధర్‌బాబు శాఖను మార్చడం వల్ల ఒరిగేదేమీ ఉండబోదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. బిల్లుపై చర్చ జరగాలని సీఎం చేసిన సూచనను ప్రస్తావించగా గతంలో రాష్ట్రాల ఏర్పాటులో గానీ, విభజనలో గానీ ఆయా అసెంబ్లీల్లో తీర్మానాలు చేయడం ద్వారానే సాధ్యమైందని అన్నారు. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ అందుకు కచ్చితంగా ఒక ప్రాతిపదిక ఉండాలన్నారు. ఇదే విషయం సర్కారియా, పూంఛి కమిషన్లు రెండూ చెప్పాయని మైసూరారెడ్డి అన్నారు.

Back to Top